కాంగ్రెస్ మాజీ మంత్రి ముఖేశ్ గౌడ్ మృతి
ఒక్కరోజు తేడాలో ఇద్దరు కాంగ్రెస్ నాయకులూ మృతి చెందారు . ఆదివారం ఉదయం కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి మరణించారు . సోమవారం మధ్యాన్నం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి ముఖేశ్ గౌడ్ చనిపోయారు . జైపాల్ రెడ్డి నిమోనియా జ్వరంతో ఆసుపత్రిలో చేరి చనిపోగా ముఖేశ్ గౌడ్ కొంతకాలం నుంచి క్యాన్సర్ వాదితో బాధపడుతూ సోమవారం మరణించారు . ఆయన వయసు 60 సంవత్సరాలు . ముఖేశ్ గౌడ్కు భార్య లక్ష్మి , ఇద్దరు కుమారులు విక్రమ్ గౌడ్ , విశాల్ గౌడ్ , ఒక కుమార్తె శిల్ప ఉన్నారు.
ముఖేశ్ గౌడ్ 1959 జులై 1 హైద్రాబాద్లో జన్మించిన గౌడ్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో డిగ్రీ చదువుకున్నారు . అనంతరం రాజకీయాల్లో చేరారు .
యూత్ కాంగ్రెస్ నేతగా ముఖేశ్ గౌడ్ ఎంతో చురుకుకా ఉండేవారు . కాంగ్రెస్ భావజాలానికే ఆకర్షితులైన ఆయన విద్యార్థి దశలో కాంగ్రెస్ అనుబంధ సంస్థ ఎన్ఎస్యూఐ లో పనిచేశారు. యువజన కాంగ్రెస్లో కీలక నేతగా వ్యవహరించారు. 1986లో తొలిసారి ఆయన జాంబాగ్ నుంచి కార్పొరేటర్గా విజయం సాధించారు.
1989లో మహారాజ్ గంజ్ నుంచి తొలిసారిగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. అనంతరం 2004లో అదే నియోజకవర్గం నుంచి మరోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009లో గోషామహల్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు . ఆ తర్వాత రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్లో మార్కెటింగ్ శాఖ మంత్రిగా పనిచేశారు. ఏప్రిల్లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల సందర్భంగానూ తీవ్ర అస్వస్థతకు గురైన ముఖేశ్ గౌడ్.. అంబులెన్స్లో వచ్చి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ముఖేశ్ గౌడ్ అంత్యక్రియలు మంగళవారం రోజు జరుగుతాయి .
