విజయవాడ కాల్ మనీ వ్యవహారం అప్పట్లో తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. దీంతో అప్పటి ప్రభుత్వం వడ్డీ వ్యాపారులపై కఠినమైన నిర్ణయాలు తీసుకుంది. ఒత్తిళ్లకు పాల్పడితే ఊరుకునేది లేదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఇది జరిగి కొన్ని సంవత్సరాలు గడుస్తోంది. ప్రభుత్వం మారింది. వైకాపా అధికారంలోకి వచ్చింది. అయినా మళ్లీ యాధావిధిగా కాల్ మనీ వ్యవహారం మొదలైందని తాజాగా బాధితుల ఫిర్యాదులతో వెలుగులోకి వచ్చింది. విజయవాడ పోలీస్ కమీషనరేట్ లో మొరపెట్టుకున్న బాధితుల వ్యధతో ఈ విషయం బట్టబయలైంది. దీంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపట్టిన స్పందన కార్యక్రమం ద్వారా బాధితులను తక్షణమే ఆదుకోవాలని సూచించారు.
ఈ నేపథ్యంలో అనేక మంది కమీషనరేట్ వద్ద బారులు దీరారు. గత రెండు రోజుల్లో పదుల సంఖ్యలో కాల్ మనీ కేసులు నమోదయ్యాయి. వడ్డీ వ్యాపారులు డబ్బు వేధింపులతో పాటు, లైంగిక కోర్కెలు తీర్చాలంటూ బెదిరిస్తున్నారని పలువురు మహిళలు వాపోయారు. అవసరానికి అప్పు తీసుకుంటే? అప్పుకు వడ్డీ వేసి మొత్తం చెల్లిస్తామని కొందరు మహిళలు చెప్పగా, ఇంకొంత మంది అప్పులను వడ్డీతో సహా చెల్లించినా నోట్లను తమ వద్ద పెట్టుకుని బెదిరిస్తున్నారని వాపోయారు. ఇదంతా ఒక ఎత్తు అయితే రక్షించాల్సిన పోలీసులే వడ్డీ వ్యాపారులకు కొమ్ము కాస్తున్నారని వెలుగులోకి వచ్చింది. న్యాయం కోసం పోలీసు స్టేషన్ కు వెళ్తే వాళ్ల నుంచి కూడా బెదిరింపులు వస్తున్నాయని పోలీస్ ఉన్నత స్థాయి అధికారుల విచారణలో బయటపడింది. బాధితులను పోలీసులు మభ్య పెట్టి వడ్డి వ్యాపారులను కాపాడుతున్నారని ఓ మహిళ ఆవేదన చెందింది. అయితే వైయస్ జగన్మోహన్ రెడ్డి పాలనలోకి వచ్చాక ఎన్నో విషయాల్లో డేరింగ్ నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇలాంటి కాల్ మనీ మాన్ స్టర్స్ ని అదుపులో పెట్టేందుకు ఏదైనా సంచలన నిర్ణయం తీసుకుంటారేమో చూడాలి.
