విజనరీ చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో మునుపెన్నడూ లేని పరిస్థితిలు నెలకొన్నాయి. అలా అని ఇవి ఎమ్మెల్యేలు, వారి అనుచరులు చేస్తోన్న వీరంగాల గురించి, దారుణాల గురించి కాదు.. మహిళలు, బాలికలపై జరుగుతున్న దాడుల గురించీ కాదు.. ఈ పరిస్థితి రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత గురించి. ఇంధనం అందుబాటులో లేక నడిరోడ్లపై వాహనాలు ఆగిపోవడంతో.. మహిళలు, చిన్నపిల్లలతో ప్రత్యక్ష నరకం చూసిన అంశం గురించి.
ఈ సందర్భంగా… గతంలో లోకేష్ చెప్పిన మాటలు, చంద్రబాబు విజన్, కేంద్రంలో పలుకుబడిపై పలు కీలక ప్రశ్నలు తెరపైకి వస్తోన్నాయి.
అవును… మునుపెన్నడూ లేని క్లిష్ట పరిస్థితులను రాష్ట్రం ఎదుర్కొంటుంది.. ఇది ఎన్ని రోజులు కొనసాగుతుందనే విషయంపై స్పష్టత కరువైందని తెలుస్తోంది. ఎందుకంటే… డీజిల్, పెట్రోల్ సరఫరా పెరగాలంటూ చంద్రబాబు సమీక్షలో వెల్లడించారు. అంతేకాదు.. ఈ పరిస్థితికి అధికారుల వైఖరే కారణమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇలా చంద్రబాబు సమీక్ష, ఆగ్రహం వంటి శీర్షికలు పత్రికల్లో చూసినవారు.. సరికొత్త ఆందోళనలకు గురవుతున్నారని అంటున్నారు.
కేంద్రంలో ఈ రోజు ఎన్డీయే కూటమి అధికారంలో ఉందంటే.. అందుకు ప్రధనా కారణం టీడీపీ అనే సంగతి తెలిసిందే. ఈ ఎంపీల మద్దతే ఎన్డీయే కూటమికి సంజీవనిలా పనిచేస్తోంది! అలాంటి పార్టీకి అధినేత, అలాంటి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు… ఈ విషయంలో ఎందుకు మెతక వైఖరి అవలంభిస్తున్నారనే చర్చ జరుగుతుంది.
ఇదే సమయంలో… ఎన్నికల ప్రచార సమయంలో టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఏపీ మంత్రి నారా లోకేష్ ఇచ్చిన హామీని ప్రజలు గుర్తు చేస్తున్నారు. దానికి సంబంధించిన వీడియోలను మరోసారి సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.
ఇక్కడ మరో షాకింగ్ విషయం ఏమిటంటే… వాహనాల్లోనే కాకుండా బాటిళ్లలోనూ పెట్రోల్, డీజిల్ కొట్టాలని ప్రజలు ఎందుకు అడుగుతున్నారు? దేశమంతా ఇలాంటి పరిస్థితి లేదు! మిగిలిన దక్షిణాది రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు వంటి రాష్ట్రాల్లోనూ కొరత లేదు! కేవలం ఆంధ్రప్రదేశ్ లోనే ఈ పరిస్థితి ఎందుకొచ్చింది..? ఇది ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
దీనికి ఓ వర్గం మీడియా సంధిస్తోన్న సందేహం ఏమిటంటే…? దీని వెనుక కుట్ర దాగిఉందని! మరి ఇంతకు మించినది ఏమైనా ఉంటుందా అంటే… అది వారే చెప్పాలి!
ఇక తాజాగా ఈ విషయంపై స్పందించిన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్… రాష్ట్రంలో ఇంధన కొరత లేదని, ఈ విషయాన్ని గమనించాలని వాహనదారులకు సూచించారు! ఓ పక్కేమో… రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 4,500 పైగా బంకుల్లో సగానికి పైగా మూతపడిన పరిస్థితి! దీనిపై సీఎం సమీక్ష, ప్రజల్లో తీవ్ర ఆందోళన… పౌర సరఫరాల శాఖ మంత్రి మాత్రం రాష్ట్రంలో ఇంధన కొరత లేదని స్టేట్ మెంట్!
ఈ విధంగా… ఒక్క ప్రభుత్వంలో ఇన్ని రకాల వెర్షన్స్ వినిపించే సరికి… దీనిపైనా ప్రజలను ఏమార్చే పనేనా అనే కామెంట్లు వినిపిస్తున్నాయి!
మరింత వివరంగా చెప్పుకోవాలంటే… మార్చి 31న పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్.. అధికారులతో ఇంధన వినియోగంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా.. రోజువారీ సగటు పెట్రోల్ వినియోగం 7,900 కిలో లీటర్లు అని.. డీజిల్ 20,000 కిలో లీటర్లు ఉందని తెలిపారు. అంతేగాక డీజిల్ సరఫరాను 8%, పెట్రోల్ ను 2.4% అదనంగా పెంచినట్టు వెల్లడించారు.
కట్ చేస్తే… ఆంధ్రప్రదేశ్ లో పెట్రోల్, డీజిల్ సంక్షోభం తీవ్రంగా వేధిస్తున్న విషయాన్ని చంద్రబాబు సూచన ప్రాయంగా అంగీకరించారు!
టెన్షన్ పెడుతోన్న చంద్రబాబు మాటలు!:
తాజాగా ఈ వ్యవహారంపై అధికారులతో సమీక్షించిన చంద్రబాబు… సోమవారానికల్లా రాష్ట్రానికి పెట్రోలు, డీజిల్ సరఫరా పెరిగేలా చూడాలని.. ఏ షాపు వద్దా నో స్టాక్ బోర్డులు కనిపించకూడదని స్పష్టంగా ఆదేశించారు. మరోవైపు… సాధారణ పరిస్థితులు నెలకొనేవరకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటుచేయాలని చెప్పారు. ఆక్వా రైతులు, వరికోత యంత్రాలకు డీజిల్ కొరత రాకుండా కూపన్ విధానం ప్రవేశపెట్టాలని ఆదేశించారు.
ఓ పక్క సోమవారానికి ఏ షాపు ముందూ నో స్టాక్ బోర్డులు కనిపించకూడదని చెప్పిన చంద్రబాబు… మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొనేవరకు స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని చెప్పడం మరింత ఆందోళన కలిగిస్తుందని అంటున్నారు. మరి… ఇందులో ఏది వాస్తవం, మరేది సోమవారానికి జరుగుతుందనేది వేచి చూడాలి!
వైరల్ అవుతోన్న లోకేష్ హామీ!:
ఈ సందర్భంగా మరో ఆసక్తికర విషయం తెరపైకి వచ్చింది.. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎన్నికల ప్రచార సమయంలో నారా లోకేష్ మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలే ఇవి. అవేమిటంటే… వైసీపీని ఓడిస్తే… విద్యుత్ ఛార్జీలు తగ్గుతాయని.. అదేవిధంగా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయని ఆయన హామీ ఇచ్చారు. కట్ చేస్తే… ధరల సంగతి అలా ఉంచి, పెట్రోల్, డీజిల్ దొరకని పరిస్థితులు కేవలం ఏపీలో మాత్రమే నెలకొన్నాయి! ఇక విద్యుత్ ఛార్జీలు, గ్యాస్ ధరల సంగతి తెలిసిందే!
