ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏంటి.? ప్రశ్నిస్తున్న తమిళనాడు.!

‘మా రాజధాని చెన్నయ్.. మీ రాజధాని ఏంటి.?’ అని తమిళనాడు ప్రశ్నిస్తోంది.! ఎందుకీ దుస్థితి.? ఇంకెందుకు, సినీ నటుడు రజనీకాంత్ మీద వైసీపీ నేతలు కొందరు అనవసరపు విమర్శలు చేశారు మరి.!

మంత్రి రోజా కావొచ్చు, మరో మంత్రి జోగి రమేష్ కావొచ్చు, మాజీ మంత్రి కొడాలి నాని కావొచ్చు.. ప్రముఖ సినీ నటుడు రజనీకాంత్ విషయంలో బోర్డర్ దాటి విమర్శలు చేశారు. స్వర్గీయ ఎన్టీయార్ శత జయంతి వేడుకల్లో పాల్గొన్న రజనీకాంత్, తన మిత్రుడు చంద్రబాబు మీద కొన్ని ప్రశంసలు గుప్పించారు. అది వైసీపీకి నచ్చలేదు.

నిజానికి, ఇక్కడ రజనీకాంత్‌ని తప్పు పట్టడానికేం లేదు. చంద్రబాబు గౌరవంగా పిలిచారు గనుక, ఆయన మీద ప్రేమతో కొన్ని పొగడ్తలు గుప్పించక తప్పలేదు రజనీకాంత్‌కి. దాని వల్ల వైసీపీకి వచ్చే నష్టమేంటి.?

ఈ విషయమై సోషల్ మీడియా వేదికగా వైసీపీ చాలా అత్యుత్సాహమే చూపింది. రజనీకాంత్ అల్లుడు, ప్రముఖ సినీ నటుడు ధనుష్‌ని కూడా వివాదాల్లోకి లాగింది. దాంతో, తమిళ సినీ అభిమానులంతా ఒక్కటయ్యారు. తమిళనాడులోని సాధారణ నెటిజన్లు కూడా ఈ విషయంలో రజనీకాంత్‌కి అండగా నిలిచారు.

‘తమిళనాడు రాజధాని చెన్నయ్.. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది.?’ అంటూ కొడాలి నానినీ, మంత్రి రోజానీ సోషల్ మీడియాలో ట్యాగ్ చేస్తూ ప్రశ్నలు గుప్పించారు. ఈ ప్రశ్నకు వైసీపీ ఏం సమాధానం చెప్పగలదు.? అవసరమా ఈ లొల్లి.?