ఆంధ్రప్రదేశ్ లో తాజాగా జరిగిన పంచాయితీ ఎన్నికలలో వెలువడిన ఫలితాలతో రాజకీయ పార్టీలు, నేతలలో భవిష్యత్ గురించి మేధో మధనం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే జనసేన పార్టీ రాజకీయ ప్రయాణం గురించి రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. జనసేన పార్టీ కొన్ని కొన్ని విషయాల్లో చాలా వరకు కూడా బలంగానే ముందుకు వెళ్తున్నది. భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్న తర్వాత రాష్ట్రంలో జనసేన పార్టీకి నష్టమే తప్ప లాభం ఏమాత్రం ఒనగూడలేదనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది.

గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత జనసేన పార్టీ ప్రముఖ నేత తోట చంద్రశేఖర్ ఏ రాజకీయ కార్యక్రమంలోనూ కనిపించింది లేదు. దీనిపై చర్చలు జరుగుతున్నాయి. జనసేన పార్టీ అగ్రనేతలు గా ఉన్న నాదెండ్ల మనోహర్, తోట చంద్రశేఖర్ వంటి నేతలు ఈ మధ్యకాలంలో ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అయితే నాదెండ్ల మనోహర్ స్పీడ్ గా వెళుతున్న సరే తోట చంద్రశేఖర్ మాత్రం కాస్త ప్రజల్లోకి వెళ్ళే విషయంలో కొంచెం స్లోగానే ఉన్నారు. అయితే ఇప్పుడు మరికొందరు కీలక నేతలు బయటకు వచ్చే అవకాశాలు ఉండవచ్చన్న అంచనా వేస్తున్నారు. ఈ తరుణంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీ మంచి ప్రభావం చూపించడం తో కొంత మంది బీజేపీ నేతలు కూడా జనసేన పార్టీ లోకి వెళ్ళిపోయే ఆలోచనలో ఉన్నారట.
బీజేపీలో ఉన్నా సరే ఎలాంటి ప్రయోజనం లేదని, త్వరలోనే జనసేన పార్టీ బీజేపీతో పొత్తు తెంచుకునే అవకాశాలు ఉండవచ్చు అని భావిస్తున్నారు. అందుకే ఇప్పుడు బయటకు వచ్చి జనసేన పార్టీలో చేరే ఆలోచనలో బీజేపీ నేతలు ఉన్నారని సమాచారం. ఈ నేపధ్యంలోనే విశాఖ జిల్లాకు చెందిన బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు, ఉత్తరాంధ్రకు చెందిన కొంతమంది నేతలు కూడా జనసేన పార్టీలో చేరే అవకాశాలు ఉండవచ్చు అనే ప్రచారం జరుగుతుంది. అగమ్యగోచరంగా మారిన తెలుగు దేశం పార్టీ భవిష్యత్ తో అయోమయంలో పడిన ఆ పార్టీ నేతలు కూడా జనసేన వైపు చూస్తున్నారని తెలుస్తుంది.
