Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ ప్రజల దశాబ్దాల కల, రాజధాని అమరావతికి అత్యున్నత చట్టసభలో అధికారిక ముద్ర పడింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు-2026కు లోక్సభ బుధవారం ఆమోదం తెలిపింది. ఈ బిల్లు ద్వారా అమరావతిని ఏపీకి ఏకైక, శాశ్వత రాజధానిగా గుర్తిస్తూ కేంద్రం చట్టబద్ధత కల్పించింది. ఈ చారిత్రక సందర్భాన్ని పురస్కరించుకుని ఏపీ మంత్రి లోకేష్ ఢిల్లీలో ప్రధాని మోదీని కలిసి రాష్ట్ర ప్రజల తరఫున ధన్యవాదాలు తెలిపారు.
బిల్లు ఆమోదం పొందిన వెంటనే మంత్రి నారా లోకేష్, కూటమి ఎంపీలతో కలిసి పార్లమెంట్ హాలులో ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ఈ సందర్భంగా ఆయన ప్రధానికి శాలువా కప్పి సత్కరించారు.
లోకేష్ను చూడగానే ప్రధాని మోదీ “కంగ్రాట్స్” అంటూ సాదరంగా అభినందించారు. అమరావతి కోసం భూములు త్యాగం చేసిన రైతుల పోరాటాన్ని, వారి ఆకాంక్షలను లోకేష్ ప్రధానికి వివరించారు. అమరావతిని ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దే క్రమంలో కేంద్రం నుంచి నిరంతర మద్దతు, ప్రధాని మార్గదర్శకత్వం కావాలని కోరారు.
అనంతరం లోకేష్ లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి, బిల్లు ఆమోదానికి సహకరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ , పెమ్మసాని చంద్రశేఖర్ సహా పలువురు కేంద్రమంత్రులను కలిసి ధన్యవాదాలు తెలియజేశారు.
బిల్లుపై పార్లమెంటులో జరిగిన చర్చను టీవీలో వీక్షించిన లోకేష్, సోషల్ మీడియా వేదికగా తన భావోద్వేగాలను పంచుకున్నారు.

“అమరావతి చరిత్ర, సంస్కృతి గురించి సభలో సభ్యులు వివరిస్తుంటే ఒక ఆంధ్రుడిగా నా రోమాలు నిక్కబొడుచుకున్నాయి. ఇది ఐదు కోట్ల ఆంధ్రుల విజయం. రైతుల శాంతియుత పోరాటానికి దక్కిన దైవ ఆశీస్సులివి.” – లోకేష్ భావోద్వేగ ట్వీట్
ఈ చారిత్రక చర్చలో పాల్గొనకుండా వైసీపీ సభ్యులు వాకౌట్ చేయడాన్ని లోకేష్ తీవ్రంగా తప్పుపట్టారు. “జగన్ ఎన్ని జన్మలెత్తినా అమరావతిలో ఒక్క ఇటుకను కూడా తాకలేడు. నా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ శాశ్వతం.. నా రాజధాని అమరావతి అజరామరం” అని ఆయన స్పష్టం చేశారు.
ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014లోని సెక్షన్ 5కు సవరణ చేస్తూ, అమరావతిని రాజధానిగా చేర్చారు. ఈ చట్టం జూన్ 2, 2024 నుండి అమల్లోకి వచ్చినట్లుగా పరిగణించబడుతుంది. భవిష్యత్తులో రాజధాని మార్పుపై ఎలాంటి అస్పష్టత లేకుండా ఈ బిల్లు రక్షణ కల్పిస్తుంది. ఈ బిల్లు ఆమోదంతో అమరావతి భవిష్యత్తుపై ఉన్న సందిగ్ధతలకు శాశ్వతంగా తెరపడిందని, ఇకపై స్వర్ణాంధ్ర నిర్మాణమే లక్ష్యమని కూటమి ప్రభుత్వం ప్రకటించింది.

