70 కి 250: ‘అమరావతి’తో జూదం.. ఇది తాజా నిర్వేదం!

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి గురించి రోజుకో షాకింగ్ న్యూస్ తెరపైకి వస్తోండటం ఆంధ్రులకు తీవ్ర ఆందోళన కలిగిస్తోందని అంటున్నారు. చంద్రబాబు రెండోసారి అధికారంలోకి వచ్చిన ఈ దఫా అయినా ఏపీకి ఓ “శాస్వత” రాజధాని ఉంటుందని ఆశించినవారికి… ఈసారి కూడా నిరాశ తప్పదని చెబుతున్నారు. రాజధాని విషయంలో తనపై ఆంధ్రులు పెట్టుకున్న నమ్మకాన్ని చంద్రబాబు వమ్ము చేసుకుంటున్నారనే చర్చా జరుగుతుంది.

అందుకు కారణం… రాజధానిపై ఆ ప్రాంతానికి భూములిచ్చిన రైతులతో పాటు, ఆ 29 గ్రామాల ప్రజలతో పాటు, రాష్ట్రంలోని మిగిలిన ప్రజానికానికీ ఓ స్పష్టత వచ్చిందని.. ఇది ఇప్పట్లో పూర్తయ్యే వ్యవహారం కాదని.. పైగా దీని మాటున చాలా మాయ జరుగుతుందని నమ్మడమే అని అంటున్నారు పరిశీలకులు. ఆ నమ్మకాలను, సందేహాలను చంద్రబాబు & కో రోజు రోజుకీ బలపరుస్తూ.. రాజధానిపై ఆశలను బలహీనపరుస్తున్నారని చెబుతున్నారు.

పైగా.. అమరావతి పేరు చెప్పి జరుగుతున్న భూసేకరణ, తద్వారా జరుగుతున్నట్లు చెబుతోన్న రియల్ ఎస్టేట్ వ్యవహారాలు, ఆ పేరు మీద చేస్తోన్న అప్పులు, తడిసి మోపెడవుతున్న వడ్డీలు, ఎక్కడా కానరాని ప్రైవేటు పెట్టుబడులు, మరో 50 వేల ఎకరాలు కావాలనే చంద్రబాబు మాటలు, దానికి తంధాన తాన అనే నారాయణ ఆలోచనలు వెరసి అమరావతి ఇంకో 100 జన్మలెత్తినా పూర్తవ్వదనే స్పష్టతను వైసీపీ ఇప్పటికే ప్రజలకు ఇచ్చేసిన పరిస్థితి!

ఈ సందర్భంగా స్పందిస్తోన్న వైసీపీ నేతలు… అమరావతిలో రోడ్లు, విద్యుత్, డ్రైనేజీ వంటి కనీస మౌలిక సదుపాయాల కోసమే రూ.2 లక్షల కోట్లు ఖర్చు పెట్టాల్సిన పరిస్ధితి ఉందని.. ఇప్పటికే రూ.75 వేల కోట్లు ప్రాథమిక వసతుల కోసం ఖర్చు పెట్టాలని అనుకున్నారని.. దీనికోసం రూ.45 వేల కోట్లు బ్యాంకుల నుంచి అప్పులు తెచ్చారని ఘణాంకాలతో సహా చెబుతూ… ఆర్ధికంగా దెబ్బ తిన్న రాష్ట్రానికి లక్షల కోట్లు అప్పు తెచ్చి అమరావతి నిర్మించాల్సిన అవసరం ఉందా అని ప్రశ్నిస్తూ… అందుకే మావిగన్‌ అనే ప్రతిపాదన జగన్ తెచ్చారని వైసీపీ నేతలు బలంగా చెబుతున్నారు.

దీనిపై కూటమి ప్రభుత్వం నుంచి రెండు రకాల వెర్షన్స్ రావడం గమనార్హం. ఇందులో భాగంగా… మావిగన్ అనేది పిచ్చి ఆలోచన అని, అసలు ఆ పేరే పిచ్చిగా ఉందని, ఇది కేవలం అమరావతిపై కక్షతోనే జగన్ చేసిన ఆలోచన అని తొలుత టీడీపీ & కో బలంగా చెప్పుకొచ్చింది. అయితే… మావిగన్ ప్రతిపాదనపై జనాల్లో పాజిటివ్ రెస్పాన్స్ వస్తోందనే చర్చ వేళ… తాము ఇప్పటికే ఆ ఆలోచన చేశామని.. జగన్ చెప్పిన మావిగన్ కూడా సీఆర్డీయే పరిధిలోనే ఉందని చంద్రబాబు చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది!

ఈ విధంగా అమరావతి విషయంపై ప్రజల్లో నీలినీడలు, అమరావతికి భూములిచ్చిన రైతుల్లో ఆందోళనలు, ఇంకా భూములు కావాలని అంటోన్న వేళ మరికొంతమంది రైతుల్లో కొత్త సందేహాలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని జగన్ తెరపైకి తెచ్చిన మావిగన్ ప్రతిపాదనలు, దానికి వస్తోన్న పాజిటివ్ ప్రతిస్పందనలు వెరసి ఇప్పటికే అమరావతి పూర్తయ్యే వ్యవహారం కాదనే చర్చ బలంగా నడుస్తోన్న వేళ… మాజీ మంత్రి, టీడీపీ సీనియర్‌ నేత వడ్డే శోభనాద్రీశ్వరరావు షాకింగ్ కామెంట్స్ చేశారు.

తాజాగా అమరావతి రింగ్‌ రోడ్డు ప్రభావిత గ్రామాల రైతుల సదస్సును నిర్వహించారు. ఈ సదస్సుకు ఐదు జిల్లాలకు చెందిన రైతులతో పాటు వడ్డే శోభనాద్రీశ్వరరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుపై ఆయన చేసిన వ్యాఖ్యలు.. ఈ రోడ్డు పేరు చెప్పి రైతులనుంచి పెద్ద ఎత్తున భూదోపిడికి ప్రభుత్వం ఆలోచిస్తోందంటూ చెప్పిన షాకింగ్ విషయాలు వెరసి ఈ విషయం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ఈ సందర్భంగా స్పందించిన వడ్డే శోభనాద్రీశ్వరరావు… చంద్రబాబు తలపెట్టిన అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు కోసం భూములు కోల్పోవాల్సి వస్తున్న రైతులను చూస్తే గుండె తరుక్కుపోతుందని చెబుతూ పలు కీలక ప్రశ్నలు సంధించారు.

ఇందులో భాగంగా…

*  అమరావతి 29 గ్రామాల్లో జనాభా ఎంత..?

*  ఈ 12 ఏళ్లలో పెరిగిన జనాభా ఎంత..?

*  దేశంలో పెద్ద పెద్ద నగరాల్లోనే లేని ఔటర్ రింగ్ రోడ్డు ఇక్కడ ఎందుకు..?

*  ఔటర్ రింగ్ రోడ్డు కోసం ఎవరిని సంప్రదించారు.. అసలు ఎవరికి చెప్పారు?

*  మొక్కజొన్న కొనమంటే మంత్రి అచ్చెన్నాయుడు డబ్బుల్లేవంటుంటే… రూ. 24,700 కోట్లతో ఔటర్ రింగ్ రోడ్డు అవసరమా..?

*  అమరావతికి ఏకంగా 189 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డు అవసరమా..?

*  ఇదేమైనా మీ ప్రైవేట్ ప్రాపర్టీ అనుకున్నారా..? హెరిటేజ్ కంపెనీ విస్తరణ అనుకున్నారా..?

*  రైతులు, వారి భూములు మీకు చీమలు, దోమలు మాదిరి కనిపిస్తున్నాయా..?

*  విజయవాడకు వెస్ట్ బైపాస్ ఉండగా కొత్తగా రింగ్ రోడ్డు అవసరమా..?

*  జాతీయ రహదారులకు 70 మీటర్లు చాలని కేంద్రం చెబుతోండగా.. మీరు మాత్రం ఏకంగా 140 నుంచి 250 మీటర్లు తీసుకోవాలని చూడటాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి..?

అని చంద్రబాబుపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ నేపథ్యంలోనే… ఈ నిర్ణయాన్ని చంద్రబాబు పునః సమీక్షించుకోవాలని.. అలాకానిపక్షంలో అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు పై పోరాటం తప్పదని పేర్కొన్నారు.

దీంతో… తవ్వేకొద్దీ అమరావతి పేరుచెప్పి జరుగుతోన్న దారుణాలు వెలుగు చూస్తున్నట్లున్నాయని అంటున్నారు ప్రజానికం. ఇదే సమయంలో… అసలు అమరావతిపై చంద్రబాబుకైనా ఒక క్లారిటీ ఉందా.., మంత్రి నారాయణకైనా ఒక స్పష్టత ఉందా..? అనే సందేహాలు తెరపైకి తెస్తోన్నారు.

కాగా… హైదరాబాద్, బెంగళూరు వంటి మహా నగరాల్లో ఏదైనా ఓ నిర్మాణం చేపట్టాలంటే గరిష్టంగా చదరపు అడుగుకు రూ.4500 ఖర్చవుతుందని.. తాడేపల్లి, గుంటూరు వంటి చోట్ల కట్టినా చదరపు అడుగుకు రూ.2500 అవుతుందని.. పైస్టార్‌ హోటల్‌ లెక్కన కట్టినా విజయవాడ, గుంటూరుల్లోనూ రూ.3500 కంటే ఎక్కువ కాదని.. కానీ అమరావతిలో మాత్రం చదరపు అడుగుకు రూ.14 వేల నుంచి రూ.16 వేలు ఖర్చు పెడుతున్నరని చెబుతూ.. ఇంతకంటే భారీ దోపిడీ ఉంటుందా అంటూ ఇప్పటికే వైసీపీ నేతలు ప్రభుత్వాన్ని నిలదీసిన సంగతి తెలిసిందే.