మీడియా దిగ్గజం, ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు (82) తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారని, ఆయన్ని కుటుంబ సభ్యులు ఐసీయూలో చేర్చారని ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా ప్రచారం అవుతోంది. ఆయనకు విదేశాల్లో వైద్యం చేయించాలని కుటుంబ సభ్యులు ప్రయత్నిస్తే అందుకు ససేమిరా అంటున్నారని, చనిపోతే ఇండియాలోనే చనిపోవాలన్నది ఆయన పంతం అని కాస్తంత అడ్వాన్స్ డ్ గానే ప్రచారం సాగిస్తున్నారు. అయితే ఇది నిజమా? అని ఆరా తీస్తే.. షాక్ తినే విషయం తెలిసింది.
తప్పుడు ప్రచారం చేయకండి ప్లీజ్
అసలు రామోజీరావు ఆరోగ్యానికి వచ్చిన డోఖా ఏదీ లేదు. ఆయన ఎప్పటిలానే ఆరోగ్యంగా ఉన్నారు. ఐసీయులో చేరారన్నదాంట్లో ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది. దయచేసి ఇలాంటి ఫేక్ వార్తల్ని ప్రచారం చేయొద్దని సన్నిహితులు వాపోతున్నారట. రామోజీ గ్రూప్స్ సారథ్యంలోని ఈనాడు దినపత్రికకు ఉన్న పాఠక ఆదరణ తెలిసిందే. ఈటీవీ సంస్థల్ని ఆయన విజయవంతంగా నడిపించారు. అలాగే సినీనిర్మాతగానూ ఆయన జాతీయ అవార్డులు సహా ఫిలింఫేర్ లు అందుకున్నారు. ప్రతిష్ఠాత్మక పద్మవిభూషణ్ గ్రహీతగానూ గౌరవం అందుకున్నారు. అయితే ఉన్నట్టుండి రామోజీపై ఇలా ప్రచారం చేయాల్సిన అవసరం ఎవరికి వచ్చింది? గాలి వార్తల ప్రచారం వెనక ఎవరైనా ఉన్నారా? అన్న ఆరాలు మొదలయ్యాయి. మరోవైపు సోషల్ మీడియాల్లో ఏది నిజం ఏది అబద్ధం అన్నది తెలుసుకోలేనంత ధైన్యం కామన్ జనాలకు నెలకొంది.
