మాట మార్చిన నాగబాబు, ప్రవచనాలెందుకు చెబుతున్నారో.!

సినీ నటుడు, నిర్మాత నాగబాబు సోషల్ మీడియా వేదికగా మాట మార్చారు. ‘ఏపాటి వాడైనా..’ అన్న నాగబాబులో మార్పు వచ్చింది. ‘గరికపాటివారు..’ అంటూ గౌరవంతో తాజాగా ట్వీటేశారు. ఇంతలో ఎంత మార్పు.? అసలు ఈ మార్పు ఎలా సాధ్యమైంది.?

మెగాస్టార్ చిరంజీవిని అదిలించే ప్రయత్నం చేసి చాలా పెద్ద తప్పిదానికి పాల్పడ్డారు ప్రవచనకారుడు గరికపాటి నరసింహారావు. ఆయన పండితుడే కావొచ్చు.. కానీ, వయసులో చిరంజీవి కంటే చిన్నవాడే కదా.! చిరంజీవి మెగాస్టార్.. మాజీ కేంద్ర మంత్రి. సమాజంలో బోల్డంత పలుకుబడి వున్న వ్యక్తి. ‘మీరు ఫొటోసెషన్లు ఆపి, వస్తారా.? నన్ను వెళ్ళిపోమంటారా.?’ అంటూ గరికపాటి గదమాయించడం ఆయన అహంకార ధోరణికి నిదర్శనం.

కానీ, చిరంజీవి సంయమనం పాటించారు. అక్కడితో ఆయన హుందాతనం పదింతలయ్యింది. గరికపాటి ఇమేజ్ పాతాళానికి పడిపోయింది. అయితే, నాగబాబు సహా మెగాభిమానులు కొంత ఘాటుగా స్పందించడంతో, గరికపాటి పేరు సోషల్ మీడియాలో మార్మోగిపోయింది. అనవసరంగా అతనికి స్పేస్ ఇచ్చాం.. అనే భావన చాలామంది మెగాభిమానుల్లో వ్యక్తమయ్యింది కూడా.

‘ఇదంతా అనవసరం..’ అని చిరంజీవి చెప్పారో, లేదంటే.. అనవసరంగా కెలుక్కున్నాం.. అని నాగబాబుకే అనిపించిందో.. కారణమేదైతేనేం, ‘గరికపాటిని ఏమీ అనొద్దు..’ అంటూ మెగాభిమానులకు నాగబాబు సూచించారు. ఈ మేరకు తాజాగా ట్వీటేశారు నాగబాబు. సో, ఇక్కడితో ఈ వివాదం ముగిసినట్లే.
కాగా, తెలుగుదేశం పార్టీ.. ఈ వివాదాన్ని మేగ్జిమమ్ స్థాయికి తీసుకెళ్ళేందుకు ప్రయత్నించి భంగపడటం ఈ మొత్తం వ్యవహారంలో కొసమెరుపు