జీవీఎల్: కన్నా తిట్టారు.. కాపులు సన్మానించారు!

గతకొన్ని రోజులుగా కన్నా లక్షమీనారాయణ పార్టీ మార్పుపై జరుగుతున్న ఊహాగానాలకు తాజాగా తెరపడింది. బీజేపీకి కన్నా లక్ష్మీనారాయణ గుడ్‌బై చెప్పేశారు. రాజీమానా లేఖ కూడా బీజేపీ అధిష్టానానికి పంపించేశారు. అయితే బీజేపీకి రాజీనామా చేయడానికి గల కారణాలను చెప్పే విషయంలో బీజేపీ ఎంపీ జీవీఎల్ పై విమర్శలు చేసిన కన్నా… తాను బీజేపీని వీడిపోవడానికి జీవీఎల్ కూడా ఒక కారణం అన్న స్థాయిలో క్లారిటీ ఇచ్చారు.

ఆ విమర్శలపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కన్నా చేసిన వ్యాఖ్యలు రాజకీయ దురుద్దేశమేనని, పార్టీలో సోము‌వీర్రాజు తీసుకున్న నిర్ణయాలు పార్టీ అధిష్టానానికి‌ చెప్పే చేశారని, సోము ఏకపక్షంగా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని క్లారిటీ ఇచ్చారు! సరిగ్గా కన్నా లక్ష్మీనారాయణ, జీవీఎల్ పై విమర్శలు చేసిన రోజే.. జీవీఎల్ కు సన్మానం జరిగింది!

అవును… రాధా రంగ మిత్ర మండలి, కాపు సంఘాల ప్రతినిధులు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు నివాసానికి వెళ్లారు. పార్లమెంటు‌ లో వంగవీటి రంగా గురించి ప్రస్తావించినందుకు జీవీఎల్ ను సన్మానించారు. అనంతరం స్పందించిన కాపు నేతలు… పార్టమెంట్‌ లో రంగా జీవితం గురించి ప్రస్తావించడంతోపాటు.. రంగా పేరుతో జిల్లా పేరు పెట్టాల్సిన అవసరం ఉందని జీవీఎల్ అడిగినందుకు కృతజ్ఞతలు తెలిపామని అన్నారు!

కాపు సామాజిక వర్గ నేత కన్నా లక్ష్మీనారాయణ ఏరోజైతే జీవీఎల్ పై విమర్శలు గుప్పించారో… సరిగ్గా అదేరోజు ఆ కాపు సంఘాల ప్రతినిధులు జీవీఎల్ ను సన్మానించడంతోపాటు.. జిల్లా కు రంగా పేరు పెట్టినవారికే తమ మద్దతు ఉంటుందని ప్రకటించడం కొసమెరుపు! మరి కాపులు, కన్నా లక్ష్మీనారాయణ కు తోడుగా ఉంటారా – జీవీఎల్ పోరాటానికి మద్దతుగా ఉండీ సహాయపడతారా అన్నది వేచి చూడాలి!!