సూర్య ట్యాక్స్‌లా `జె` ట్యాక్స్!

రాష్ట్రంలో పొలిటిక‌ల్ బిజినెస్ మొద‌లైంది అంటూ తెలుగు త‌మ్ముళ్ల ఆక్రోశం వెల్ల‌గ‌క్కుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ రొంపిలోకి యువ ముఖ్య‌మంత్రి వై.య‌స్.జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని లాగారు. ఆయ‌న పేరుతో జె ట్యాక్స్ వ‌సూల్ చేస్తున్నార‌న్న‌ది ప్ర‌ధాన ఆరోప‌ణ‌.

బిజినెస్ చేసే ప్ర‌తి ఒక్క‌డు… మార్జిన్ పేరుతో 2 శాతం సూర్య ఎక్స్ పోర్ట్స్‌ అండ్ ఇంపోర్స్ట్ కి పే చేయాలి.  ఇవ్వ‌క‌పోతే వాళ్ల టేబుల్ పై `బిజినెస్ మ్యాన్` సూర్య గ‌న్ ఉండాలి. స‌ర్వీస్ ట్యాక్స్, సేల్స్ ట్యాక్స్ , ఇన్ క‌మ్ ట్యాక్స్  లా ఈ సూర్య ట్యాక్స్ జ‌నాల‌కు అల‌వాటైపోవాలి. సూర్య భాయ్ అంటే ఇట్స్ ఏ బ్రాండ్! అనే  డైలాగ్ బిజినెస్‌మేన్ సినిమాలో ఎంత‌గా పేలిందో తెలిసిందే. తాజాగా ఏపీలో జ‌గ‌న్ ప్ర‌భుత్వ పాల‌న ఇలాగే ఉంద‌ని టీడీపీ నేత బుద్దా వెంక‌న్న ఆరోపించారు.

మ‌ధ్య‌పానం నిషేధం పేరుతో 3 వేల కోట్ల‌ రూపాయ‌ల స్కాం చేస్తున్నార‌ని ఆరోపించారు. ఎమ్మార్పీ రేట్ల కంటే 20 రూపాయ‌ల‌కు ఎక్కువ అమ్ముతూ చ‌ట్టాల‌ను అతిక్ర‌మిస్తున్నార‌ని ఎద్దేవా చేసారు. పోలీస్ వ్య‌వ‌స్థ‌నే నిర్వీర్యం చేసార‌ని, మ‌ద్యం అమ్మ‌కాలు ఎంత ఎక్కువ‌గా ఉంటే `జె` ట్యాక్స్ అంత పెరుగుతుంద‌నే ఉద్దేశంలో ప్ర‌భుత్వం ఉంద‌ని ఆరోపించారు. రాష్ట్రంలో ఏది కొనాల‌న్నా స‌ర్వీస్ ట్యాక్స్ తో పాటు జె-ట్యాక్స్ క‌ట్టాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేసారు. జె ట్యాక్స్ ని  ఓ బ్రాండ్ చేస్తున్నార‌ని ఆరోపించారు.  ఈ జె ట్యాక్స్  ని ప్ర‌తీ ఒక్క‌రూ ప్ర‌శ్నించాల‌ని బుద్దా పిలుపునిచ్చారు. లేదంటే సూర్య ట్యాక్స్ క‌న్నా జె ట్యాక్స్  రానున్న రోజుల్లో మ‌రింత ప్ర‌మాద‌క‌రంగా  మారే అవ‌కాశం ఉంద‌ని అన్నారు. వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత వ్యాపారాల‌న్నీ కుదేలైపోయాయ‌ని ఆరోపించారు. అయితే ఇన్నాళ్లు ఇసుక వ్యాపారం.. మ‌ద్యం వ్యాపారం.. రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారం.. ఇన్ సైడ్ ట్రేడింగ్ వ్యాపారం చేసిన తెలుగు త‌మ్ముళ్ల‌కు `జె` ట్యాక్స్ అనే కొత్త ప‌దంతో ఎటాక్ చేయ‌డం ఒక్క‌టే మార్గంలా క‌నిపిస్తోంది. త‌న‌పై వ‌స్తున్న ఆరోప‌ణ‌ల‌పై జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.