ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. నగర శివారు ప్రాంతమైన కానూరు కొత్త ఆటోనగర్లో కేంద్ర బలగాలు, పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన సోదాల్లో ఏకంగా 27 మంది మావోయిస్టులు, సానుభూతిపరులు, మిలీషియా సభ్యులను అరెస్టు చేశారు. వీరిలో 12 మంది మహిళలు ఉన్నారు.
కీలక ప్రకటన చేసిన ఇంటెలిజెన్స్ ఏడీజీ మహేష్ చంద్ర లడ్డా
ఏపీ ఇంటెలిజెన్స్ ఏడీజీ మహేష్ చంద్ర లడ్డా ఈ అరెస్టులకు సంబంధించి కీలక ప్రకటన చేశారు. విజయవాడ, కాకినాడ కలిపి మొత్తం 31 మంది మావోయిస్టులను అరెస్టు చేసినట్లు తెలిపారు. అరెస్టు అయిన వారిలో 9 మంది కేంద్ర కమిటీ సభ్యులు ఉన్నారని వెల్లడించారు.
ఆటోనగర్లో ఏం జరిగింది?
న్యూ ఆటోనగర్లోని ఓ భవనంలో మావోయిస్టులు ఉన్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు గ్రేహౌండ్స్, ఆక్టోపస్ బలగాలు స్థానిక పోలీసుల సహకారంతో తనిఖీలు నిర్వహించాయి. అరెస్టు అయిన వారంతా సుమారు పది రోజుల కిందట కూలీ పనుల కోసం వచ్చామని చెప్పి ఆ భవనాన్ని అద్దెకు తీసుకుని ఉంటున్నారు. వీరిలో నలుగురు కీలక మావోయిస్టులు, 11 మంది సానుభూతిపరులు/మిలీషియా సభ్యులు ఉన్నారు. వీరంతా ఛత్తీస్గఢ్కు చెందినవారిగా భావిస్తున్నారు. భవనం యజమాని నెలన్నరగా విదేశాల్లో ఉన్నట్లు తెలియడంతో, పోలీసులు భవనం వాచ్మెన్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

అరెస్టు చేసిన మావోయిస్టుల నుంచి భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు ఏడీజీ లడ్డా తెలిపారు. 1525 ఎలక్ట్రికల్ డిటోనేటర్లు, 150 నాన్ ఎలక్ట్రికల్ డిటోనేటర్లు. రెండు ఏకే 47 తుపాకులు, ఒక పిస్టల్, ఒక రివాల్వర్ సహా పలు ఆయుధాలు. మావోయిస్టులు నాలుగు చోట్ల డంప్లు ఏర్పాటు చేసినట్లు సమాచారం అందడంతో, వాటిని స్వాధీనం చేసుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారు.
మరోవైపు, మంగళవారం ఉదయం మారేడుమిల్లి అడవుల్లో జరిగిన ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు మహేష్ చంద్ర లడ్డా వెల్లడించారు. చనిపోయిన వారిలో మావోయిస్టు కీలక నాయకుడు హిడ్మా, అతని భార్య కూడా ఉన్నట్లు ఆయన వివరించారు.

