(యనమల నాగిరెడ్డి)
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడం రాజకీయ నాయకుల భాద్యత. ఇలాంటి విషయాలపై స్పందించడం ప్రత్యేకించి పార్టీ అధినేతలకు అవసరం. శ్రీకాకుళం జిల్లాలో ఏర్పాటు చేయ తలపెట్టిన ధర్మల్ విద్యుత్ కేంద్రాన్ని ప్రజాభీష్టం మేరకు తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత రద్దు చేస్తామని వైస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి చేసిన ప్రకటన పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా ఆయన నిన్న ధర్మల్ ప్లాంట్ కు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న ప్రజలను వాళ్ల శిబిరానికి వెళ్లి కలుసుకున్నారు. కాకరాపల్లి లో 3050 రోజులుగా ప్రజలు ప్రాజక్టుకు వ్యతిరేకంగా దీక్ష చేస్తున్నారు. జగన్ వారి దగ్గిరకు వెళ్లి పరామర్శించి మద్దతు తెలిపి హామీ ఇచ్చారు.ఇది హర్షణీయ.
అయితే కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ కోసం సాగుతున్న ఆందోళన మీద జగన్ ఈ ఉత్సాహం ఎందుకు చూపడం లేదు?
రాష్ట్ర విభజన చట్టంలో పొందుపరచిన కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటు కోసం వైస్సార్ పార్టీ అధినేత ఎందుకు గొంతు విప్పడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. రాయలసీమ ప్రజల డిమాండ్లకు ఒక న్యాయం? ఇతర ప్రాంతాల వారికి ఒక న్యాయమా? అని పలువురు ప్రశ్నిస్తున్నారు. రాయలసీమ అవసరాలపై ఆయనకు ఎందుకింత చిన్న చూపు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్ర విభజన సమయంలో కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం “కమిటీని వేసి ఆరు నెలల లోగా ఫ్యాక్టరీ ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై నివేదిక తెప్పించి అనే చిన్న మెలిక” పెట్టి కడపకు ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేస్తామని చట్టంలో పేర్కొన్నారు. రాయలసీమ ప్రజల కన్నీళ్లు తుడవడం కోసమే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఏర్పాటు చేసింది.
కడపలో ఉక్కు ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని గత నాలుగున్నర సంవత్సరాలుగా రాయలసీమలో పలు రాజకీయ పార్టీలు , ఉద్యమసంఘాలు, ప్రజాస్వామికవాదులు అనేక ఆందోళనలు చేశారు. బీజేపీ నాయకులు అడపా దడపా “ప్రధాని నరేంద్ర మోడీ” కడప ఉక్కుకు శంఖుస్థాపన చేస్తారని సన్నాయి నొక్కులు నొక్కారు. కానీ ఆచరణలో ఫలితం సూన్యం. అయితే అత్యుత్సాహంతో రాష్ట్ర విభజన చేసిన కాంగ్రెస్, అందుకు మద్దతు పలికిన బీజేపీ, టీడీపీ, ఇతర పార్టీలు ఆ తర్వాత చట్టంలో ఇచ్చిన హామీలను పట్టించుకోలేదు. “ప్రత్యేక హోదా” తప్ప మరే ఇతర డిమాండ్ ను జగన్ కూడా పట్టించుకోలేదు.
అనేక ఆందోళనలు
ప్రొద్దుటూరుకు చెందిన ప్రవీణ్ కుమార్ రెడ్డి స్టీల్ ప్లాంట్ సాధనా సమితి ఏర్పాటు చేసిన నాలుగేళ్లుగా ఉక్కు ఫ్యాక్టరీ సాధన కోసం మ అనేక ఆందోళనలు చేశారు. నిరాహారదీక్ష కూడా చేశారు. ఇటీవల మరోసారి ఆందోళన బాట పట్టారు.
ఇకపోతే రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ నాయకుడు రవిశంకర రెడ్డి సుమారు నాలుగు వందల రోజులు రిలేనిరాహార దీక్షలు చేయించారు. అలాగే అనేక రకాల ఆందోళనలు చేశారు కూడా.రాయలసీమలోని అనేక ప్రజా సంఘాలు శక్తి వంచన లేకుండా కడప ఉక్కు కోసం యుద్ధమే చేశారు.
టీడీపీ అధినేత సూచనల మేరకు టీడీపీ రాజ్యసభ సభ్యుడు సి.ఎం. రమేష్, ఎం.ఎల్.సి బిటెక్ రవి మహా ఆర్బాటంగా, అంగరంగ వైభోగంగా ఆమరణ దీక్షలు (గిట్టని వారు దొంగ దీక్షలున్నారనుకోండి)” కూడా చేశారు. అనేక మంది మంత్రులు, ఎంఎల్ ఏ లు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయకులు తండోపతండాలుగా ఈ దీక్షలకు మద్దతు పలికారు. బస్సులు పెట్టి జనాన్ని తరలించారు. చివరకు స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీక్షా శిబిరానికి వచ్చి ఆ నాయకుల దీక్షలు విరమింప చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ “మూడు నెలల్లోగా కేంద్రం కడప ఉక్కు ఫ్యాక్టరీకి శంఖుస్థాపన చేయకపోతే రాష్ట్రమే ఉక్కు ఫ్యాక్టరీ నిర్మిస్తుందని ఘనంగా ప్రకటించారు”.(ప్రకటించి ఆరు నెలలైనా మరో రకమైన ప్రకటనలు గుప్పించడం తప్ప ఒరగబెట్టింది ఏమీ లేదు.) .
కడప ఉక్కు కోసం వైస్సార్ పార్టీ కడప ఎంపీ అవినాష్, ఇతర ఎంపీలు కూడా గొంతు విప్పారు. బీజేపీ నాయకుడు కందుల రాజమోహన్ రెడ్డి ఏకంగా ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడి వెంట పడ్డారు. అలాగే పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఈ విషయంపై దృష్టి పెట్టామని అనేక సార్లు ప్రకటించారు.
నోరు విప్పని జగన్
కడప ఉక్కు ఫ్యాక్టరీ కోసం ఇన్ని జరుగుతున్నా వైస్సార్ పార్టీ అధినేతకు చీమ కుట్టినట్లు లేక పోగా , ఆయన ఇప్పటి వరకూ నోరు విప్పక పోవడం అశ్చర్యం కలిగిస్తున్నది. గత నాలుగు సంవత్సరాలుగా ఎన్నో ఆందోళనలు జరిగినా ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుపై ఆయన తన వైఖరి ప్రకటించలేదు. కడపలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు సాధ్యం కాదని కమిటీ తేల్చిందని, ఉక్కుఫ్యాక్టరీ ఏర్పాటుకు అవసరమైన ముడిసరుకు లేదనే కుంటి సాకులు చెప్పి కడపలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు సాధ్యం కాదని కేంద్రం పార్లమెంటులో ప్రకటించినా ఆయన స్పందించలేదు. కేంద్ర ప్రభుత్వ రంగంలో ఫ్యాక్టరీ ఏర్పాటైతే నిధులకు కొరత ఉండదని, పని కూడా చురుకుగా సాగుతుందని తెలిసికూడా ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వమే ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తుందని ప్రకటించినా జగన్ ఎలాంటి స్పందన చూపలేదు.
ప్రస్తుతం మాత్రం శ్రీకాకుళం జిల్లా మత్స్య కారుల కోరిక మేరకు అక్కడ నిర్మించ తలపెట్టిన ధర్మల్ విద్యుత్ కేంద్రాన్ని రద్దు చేస్తామని ప్రకటించగలిగిన జగన్ సొంత జిల్లాలో ఉన్న పరిస్థితులపై ఎందుకు స్పందించడం లేదని జనం గుసగుసలాడుతున్నారు. జగన్ బాబు తాను ప్రతిరోజూ వల్లించే తారక మంత్రం “మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత” ప్రక్కన పెట్టి ఇప్పటికైనా కడప ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుపై విధానపరమైన నిర్ణయం తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
