Harsha Kumar vs RRR: శ్రీరామనవమి వేళ ఆకివీడు మండలం పెద్దపేటలో చోటుచేసుకున్న ఘర్షణలు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీశాయి. ఆలయ పునఃనిర్మాణం విషయంలో తలెత్తిన వివాదంపై మాజీ ఎంపీ హర్షకుమార్ ఘాటుగా స్పందించారు. ఈ ఘటనలో అరెస్టైన వారిని తక్షణమే విడుదల చేయాలని, లేనిపక్షంలో ‘చలో ఆకివీడు’కు పిలుపునిస్తామని కూటమి ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేశారు.
ఘటనకు కారణం ఏమిటి?
పెద్దపేటలోని శిథిలావస్థకు చేరిన రామాలయం స్థానంలో కొత్త ఆలయాన్ని కట్టిస్తామని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఇటీవల ప్రకటించారు. అయితే, స్థానికులు అక్కడ ‘గొంతెనమ్మ’ ఆలయాన్ని నిర్మించాలని కోరుతున్నారు. ఈ వివాదం కొనసాగుతుండగానే, శ్రీరామనవమి రోజు రఘురామకృష్ణరాజు పూజల కోసం అక్కడికి వెళ్లడం ఉద్రిక్తతలకు దారితీసింది. ఆయన పర్యటనను వ్యతిరేకిస్తూ ఒక వర్గం వారు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరగగా, పోలీసులు రంగప్రవేశం చేసి పలువురిని అరెస్ట్ చేశారు.
ప్రభుత్వ తీరుపై హర్షకుమార్ ఆగ్రహం ఈ ఘటనపై స్పందించిన హర్షకుమార్.. ప్రభుత్వ తీరును తీవ్రంగా తప్పుబట్టారు.
రఘురామ పర్యటనపై విమర్శలు: “శ్రీరామనవమి రోజు వేరే గుడికి వెళ్లి పూజలు చేసుకోవచ్చు కదా? కావాలనే 100 కార్లతో వెళ్లి పెద్దపేట ప్రజలను రెచ్చగొట్టారు” అని ఆరోపించారు.

పక్షపాత ధోరణి: ఘర్షణ ఇరువర్గాల మధ్య జరిగితే, కేవలం ఒక వర్గానికి మద్దతుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సీఎం చంద్రబాబు మాట్లాడటం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు.
దళితులపై అణచివేత: కుందాలపల్లి ఘటనను ప్రస్తావిస్తూ.. దళితులకు ఒక చట్టం, ఇతరులకు మరో చట్టమా? అని ప్రశ్నించారు. దళితులను అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు.
24 గంటల గడువు.. ‘చలో ఆకివీడు’ హెచ్చరిక
ఆకివీడు ఘటనలో అరెస్టైన వారిని ఆదివారం లోపు (24 గంటల్లోగా) స్టేషన్ బెయిల్పై విడుదల చేయాలని హర్షకుమార్ డిమాండ్ చేశారు. “పోలీసులు కేసులు పెట్టారు, అవి కోర్టులో తేలుతాయి. కానీ వారిని తక్షణమే విడుదల చేయాలి. లేకపోతే ఉభయ గోదావరి జిల్లాల నుండి వేలాదిమందితో ‘చలో ఆకివీడు’ నిర్వహిస్తాం” అని డెడ్లైన్ విధించారు.
ప్రస్తుతం ఆకివీడులో పరిస్థితి ప్రశాంతంగా ఉన్నప్పటికీ, హర్షకుమార్ హెచ్చరికలతో పోలీసులు అప్రమత్తమయ్యారు.

