‘జనసేన’ ఎన్నికల గుర్తు గాజుగ్లాస్‌పై చెర్రీ కామెంట్

రామ్ చరణ్ కు తన బాబాయ్ పవన్ కళ్యాణ్ అంటే ఎంత అభిమానమో మనందరికీ తెలిసిందే. ఆయన ఆ అభిమానాన్ని మరోసారి స్టేజీపై అభిమానుల సాక్షిగా చూపించారు. గురువారం హైదరాబాద్‌లో వినయ విధేయ రామ చిత్రం ట్రైలర్‌ విడుదల కార్యక్రమంలో ఆయన పవన్ కళ్యాణ్ పార్టీ ‘జనసేన’ ఎన్నికల గుర్తు గాజుగ్లాస్‌ గురించి మాట్లాడారు.

రామ్ చరణ్ మాట్లాడుతూ..‘‘ఈ మధ్య ఎవరూ జ్యూస్‌లు, కాఫీలు తాగడం లేదు. అందరూ టీలే తాగుతున్నారు. ఈ చిన్న టీ కప్పు ఏదో ఒక పెద్ద పని సృష్టిస్తుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నా. మా బాబాయ్‌ (పవన్‌) సినిమాలన్నీ వదిలేసి రాజకీయాల్లోకి వచ్చి ప్రజల కోసం యుద్ధం చేస్తూ ఇంటింటికీ వెళ్లి తిరుగుతుంటే ఓ వైపు ఆనందంగా ఉంది.

మరోవైపు ఇంత కష్టపడుతున్నారనే బాధ కూడా ఉంది. మా కుటుంబంలో బాధ కంటే ఇతరుల బాధను తీర్చే ఓ వ్యక్తి మా కుటుంబం నుంచి వచ్చారనేది చెప్పుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. మాకు సముద్రమంత కుటుంబాన్ని ఇచ్చారు. నాన్నకు థ్యాంక్స్‌’’ అని రామ్‌ చరణ్‌ కామెంట్స్ చేసారు.