బీజేపీ సీనియర్ నేత, విదేశీ వ్యవహారాల మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ (67) మంగళవారం రాత్రి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సుష్మా ఇటీవల ఎయిమ్స్లో చేరారు. అయితే చికిత్స అందిస్తుండగానే గుండె పోటు రావడంతో ఆమె మృతిచెందినట్టు వైద్యులు ప్రకటించారు. సుష్మా స్వరాజ్ మరణవార్తను తెలుసుకున్న కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, హర్షవర్దన్, రాజ్నాథ్ సింగ్ హుటాహుటిన ఆసుపత్రికి వెళ్లారు. సుష్మా స్వరాజ్ అకాల మృతికి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాన్ని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంతాపం తెలిపారు.
సుష్మా స్వరాజ్ హఠాన్మరణంతో బీజేపీ శ్రేణులన్నీ విషాదంలో మునిగిపోయాయి. బీజేపీ తొలితరం నేతల్లో ఒకరైన సుష్మా స్వరాజ్ 1953 ఫిబ్రవరి 14న హర్యానాలోని అంబాలాలో జన్మించారు. కేంద్రంలో వివిధ హోదాల్లో పనిచేసిన సుష్మా స్వరాజ్ ఇటీవలే మూత్రపిండాల మార్పిడి చికిత్స చేయించుకున్నారు. దీంతో 2019లో జరిగిన సాధారణ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు. ‘జీవితంలో ఈ రోజు కోసం ఎదురుచూస్తున్నాను..’ జమ్మూ కశ్మీర్ కు సంబంధించి ఆర్టికల్ 370 రద్దు కు లోక్ సభ ఆమోదం పొందిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షాలకు అభినందనలు తెలుపుతూ చివరి ట్వీట్ చేశారు
మహోన్నతమైన శకానికి తెరపడింది: మోదీ
బీజేపీ సీనియర్ నాయకురాలు సుష్మా స్వరాజ్ అకాల మృతికి ప్రధాని నరేంద్రమోదీ సంతాపం తెలిపారు. భారత రాజకీయ చరిత్రలో మహోన్నతమైన శకానికి తెరపడిందన్నారు. ‘సుష్మా స్వరాజ్ ఎందరో ప్రజలకు ప్రేరణ కల్పించారు. పేద ప్రజల జీవితాలను మెరుగుపరిచేందుకు ప్రయత్నించారు. అహర్నిషలు దేశ సేవ కోసం తపించారు’అంటూ మోదీ ట్వీట్ చేశారు.
సీఎం వైఎస్ జగన్ సంతాపం
కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నాయకురాలు సుష్మాస్వరాజ్ అకాలమరణం దిగ్భ్రాంతికి గురిచేసిందని ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి అన్నారు. అపార అనుభవం, సంయమనం, రాజకీయ నైపుణ్యం కలబోసిన నాయకురాలు ఆమె అని వ్యాఖ్యానించారు. రాజకీయాలకు అతీతంగా మనన్నలందుకున్న గొప్ప పార్లమెంటేరియన్ అని కొనియాడారు. సుష్మాస్వరాజ్ కుటుంబానికి సీఎం తన సంతాపాన్ని తెలియజేశారు.
