(వి శంకరయ్య)
వేసవిలో సీమకు తాగునీటికి కటకట తప్పదు.
ఎపి తెలంగాణ రాష్ట్రాలు ఒకరికొకరు పోటీ పడి సాగు నీటికోసం శ్రీ శైలం జలాశయం నీరు ఎత్తి పోతల ద్వారా తరలించు తున్నారు. ఫలితంగా నీటి మట్టం రోజు రోజుకు పడిపోతోంది. ఫిబ్రవరి తొలి వారంలో కృష్ణ బోర్డు రెండు రాష్ట్రాలను హెచ్చరించింది. ఎత్తిపోతల నిలుపుదల చేయాలని కోరింది.
ఆ రోజుల్లో ఎపి హంద్రీనీవా ద్వారా 960 క్యూసెక్కులు తెలంగాణ కల్వకుర్తి ద్వారా 1600 క్యూసెక్కులు నీరు తరలిస్తుండగా తాము కోటా ప్రకారం 2.7 టియంసిలు వాడు కోవాలని జవాబు ఇచ్చాయి.
ఆ రోజుల్లో జలాశయంలో 53.95 టియంసిలు వున్నాయి. నీటి మట్టం 834.10 అడుగులుగా వుంది.
ఇప్పటికి నెల పూర్తి అయింది. రెండు రాష్ట్రాలు నీటిని ఎత్తిపోతల ద్వారా తరలిస్తున్నారు. ఎన్నికల ముందు చిత్తూరు జిల్లాకు నీరు తరలించి ముఖ్యమంత్రి చంద్రబాబు జలహారతి ఇచ్చేందుకు హంద్రీనీవా ద్వారా అప్పటి నుండి ఇప్పటి వరకు ఎపి 960 క్యూసెక్కుల నీరు తరలించు తుండగా తెలంగాణ ఇప్పటికి మరింత పెంచి2200 క్యూసెక్కుల నీరు తరలించు తోంది. ఇద్దరూ కలిసి మొత్తం 3360 క్యూసెక్కుల నీరు తరలించు తున్నారు. ఫలితంగా ఫిబ్రవరి తొలివారంలో53. 95 టియంసిలు నీరు వుంటే మార్చి 4 వతేదికి 48 టియంసిలకు పడిపోయింది. నీటి మట్టం 828.50 పడి పోయింది. ఎపి లో అధికారులు ఈ అంశం పట్టించుకోవడం లేదు. కుప్పంకు జలాలు చేరాలంటే పంపింగ్ జరగాల్సినదే. ఫలితంగా తెలంగాణను అడ్డ గించే స్థితిలో లేరు.
ఒకరికొకరు పోటీ పడి మార్చిలో నే జలాశయ నీటి మట్టం 800 అడుగులకు పడిపోతే ముచ్చు మర్రి నుండి కూడా అనంతపురం కర్నూలు జిల్లాల ప్రజలకు తాగునీరు కూడా ఎత్తి పోసే అవకాశం వుండదు.
గత ఏడాది ఇదే కాలంలో జలాశయంలో 63.94 టియంసిలు నీరు వుండగా నీటి మట్టం 840.70 అడుగులుగా వుంది.
మరో విశేషం ఏమిటంటే ఈ ఏడు నీటి సంవత్సరంలో శ్రీ శైలం జలాశయానికి 582.91 టియంసిలు నీరు చేరినా వచ్చిన నీరు వచ్చి నట్లు కిందకు వదిలారు. వేసవి వచ్చే సరికి సీమ ప్రజలు సాగు నీరు అటుంచగా తాగు నీటికి కటకట లాడాలసి వస్తోంది.
మరోవైపు సాగర్లోమాత్రం పుష్కలంగా నీరు వుంది. శ్రీ శైలం జలాశయం నుండి ఈ నీటి సంవత్సరంలో సాగర్ కు 332.38 టియంసిల నీరు చేరింది. ప్రస్తుతం సాగర్ లో 162.35 టియంసిలు నీరు వుంది. గత ఏడాది ఇదే కాలంలో సాగర్ లో153. 69 నీరు మాత్రమే వుండగా సాగర్ నీరు ప్రస్తుతం పొదుపుగా ఉపయోగించు తున్నారు. కాని శ్రీ శైలం వచ్చే సరికి కృష్ణ బోర్డు హెచ్చరించినా ఇద్దరూ పోటీ పడి నీటిని తోడేస్తున్నారు. అంతిమంగా వేసవిలో సీమ ప్రజలు తాగునీటికి వలసలు పోవలసి వస్తుందేమో.
