ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటూ పోలీస్ బాస్ లు తెగ ప్రచారం చేస్తున్నా అది ఆచరణలో మాత్రం కానరావడం లేదు. కొందరు నిజంగానే ఫ్రెండ్లీ పోలీసింగ్ లా ప్రవర్తిస్తున్నా మరి కొందరు మాత్రం తమ డ్రెస్ పవర్ చూసి సామాన్యుల పై విర్రవీగుతున్నారు. బడా బాబులకు గులాంగిరి చేసే కొందరు పోలీసులు సామాన్యునికి మాత్రం చుక్కలు చూపిస్తున్నారు. తాజాగా హైదరాబాద్ లో ఓ పండ్ల వ్యాపారి పై టోలిచౌకి ట్రాఫిక్ ఎస్ ఐ దురుసుగా ప్రవర్తించారు.
రోడ్డు మీద పండ్ల బండి పెట్టి అమ్ముతున్నాడని అతనికి చలాను రాశాడు. అంతటితో ఊరుకోలేదు. “మాక్కె లౌడే” అని తిట్టాడు. ఈ తతంగాన్ని అంతా అక్కడ ఉన్న ఓ యువకుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. దానిని హైదరాబాద్ పోలీస్ కు ట్యాగ్ చేశాడు. దీంతో ఈ విషయం పోలీస్ బాస్ అంజనీకుమార్ దృష్టికి వెళ్లింది. వెంటనే ట్రాఫిక్ ఎస్ ఐ అంజాద్ ను కార్ హెడ్ క్వార్టర్స్ కు అటాచ్ చేశారు. పండ్ల వ్యాపారి పట్లు దురుసుగా ప్రవర్తించిన ఎస్ ఐ పై చర్యలు తీసుకున్నామని హైదరాబాద్ సిపి అంజనీ కుమార్ తెలిపారు.
