కొడంగల్ లో సర్పంచ్ అభ్యర్ధి కిడ్నాప్ కలకలం (వీడియో)

కొడంగల్ నియోజకవర్గంలో కిడ్నాప్ కలకలం రేగింది. నిటూరు గ్రామ పంచాయతీ నుంచి కాంగ్రెస్ అభ్యర్ధి బలపరిచిన విశ్వనాథ్ బుధవారం నామినేషన్ వేయాల్సి ఉంది. తెల్లవారుజామున ఉదయం 2 గంటలకు విశ్వనాథ్ ను దుండగులు ఎత్తుకెళ్లారు. ఉదయం నుంచి విశ్వనాథ్ కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు, పార్టీ శ్రేణులు ఆందోళన చెందుతున్నారు.

నామినేషన్ కు ఈ రోజే చివరి రోజు కావడం, అభ్యర్ధి లేకపోవడంతో అంతా అయోమయంగా ఉన్నారు. పార్టీ అభ్యర్ధి కిడ్నాప్ విషయం తెలుసుకున్న రేవంత్ రెడ్డి గ్రామానికి చేరుకున్నారు. పరిస్థితి తెలుసుకొని వికారాబాద్ ఎస్పీకి ఫిర్యాదు చేశారు.  

గతంలో నిటూరు గ్రామంలో హత్యలు జరిగాయని అధికార పార్టీ వారే కాంగ్రెస్ అభ్యర్ధిని నామినేషన్ వేయకుండా కిడ్నాప్ చేశారని కాంగ్రెస్ శ్రేణులు ఆరోపిస్తున్నారు. విశ్వనాథ్ ను కూడా కిడ్నాప్ చేసి హత్య చేస్తారేమోనని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి సర్పంచ్ ఎన్నికల పై ఫోకస్ పెట్టి ఎలాగైనా గెలవాలనే లక్ష్యంతో ఆయన ప్రణాళిక సిద్దం చేస్తున్నారని తెలుస్తోంది. ఇంత పక్కా ప్లాన్ తో ఉన్న సమయంలో సర్పంచ్ అభ్యర్ది కిడ్నాప్ కు గురికావడంతో అందరిలో కలవరం మొదలైంది. నామినేషన్ వేసేందుకు నేడే బుధవారం ఆఖరి రోజు కావడంతో విశ్వనాథ్ తరపున ఇతర సభ్యుని ద్వారా నామినేషన్ వేయించే ప్రక్రియ చేస్తున్నారు. 

రేవంత్ రెడ్డి సర్పంచ్ అభ్యర్ధి కుటుంబ సభ్యులను పరామర్శించిన వీడియో కింద ఉంది చూడండి