RRR Attack News: ఉండిలో ఉద్రిక్తత: డిప్యూటీ స్పీకర్ ఆర్ఆర్ఆర్ పై దాడి యత్నం.. !

RRR Attack News: పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో తీవ్ర కలకలం రేగింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు (RRR) పై ఒక వర్గం వారు దాడికి యత్నించారు. ఆకివీడు పట్టణం పెదపేటలోని కోదండ రామాలయ దర్శనానికి వెళ్లిన సమయంలో ఈ ఘర్షణ చోటుచేసుకుంది. ఈ దాడి నుంచి రఘురామకృష్ణంరాజు తృటిలో తప్పించుకోగా, ఆయనను అడ్డుకున్న కూటమి నేతలకు తీవ్ర గాయాలయ్యాయి.

రామాలయ వివాదమే కారణమా? పెదపేటలోని రామాలయం నిర్వహణ విషయంలో కొంతకాలంగా స్థానికులకు, రఘురామకృష్ణంరాజుకు మధ్య వివాదం నడుస్తోంది. ఇవాళ ఆయన ఆలయ సందర్శనకు వస్తున్నారని తెలుసుకున్న వ్యతిరేక వర్గం వారు, ఆయన వాహన శ్రేణిని అడ్డుకున్నారు. రోడ్డుపైనే కార్లను నిలిపివేయడంతో రఘురామ కారు దిగి వారితో మాట్లాడే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో వాగ్వాదం ముదిరి ఘర్షణకు దారితీసింది.

రాడ్లు, మేకులతో దాడికి యత్నం దుండగులు రాడ్లు, మేకులు అమర్చిన కర్రలతో రఘురామపై దాడి చేసేందుకు ప్రయత్నించినట్లు సమాచారం. వెంటనే అప్రమత్తమైన ఆయన వ్యక్తిగత భద్రతా సిబ్బంది మరియు అనుచరులు రఘురామను సురక్షితంగా అక్కడి నుంచి పంపించివేశారు. అయితే, ఆయనను కాపాడే క్రమంలో కూటమికి చెందిన పలువురు స్థానిక నేతలపై దుండగులు విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన కూటమి నేతలను స్థానిక ఆసుపత్రికి తరలించారు.

ఆసుపత్రిలో బాధితుల పరామర్శ ఘటన అనంతరం డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు ఆసుపత్రికి వెళ్లి గాయపడిన తన అనుచరులను, కూటమి నేతలను పరామర్శించారు. నియోజకవర్గంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులను ఆదేశించారు. ప్రస్తుతం ఆకివీడులో భారీగా పోలీసులు మోహరించారు. నిందితుల్లో ఇప్పటికే కొందరిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ ఘటనతో ఉండి నియోజకవర్గంలో ఒక్కసారిగా రాజకీయ సెగలు రాజుకున్నాయి.

Analyst Chinta Rajasekhar Open Challenge To Pemmasani Chandrasekhar Over Comments On YS Jagan | TR