మాజీ మంత్రి, వైసీపీ నేత మోపిదేవి వెంకటరమణ మరో వివాదంలో ఇరుక్కున్నారు. మోపిదేవి సీనియర్ రాజకీయ నాయకుడు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. సీనియర్ ఎమ్మెల్యేగా, సీనియర్ మంత్రిగా రాజకీయాల్లో చక్రం తిప్పారు మోపిదేవి. గ్రూపు రాజకీయాలకు దూరంగా ఉంటూ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ అగ్రనేతగా వెలుగొందారు. వైఎస్ శిష్యరికంలో ఒకరిగా గుర్తింపు పొందారు.
తాపీగా సాగుతున్న ఆయన రాజకీయ ప్రస్థానానికి ఒక్కసారిగా బ్రేకులు పడ్డాయి. వైఎస్ మరణం తర్వాత మోపిదేవి పరిస్థితి గడ్డుగా మారింది. జగన్ ఆస్తుల కేసులో ఏడాదిపైనే జైల్లో గడిపారు. వాన్ పిక్ సంస్థకు అక్రమంగా భూములు మంజూరు చేసారని ఈయనపై అభియోగాలు ఉన్నాయి. ఆయన కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీ నుండి ఎటువంటి మద్దతు లభించలేదు కనీసం ఓదార్చేవారు కూడా కరువయ్యారు. ఈ కారణంగానే సోదరుడు మోపిదేవి హరనాధ్ తో పాటు మోపిదేవి వెంకట రమణ కాంగ్రెస్ ను వీడి వైసీపీలో చేరారు అనుకుంటారు. అయినప్పటికీ ఆయన రాజకీయ భవిష్యత్తు చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు.
ఏ నియోజకవర్గంలో అయితే చక్రం తిప్పారో అదే నియోజకవర్గంలో ఆయనకు సవాళ్లు ఎదురవుతున్నాయి. గురువారం జరిగిన ఒక హత్యా వివాదం మోపిదేవి మెడకు చుట్టుకుంది. రేపల్లె నియోజకవర్గంలోని నిజాంపట్నంలో మోపిదేవి వెంకట రమణ ఇంటికి దగ్గరలో శీలం మహివర్ధన్ అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. నిందితులు పట్టపగలే కళ్ళలో కారం కొట్టి నడిరోడ్డుపై పరిగెత్తించి ఇనుప రాడ్డుతో కొట్టి చంపిన ఘటన స్థానికంగా భయాందోళనలకు గురి చేసింది. మహివర్ధన్ నిజాంపట్నంలో ఎక్స్ మిలిటరీ కాలనీలో తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. అతని మృతితో భార్య రత్నావళి, కుమార్తెలు, కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.
పోలీసుల కధనం ప్రకారం…
అయితే ఈ హత్యకు మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ సోదరుడు హర్షవర్ధన్ కి సంబంధం ఉందని మృతుని బంధువులు, గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. మీదులపర్రు భూవివాదంలో నాయకుడిగా వ్యవహరిస్తున్నాడని శీలం మహివర్ధన్ ను హత్య చేసినట్లు తెలుస్తోంది. మోపిదేవి సోదరుడు హరనాధ్ బాబు, అనుచరులు కన్నా బసవ శంకరరావు, కన్నా కృష్ణం రాజు, కన్నా వెంకట ప్రసాద్, కన్నా రవి, కన్నా నోములరాజు, కన్నా దాసమోహనరావు, పీతా నన్నూరయ్య, పీతా వీరాంజనేయులు, నాయుడు శ్రీనివాస్, సేరు వెంకటేశ్వరరావు, కొక్కిలిగడ్డ చలపతిరావులకు… ఎక్స్ మిలిటరీ కాలనీ దళితులకు మధ్య మీదులపర్రు భూముల విషయంలో రెండేళ్లుగా వివాదాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే వీరంతా కలిసి తన భర్తపై హత్యకు పాల్పడ్డారని మృతుడి భార్య శీలం రత్నావళి చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు సిఐ వీరాంజనేయులు పేర్కొన్నారు. శీలం రత్నావళి వివరాలు వెల్లడిస్తున్న వీడియో కింద ఉండి చూడండి.
మోపిదేవి రాకతో ఉద్రిక్తత, బాధితుల డిమాండ్ ఇదే…
బాధితుల్ని పరామర్శించేందుకు మోపిదేవి వెంకటరమణ అక్కడకు చేరుకోగా…మోపిదేవి వెంకటరమణ డౌన్ డౌన్ అంటూ ఆందోళన చేశారు కుటుంబీకులు, ప్రజాసంఘాల నాయకులూ, గ్రామస్థులు. హత్య చేయించి పలకరించేందుకు వచ్చావా అంటూ ఆయనపైకి ఆగ్రహంతో వెళ్లగా అక్కడే ఉన్న డిఎస్పీ స్నేహిత అడ్డుపడ్డారు. తర్వాత మోపిదేవికి కూడా సర్దిచెప్పి వెనక్కి పంపించారు. ఎక్స్ గ్రేషియా 20 అందించాలని, మోపిదేవి వెంకటరమణ సోదరుడు హరనాధ్ బాబును, కన్నా బసవశంకరావులను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్, మాజీ మంత్రి, జనసేన నాయకుడు రావెల కిషోర్ బాబు, జాయింట్ కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్, తెనాలి ఆర్డీవో శ్రీనివాసరావు, డిఎస్పీ స్నేహిత అక్కడికి చేరుకున్నారు. కాగా కలెక్టర్ వచ్చేవరకు మృతదేహాన్ని తరలించే ప్రసక్తి లేదని కుటుంబసభ్యులు, స్థానికులు ధర్నాకు దిగారు. నాయకులూ, అధికారులు నచ్చజెప్పినా వినకపోవడంతో కలెక్టర్ కోన శశిధర్, ఎస్పీ రాజశేఖర్ కు సమాచారం అందించారు అధికారులు. చివరికి ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్, జాయింట్ కలెక్టర్ ఇంతియాజ్ న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చాక శవాన్ని పోస్టుమార్టంకు తరలించేందుకు ఒప్పుకున్నారు. రాత్రి 8 గంటల సమయంలో సిఐ పంచనామా నిర్వహించి శవాన్ని రేపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ అందించిన సాయం
మహివర్ధన్ కుటుంబాన్ని ప్రభుత్వపరంగా ఆదుకునేందుకు కృషి చేస్తామన్న అనగాని తనవంతు సాయంగా ఐదు లక్షల రూపాయలు సొంతంగా ఇస్తామని బాధితులకు హామీ ఇచ్చారు. దళితుల పట్ల మోపిదేవి సోదరులు వ్యవహరించిన తీరు సరికాదని హెచ్చరించారు. ఇటీవల మాచర్లలో దళితుడైన ప్రేమ్ కుమార్ ను మోపిదేవి అనుచరుడు జగన్ అతని అనుచరుల సారధ్యంలో హత్యచేశారని ఆగ్రహించారు. మోపిదేవి హత్యారాజకీయాలు ప్రోత్సహిస్తున్నారని, వీరి తీరుతో ప్రజలు ఆందోళన చెందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మహివర్ధన్ హత్యకు కారకులు ఎంతటివారైనా కేసు నమోదు చేసి న్యాయం జరిపించాలని డీఎస్పీని కోరారు రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్.
