కెటియారే టార్గెట్…

దేశాల మధ్య జరిగే డిప్లొమాటిక్ వార్ చిత్రంగా ఉంటుంది. ఒక దేశం గూఢచర్యం అనుమానంతో శతృ  దేశానికి చెందిన రాయబార కార్యాలయం నుంచి ఒక అధికారిని బహిష్కరిస్తే, ఆదేశం అదే నేరంతో ఈ దేశ రాయబార కార్యాలయంలో అదే ర్యాంకులో ఉండే అధికారిని బహిష్కరిస్తుంది.

డేటా చౌర్యం కేసులో ఆంధ్ర తెలంగాణ ప్రభుత్వాలు ఇలాగే ప్రవర్తిస్తున్నాయి. చంద్రబాబు, నారా లోకేష్ లు టార్గెట్ తెలంగాణ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేస్తే, కెటి రామరావు లక్ష్యంగా ఆంధ్ర పోలీసులు ఇపుడు సిట్ ఏర్పాటు చేశారు.

తెలుగు దేశం పార్టీకి చెందిన సభ్యుల సమాచారాన్ని దొంగిలించారనే ఫిర్యాదు మీద తెలంగాణ పోలీసు అధికారుల మీద, రాజకీయ నేతల మీద ఆంధ్రప్రదేశ్ పోలీసులు దర్యాప్తు జరుపనున్నారు.జగన్ తో కలిపి, డేటా చౌర్యం పేరుతో చంద్రబాబు ను ఓడిచేందుకు వెనక నుండి కథ నడిపిస్తున్నది కెటియారేనని టిడిపి బలంగా నమ్ముతూ ఉంది. అందుకే ఎదురుదాడి చేసేందుకు  దర్యాప్తు మొదలుపెట్టింది.

దీనికోసమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం  ఒక సిట్ లేదా పోటీ సిట్, ఏర్పాటుచేసింది.

ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం అధ్యక్షుడు కిమిడి కళావెంకటరావు చేసిన ఫిర్యాదుతో ఈ సిట్ ఏర్పాటు మొదలయింది. ఫిర్యాదు ప్రకారం, వైసిపి, టిఆర్ ఎస్ నేతలతో పాటు తెలంగాణ పోలీసుల పేర్లను నేరస్థులుగా చేర్చే అవకాశం. ఉంది.

తెలంగాణ నుంచి ప్రముఖంగా టిఆర్ఎస్ వర్కింగ్ ప్రశిడెంట్ కెటిరామారావును కేసులో చేర్చే అవకాశం ఉందని విశ్వసనీయంగా తెలిసింది.

డేటా చౌర్యం గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి మీద, ఐటి మంత్రి లోకేష్ మీద కెటియార్  తీవ్రంగా దాడి చేస్తున్నారు. ఈ విషయం మీదే  కొద్ది రోజులుగా లోకేష్, కెటిఆర్ మధ్య ట్వీట్ వార్ నడుస్తూ ఉంది. వీటన్నింటిని బట్టి చూస్తే, టిడిపి డేటా చౌర్యం కేసులో  కెటియార్ ను కీలకమయిన నిందితుని చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

టిడిపి డేటా చౌర్యం గురించి ఆ పార్టీ రెండు రోజులుగా క్యాంపెయిన్ మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. తెలుగుదేశం సమాచారం దొంగిలించి, ఆ సమాచారం మేరకు టిడిపి సభ్యులకు సానుభూతి పరులకు వైసిసి కాల్ సెంటర్, కెటియార్ కాల్ సెంటర్ల  నుంచి ఫోన్లు చేస్తున్నారని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి ఐటి మంత్రి నారా లోకేస్ వాయిస్ రికార్డు లతో  చేసి ట్వీట్ చేశారు.

దీనితో తమ డేటా కొట్టేశారని , దాని మీద దర్యాప్తు చేసేందుకు టిడిపి కోరిందని  రాష్ట్ర ప్రభుత్వం పోటీ సిట్ (స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్) ను ఏర్పాటుచేసింది. రవాణా శాఖ కమిషనర్‌, అదనపు డీజీపీ ఎన్‌.బాలసుబ్రమణ్యం నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం గురువారం నాడు ఈ సిట్‌ ఏర్పాటు చేసింది.

ఈ సిట్‌లో మరొక ఎనిమిది మంది పోలీసు అధికారులను సభ్యులుగా ఉంటారు. వీరిలో ఒకరు ఐజీ స్థాయి, ముగ్గురు ఎస్పీ స్థాయి అధికారులతో పాటు సైబర్‌ నేరాల నిపుణులను సభ్యులుగా ఉన్నారు.
విజయవాడ, విశాఖపట్నం సైబర్‌ నేరాల పోలీసు స్టేషన్ల సిబ్బంది నుంచి అవసరమయిన సాయాన్ని సిట్ తీసుకుంటంది. ఇంకా అవసరమయితే,మరి కొందరిని సభ్యులుగా చేరుస్తారు.

వైసిసి నాయకులు, తెలంగాణ  సీనియర్‌ పోలీసు అధికారులు, ఆ రాష్ట్ర రాజకీయనాయకుల సహకారంతో టిడిపి సభ్యత్వాల సమాచారాన్ని తస్కరించారని ఏపీ టిడిపి అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావు చేసిన ఫిర్యాదు తో ఈ సిట్ ఏర్పాటు చేశారు.

కళా వెంకటరావు రెండు రోజుల కిందట గుంటూరు గ్రామీణ ఎస్పీ రాజశేఖర్‌బాబుకు ఫిర్యాదు చేశారు. తుళ్లూరు పోలీసుస్టేషన్‌ లో గురువారం మధ్యాహ్నం ఈ మేరకు కేసు నమోదుజరిగింది.చాలా లోతయిన దర్యాప్తు అవసరమయినందున రాష్ట్ర ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసింది.

కేసు ను క్షుణ్ణంగా పరిశీలించేందుకు మంగళగిరి ఏపీ పోలీసు ప్రధాన కార్యాలయంలో శుక్రవారం మధ్యాహ్నం తొలిసమావేశం జరగుతుంది. ఈకేసు మీద ఐపిసి 120బి (నేరపూరిత కుట్ర), ఐపిసి418( అవతలి వ్యక్తికి నష్టం కలిగించే ఉద్దేశంతో మోసం చేయటం),ఐపిసి420 (మోసం), ఐపిసి 380 (దొంగతనం),ఐపిసి 409( విశ్వాస ఘాతుకం),ఐపిసి 167 (ప్రభుత్వ ఉద్యోగి తప్పుడు పత్రాలు సృష్టించటం), ఐపిసి 177 (తప్పుడు సమాచారాన్ని సమర్పించటం), ఐపిసి182( ప్రభుత్వ ఉద్యోగి మరొకరికి హానిచేసేలా తప్పుడు సమాచారం సృష్టించటం),ఐపిసి 511(నేరానికి పాల్పడేందుకు ప్రయత్నించటం) దర్యాప్తు జరుగుతుంది.

సిట్ సభ్యులు: పి.హరికుమార్‌ (ఐజీ, ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌), పీహెచ్‌డీ.రామకృష్ణ( ఎస్పీ, ఎస్‌ఐబీ), ఎస్‌.వి.రాజశేఖర్‌బాబు( ఎస్పీ, గుంటూరు గ్రామీణ), డి.మేరీ ప్రశాంతి (ఎస్పీ, సీసీపీఎస్‌, సీఐడీ), యు.రామ్మోహన్‌రావు( అదనపు ఎస్పీ, ఎఫ్‌ఎస్‌ఎల్‌0, పి.అనిల్‌కుమార్‌ (డీఎస్పీ, డీటీసీ, విశాఖపట్నం గ్రామీణ), నాగమల్లేశ్వరరావు(ఇన్‌స్పెక్టర్‌, సైబర్‌ నేరాల విభాగం, సీఐడీ), ఎస్‌కే.రహీముల్లా (ఎస్సై, సైబర్‌ నేరాల విభాగం, సీఐడీ).