బాబును మళ్లీ తగులుకున్న సాయిరెడ్డి… ఓటిపడవకు అలంకారాలు?

గతంలో ట్విట్టర్ వేదికగా వైరల్ వ్యాఖ్యలు చేసేవారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. ఆ సమయంలో ముఖ్యంగా వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజుపై ఆయన వేసిన సెటైర్లు, చేసిన కామెంట్లు వైరల్ అయ్యేవి. వాటిపై ట్రిపుల్ ఆర్ కూడా తీవ్రంగా స్పందించేవారు.

అయితే తర్వాత కొంతకాలం సాయిరెడ్డి సైలంట్ గా ఉండిపోయారు. ఈ క్రమంలో తాజాగా మరోసారి ఫుల్ యాక్టివ్ అయినట్లు కనిపిస్తున్నారు. ఇందులో భాగంగా ముఖ్యంగా చంద్రబాబు చేస్తున్న ప్రకటనల్ని, ఆయన యాత్రల్ని, లోకేష్ టంగ్ స్లిప్స్ ని, నాలుగు రోజుల క్రితం చిరంజీవిని సైతం ట్విట్టర్ వేదికగా వాయించి వదిలారు.

ఇలా ఎప్పటికప్పుడు ప్రత్యర్థులను టార్గెట్ చేస్తూ ట్వీట్స్ రూపంలో ట్రోల్ చేస్తున్నారు. ఇదే క్రమంలో తాజాగా వైజాగ్ లో చంద్రబాబు విడుదల చేసిన “విజన్ – 2047” ను టార్గెట్ చేశారు విజయసాయిరెడ్డి.

వైజాగ్ లో టీడీపీ అధినేత చంద్రబాబు “గ్లోబల్‌ ఫోరం ఫర్‌ సస్టెయినబుల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌”(జీఎఫ్‌ఎస్‌టీ) ఛైర్మన్ హోదాలో ఇండియా విజన్ – 2047 డాక్యుమెంట్ ను విడుదల చేశారు. ఇందులో భాగంగా… స్వాతంత్రం సాధించి వందేళ్లు పూర్తి చేసుకునే నాటికి (2047) భారత్ గ్లోబల్ పవర్ గా ఎదగాలంటే అనుసరించాల్సిన ఐదు వ్యూహాల్ని విడుదల చేశారు.

దేశ పురోభివృద్ధిలో తొలి అడుగు అయ్యేలా.. విజ్ఞాన వినియోగ సామర్థ్యం పెంపొందించి, దాన్ని అవసరమైన వర్గాలకు అందించడం ద్వారా వారి అభివృద్ధికి సోపానాలు వేయడమే విజన్‌-2047 లక్ష్యమని చంద్రబాబు చెప్పుకొచ్చారు. సరిగ్గా ఇదే విషయంపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.

“విజన్ 2020 అని దేశమంతా తిరిగి స్వీయ ప్రగల్భాలు పలికినా 2004లో ప్రజలు చిత్తుగా ఓడించారు” అని బాబుకు గుర్తుచేసిన విజయసాయిరెడ్డి.. “ఇప్పుడు విజన్ 2047 అంటూ మరో గారడీ చేయాలని చూస్తున్నారు” అని ఆక్షేపించారు. ఫైనల్ గా… “ఓటి పడవకు పైన ఎన్ని అలంకారాలు చేసినా నీటిలోకి వెళ్లిన తర్వాత మునగక తప్పదు” అంటూ సాయిరెడ్డి టీడీపీని చంద్రబాబుని ఉద్దేశించి సెటైర్లు వేశారు.

కాగా… గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు విజన్ 2020 గురించి చెప్పిన సంగతి తెలిసిందే. కానీ 2004 నాటికి ఆయన రాష్ట్రంలో అనుసరించిన విధానాలు, చేసిన దారుణాల కారణంగా అధికారం కోల్పోయారు. తిరిగి అధికారంలోకి రావడానికి ఆయనకు పదేళ్లు పట్టింది.

ఇదే సమయంలో 2014లో విభజిత ఆంద్రప్రదేశ్ లో బీజేపీ, జనసేన కూటమి పొత్తుతో చంద్రబాబు తిరిగి అధికారం సాధించగలిగారు. అప్పుడు కూడా విజన్ 2029 ని తెరపైకి తెచ్చారు. అయితే 2014 సమయంలో ఆయన అధ్వాన్న పాలన ఫలితంగా 2019లో 23సీట్లకే ప్రజలు పరిమితం చేశారు. ఈ నేపథ్యంలో మరోసారి విజన్ 2047 ని తెరపైకి తెచ్చారు. ఈ సందర్భంగా సాయిరెడ్డి ట్వీట్ చేశారని తెలుస్తుంది!