ఆర్టీసీ సమ్మె మరో ఉద్యమానికి సంకేతమా?
టీఆర్ఎస్ ప్రభుత్వంపై విద్యార్థుల్లో, నిరుద్యోగుల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొంది. ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఇప్పటికే ఆ రెండు వర్గాలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ ఎన్ని ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చారో లెక్క చెప్పాలంటూ ఓయూ విద్యార్థుల సంఘం డిమాండ్ చేసింది. రెండు పర్యాయాలు ముఖ్యమంత్రి అయినా కేసీఆర్ కు నిరుద్యోగుల ఆకలి బాధలు అర్ధం కాలేదంటూ ఇప్పటికే పలుమార్లు విమర్శించిన విద్యార్థులు ఈసారి సీరియస్ అల్టిమేటమ్ జారీ చేశారు. ఇటీవల జరిగిన ఓ సమావేశంలో ఓ నిరుద్యోగి ముఖ్యమంత్రిని నేరుగా పేరు పెట్టి మరీ దూషించాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో ఎంతటి సంచలనం రేపిందో తెలిసిందే.
ఓయూ విద్యార్ధి సంఘాలు, నిరుద్యోగులు, జేఏసీ అధ్యక్షుడు కోదండరామ్ అధ్యక్షతన కేసీఆర్ పీఠం కదిలిపోయేలా మరో ఉద్యమానికి రంగం సిద్ధం చేస్తున్నారు. ఏ క్షణమైనా? ఓయూ విద్యార్థులు రోడొక్కే అవకాశం ఉంది. ఈ ఉద్యమం కేవలం హైదరాబాద్ కే కాకుండా తెలంగాణ అన్ని జిల్లాల్లోనూ పెద్ద ఎత్తున చేయాలని ప్రణాళిక వేస్తున్నారు. ఈ వేడిలో తాజాగా తెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘాలు సమ్మె బాట పడుతున్నాయి. నేటి అర్ధ రాత్రి నుంచే ఎక్కడి బస్సులు అక్కడ నిలిచిపోనున్నాయి. ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలమవ్వడంతో ఆర్టీసీ సమ్మెకు దిగుతోంది.
ఆర్టీసీని బ్రతికించడానికి కేసీఆర్ ప్రభుత్వంపై చేస్తోన్న పోరాటమని సమ్మె సైరన్ మోగించారు. ప్రభుత్వానికి కార్మికుల సమస్యలు పరిష్కరించే ఉద్దేశం లేదని ఆరోపించారు. ప్రభుత్వం ఇచ్చే నోటీసులకు కార్మికులు భయపడరని.. అసలైన తెలంగాణ పౌరుషం ఎలా ఉంటుందో కేసీఆర్ కు రుచి చూపిస్తామని హెచ్చరించారు. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తే కేసీఆర్ మాత్రం కనీస సదుపాయాలు కల్పించడంలో విఫలమయ్యారని విమర్శించారు. జగన్ కు సలహాలు ఇచ్చే ముందు మనమెలాంటి పరిస్థితుల్లో ఉన్నామో ఆలోచించు కోవాలని కేసీఆర్ ను ఉద్దేశించి ఎద్దేవా చేసారు.
