Nallamala Forest: నంద్యాల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మహానంది సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతంలో భారీగా కార్చిచ్చు చెలరేగింది. గత రెండు రోజులుగా అడవిలో మంటలు కొనసాగుతుండటంతో అటవీ సంపదతో పాటు వన్యప్రాణుల మనుగడకు ముప్పు ఏర్పడింది. అటవీ శాఖ సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు శ్రమిస్తున్నప్పటికీ, వేసవి గాలుల వల్ల మంటలు మరింతగా విస్తరిస్తున్నాయి.
బుధవారం రాత్రి నుంచి అడవిలోని దయ్యాలతిప్ప, మోకాళ్ళ తిప్ప, మోటు ప్రదేశాల్లో మంటలు తీవ్రంగా చెలరేగాయి. ఎండిపోయిన ఆకులు, చెట్లు ఉండటంతో మంటలు వేగంగా వ్యాపిస్తున్నాయి. అటవీ శాఖ సిబ్బంది భూమార్గంలో వెళ్లి మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నా, భౌగోళిక పరిస్థితులు ప్రతిబంధకంగా మారాయి. మంటలు ఆదుపులోకి రాకపోవడంతో, వెంటనే హెలికాప్టర్ ద్వారా నీటిని చల్లి కార్చిచ్చును ఆర్పాలని స్థానికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
నల్లమల అటవీ ప్రాంతం పులులు, చిరుతలు, అడవి పందులు, జింకలు వంటి వన్యప్రాణులకు ఆవాసం. మంటల ధాటికి ఈ జంతువులు ప్రాణభయంతో పరుగులు తీస్తున్నాయి. కార్చిచ్చు కారణంగా వన్యప్రాణుల ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని జంతు ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ అడవిలో అరుదైన ఔషధ గుణాలు కలిగిన వనసంపద ఉంది. మంటల వల్ల వేలాది విలువైన మొక్కలు బూడిదయ్యే ప్రమాదం ఉంది.

మార్చి నెల మధ్యలో కూడా ఇదే తరహాలో మహానంది ఆలయ వెనుక భాగంలో మంటలు చెలరేగాయి. అప్పట్లో అధికారులు అప్రమత్తమై అదుపు చేసినప్పటికీ, వేసవి తీవ్రత దృష్ట్యా మళ్ళీ మంటలు చెలరేగడం కలకలం రేపుతోంది. కొన్ని చోట్ల మానవ తప్పిదాల వల్ల, మరికొన్ని చోట్ల అటవీ ఘర్షణ వల్ల మంటలు వస్తున్నాయని భావిస్తున్నారు.
“ప్రస్తుతం మంటలు వేగంగా విస్తరిస్తున్నాయి. అటవీ శాఖ అధికారులు కేవలం భూమార్గంలో ప్రయత్నిస్తే సరిపోదు. పరిస్థితి అదుపు తప్పకముందే గాలి ద్వారా మంటలను ఆర్పే చర్యలు తీసుకోవాలి.” – స్థానిక నివాసితులు
అటవీ శాఖ ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఈ కార్చిచ్చును అదుపులోకి తేవాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

