చంద్రబాబుకు ‘అందని ద్రాక్ష’… లోకేష్ హయాంలో అందితే “మరో చరిత్రే”!

అది మార్చి 29, 1982. అప్పటివరకు రాష్ట్రాన్ని ఏకపక్షముగా పాలిస్తున్న కాంగ్రేస్ పార్టీకి ప్రత్యమ్నాయంగా అంటూ తెలుగుదేశం పార్టీని స్థాపించారు నందమూరి తారకరామారావు. పార్టీ పెట్టిన 9 నెలలలోనే ఎన్టీఆర్ నాయకత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసి తెలుగుదేశం పార్టీ అందరినీ ఆశ్చర్యపరచింది. 1983 జనవరిలో జరిగిన ఎన్నికల్లో.. 294 స్థానాలకు గానూ 201 స్థానాల్లో గెలుపొంది సరికొత్త చరిత్ర సృష్టించింది.

అలా మొదలైన టీడీపీలో.. ఎన్నో ఆటుపోట్ల పరిస్థితులు, వెన్నుపోటు విమర్శలు! వాటన్నింటినీ తట్టుకుంటూ తాజాగా మూడో తరం నాయకత్వం అధికారికంగా రంగంలోకి దిగింది. ఈ సందర్భంగా తెరపైకి పలు ప్రశ్నలు వస్తున్నాయి.

* తెలుగుదేశం పార్టీలో లోకేష్ సరికొత్త అధ్యాయాన్ని విజయంతో ఆరంభిస్తారా..?

* అదే జరిగితే 2029 ఎన్నికల తర్వాత సీఎంగా లోకేష్ పట్టాభిషేక కార్యక్రమం కూడా జరగనుందా..?

* అటు సీనియర్లను, ఇటు జూనియర్లను బ్యాలెన్స్ చేస్తూ లోకేష్ ఎలాంటి పరిపాలనను చూపించబోతున్నారు..?

* ప్రధానంగా మరికొన్ని నెలల్లో జరగనున్నట్లు చెబుతోన్న స్థానిక సంస్థల ఎన్నికలు లోకేష్ కి యూనిట్ టెస్ట్ లుగా భావించొచ్చా..?

* లోకేష్ చాలా ఆవేశంగా రాజకీయలు చేస్తున్నారని.. వెనుకా ముందూ చూసుకోకుండా, రేపటి గురించి ఆలోచించుకోకుండా ‘రెడ్ బుక్’ తో రెచ్చిపోతున్నారనే విమర్శలు ఇకపై వినిపించకుండా నడుచుకుంటారా..?

* మూడోతరం తరం నాయకత్వాన్ని మరింత పటిష్టంగా, పక్కా ప్రణాళికలతో ముందుకు తీసుకెళ్తారా..?

* అంతకంటే ముందు చంద్రబాబుకు అందని ద్రాక్షగా ఉన్న “వరుస విజయాల” లోటును తీరుస్తారా..?

ఇప్పుడు సగటు టీడీపీ కార్యకర్తల మదిలో ఈ ప్రశ్నలు మెదులుతున్నాయి. ఈ సమయంలో పలు కీలక చర్చలు తెరపైకి వస్తోన్నాయి! ఆ కథాకమీషేమిటో ఇప్పుడు చూద్దామ్..!

తెలుగుదేశం పార్టీలో మూడో తరం నాయకత్వం అధికారికంగా రంగంలోకి దిగింది. టీడీపీ అధినేత చంద్రబాబు కుమారుడు, మంత్రి నారా లోకేష్ చేతిలోకి టీడీపీ పగ్గాలు అధికారికంగా వచ్చేశాయి. అంటే… సుమారు 44 ఏళ్ల చరిత్ర కలిగిన పార్టీని ఇకపై 43 ఏళ్ల లోకేష్ తన కనుసన్నలలో నడిపించబోతున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పూర్తి బాధ్యతలను నిర్వహించనున్నారు.

తాజాగా… మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా… వారందరితోనూ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయించారు. ఈ సమయంలోనే.. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా మంత్రి నారా లోకేష్ బాధ్యతలు స్వీకరించారు. పొలిట్‌ బ్యూరో, జాతీయ, రాష్ట్ర కమిటీలతోనూ చంద్రబాబు ప్రమాణం చేయించారు.

ఈ సందర్భంగా స్పందించిన చంద్రబాబు… సీనియారిటీ, సిన్సియారిటీ అర్హతలతో సుమారు 250 మందితో కమిటీ ఏర్పాటు చేశామని.. 44 ఏళ్లలో అనేక సంక్షోభాలు, సవాళ్లను చూశామని తెలిపారు. 2024 ఎన్నికల్లో వచ్చిన ఓట్ల కంటే వచ్చే ఎన్నికల్లో అధికంగా వచ్చేలా అంతా కృషిచేయాలని కోరారు!

ఆ సంగతి అలా ఉంటే… ఇకపై అధికారికంగా టీడీపీకి “అన్నీ లోకేషే” కాబోతున్నారనే చర్చ బలంగా మొదలైంది. పార్టీ అధినేతగా చంద్రబాబు ఉన్నప్పటికీ… ఆయన పూర్తిగా ప్రభుత్వంపై దృష్టి సారించబోతున్నారని.. ఈ క్రమంలో పార్టీ బాధ్యతలు పూర్తిగా లోకేష్ చూడబోతున్నారని అంటున్నారు. ఈ సందర్భంగా ఆయన సామర్థ్యానికి పరీక్షగా.. ఈ ఏడాది రెండు నీలి లిట్మస్ టెస్టులు ఉన్నాయని అంటున్నారు పరిశీలకులు!

ఇందులో భాగంగా… మే నెలాఖరున జరగనున్న టీడీపీ “మహానాడు” అందులో ఒక టెస్ట్ అని చెబుతున్నారు. లోకేష్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత జరగనున్న తొలి పార్టీ వేడుక కావడంతో… దానిని లోకేష్ తన నాయకత్వ పఠిమతో ఏ మేరకు సక్సెస్ ఫుల్ గా నిర్వహించనున్నారనేది ఆసక్తిగా మారింది. అంటే… “పాత విధానాలు మరిచిపోకుండానే.. తనదైన కొత్తదనాన్ని కూడా చూపిస్తూ” అన్నమాట.

ఇది పార్టీ వేడుక కాబట్టి.. కాస్త అటు ఇటుగా ఎలా అనుకున్నా… స్థానిక జిల్లా నాయకత్వమే మెజారిటీ పని పూర్తి చేసేస్తుందని అనుకోవచ్చు. అయితే… దాని తర్వాత మరో పరీక్ష ఉందని చెబుతున్నారు.

ఇందులో భాగంగా.. మరో రెండు మూడు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయని అంటున్నారు. ఇందులో… అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచార వ్యూహాల వరకూ అన్నీ లోకేష్ కనుసన్నల్లోనే పూర్తిగా జరగనున్నాయని చెబుతున్నారు.

సాధారణంగా అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీలే స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక సీట్లు గెలుపొందుతుందనే నానుడి ఉంది. కాకపోతే.. ఈసారి లోకేష్ కు అధికారికంగా కొత్త కావడంతో పాటు ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో వ్యతిరేకత కాస్త ఎక్కువగానే ఉందనే ప్రచారం జరుగుతోన్న నేపథ్యంలో… ఇది కాస్త ఆసక్తిగా మారింది.

ఈ రెండింటి సంగతి అలా ఉంచితే.. అసలు సిసలు పబ్లిక్ ఎగ్జామ్.. “2029 జనరల్ ఎలక్షన్” అని అంటున్నారు పరిశీలకులు. ఎందుకంటే… ఆ ఎన్నికల్లో.. రాబోయే రెండు మూడేళ్లు చంద్రబాబు ప్రభుత్వాన్ని ఎలా నడిపారనేది ఎంత ప్రభావం చూపిస్తుందో.. పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా లోకేష్ తెలుగుదేశాన్ని ఎలా నడిపించారు అనేది కూడా నాయకులు, కార్యకర్తల విషయంలో అంతే ఎఫెక్ట్ చూపించనుందని అంటున్నారు.

ఏది ఏమైనా… తాజాగా పార్టీ పట్టాభిషేకం జరిగిన నేపథ్యంలో… ఈ ఏడాది జరగబోయే “మహానాడు” అనే యూనిట్ ఎగ్జామ్, “లోకల్ బాడీ ఎలక్షన్స్” అనే హాల్ఫ్ ఇయర్ ఎగ్జామ్ లోకేష్ పాసయ్యి.. 2029లో జరిగే ఫైనల్ ఎగ్జామ్ లో కూడా సక్సెస్ అయితే… ఇక మిగిలింది “ప్రభుత్వ పట్టాభిషేకమే” అని అంటున్నారు పరిశీలకులు.

ఆ లోటు తీరుస్తారా.. మరోచరిత్ర రాస్తారా..?

వాస్తవాలు మాట్లాడుకోవాలంటే… 44 ఏళ్ల అనుభవం ఉన్న పార్టీ.. 10 సార్లు ఎన్నికలకు వెళ్లి, ఆరోసారి అధికారంలోకి వచ్చిన పార్టీ.. ఎన్టీఆర్ బలమైన పునాది వేసిన పార్టీ.. తద్వారా భారీ కార్యకర్తలను కలిగి ఉన్న పార్టీ.. అయినప్పటికీ.. ఒకే ముఖ్యమంత్రి పాలనలో వరుసగా రెండుసార్లు అధికారంలోకి రాని పార్టీగా టీడీపీ ఒక చేదు చరిత్ర కలిగి ఉందని అంటారు.

1983 జనవరిలో ఎన్టీఆర్ ఎన్నికలకు వెళ్లి 294 స్థానాలకు గానూ 201 సీట్లు గెలుచుకున్నారు. ఆయన విదేశీ పర్యటనలో ఉండగా నాదెండ్ల భాస్కరరావు సీఎం కుర్చీ ఎక్కారు. దీంతో… 1985లో ఎన్టీఆర్ మధ్యంతర ఎన్నికలకు వెళ్లి ఒక సీటు ఎక్కువగా.. అంటే.. 202 స్థానాల్లో గెలుపొందారు. తన సత్తా చాటారు. అయితే.. 1989 ఎన్నికల్లో 74 స్థానాలకు పరిమితమ ఓటమి చవి చూశారు!

ఈ క్రమంలో 1994 ఎన్నికల్లో మరోసారి ఎన్టీఆర్ నాయకత్వంలో టీడీపీ ఘన విజయం సాధించింది. ఈసారి 216 స్థానాల్లో గెలుపొందింది. అయితే… 1995లో ఆయనను కుర్చీలోంచి దించి, చంద్రబాబు అధికారం చేజిక్కుంచుకున్నారు! ఆయన నాయకత్వంలో 1999లో టీడీపీ ఎన్నికలకు వెళ్లింది. ఆ ఎన్నికల్లో 180 సీట్లతో గెలుపొందింది. అలా అని ఇది వరుసగా రెండో విజయం అనుకున్నా… 1995 ఎన్టీఆర్ నాయకత్వంలో, 1999 చంద్రబాబు నాయకత్వంలో అని పలువురు గుర్తు చేస్తుంటారు.

అంటే.. పార్టీ పరంగా ఇది టీడీపీకి వరుసగా రెండోసారి గెలవడమే అయినప్పటికీ… తర్వాత జరిగిన పరిణామాలు దానికి బలం చేకూర్చడం లేదని అంటారు. ఎందుకంటే… 1999లో 180 స్థానాలతో గెలిచిన చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీ… 2004 ఎన్నికల్లో 47 స్థానాలకు పరిమితమైంది. ఆ ఎన్నికల్లో వైఎస్సార్ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ 185 స్థానాల్లో గెలుపొందింది.

ఆ తర్వాత 2009 ఎన్నికల్లోనూ టీడీపీ 92 స్థానాలు సాధించగా.. 156 స్థానాలతో వైఎస్సార్ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి వచ్చింది. రాజశేఖర్ రెడ్డి రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు. ఇదంతా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని చరిత్ర.

ఇక రాష్ట్ర విభజన అనంతరం 2014లో జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీ 175 స్థానాలకు గానూ 102 స్థానాల్లో విజయం సాధించి అధికారంలోకి రాగా… తొలిసారి పోటీ చేసిన జగన్ నాయకత్వంలోని వైసీపీ 67 స్థానాల్లో గెలుపొందింది. ఆ తర్వాత జరిగిన 2019 ఎన్నికల్లో చంద్రబాబు నేతృత్వంలోనే మళ్లీ ఎన్నికలకు వెళ్లి ఓటమి పాలైంది. ఆ ఎన్నికల్లో వైసీపీ 151 స్థానాల్లో భారీ విజయం నమోదు చేయగా.. టీడీపీ 23 స్థానాలకు పరిమితమైంది.

ఇక 2024 ఎన్నికల విషయనికొస్తే… ఈ ఎన్నికల్లో బీజేపీ, జనసేనలతో కలిసి పోటీ చేసిన టీడీపీ 135 స్థానాలు గెలుచుకుని అధికారంలోకి వచ్చింది.

అంటే.. ఇప్పటి వరకూ చంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశం ఆరుసార్లు ఎన్నికలకు వెళ్లగా… మూడుసార్లు గెలిచింది, మూడు సార్లు ఓటమి పాలైంది. ఇందులో 2004, 2009లో వరుస ఓటములు ఉన్నాయి కానీ, వరుస విజయాలు మాత్రం దక్కలేదు!

దీంతో… ఆ లోటును 2029 విజయంతో లోకేష్ తీరుస్తారా లేదా అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఈ ఎన్నికల్లో కూడా టీడీపీ ఘన విజయం సాధిస్తే… అది టీడీపీకి లోకేష్ రాసిన “మరో చరిత్ర” అవుతుందని అంటున్నారు పరిశీలకులు.