కేంద్రమంత్రిని నిలదీసిన ఆంధ్రా విద్యార్థులు

అనంతపురం పర్యటనలో ఉన్న కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్ గత ఆదివారం జేఎన్టీయూ సమీపంలోని సెంట్రల్ యూనివర్సిటీని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు గంటా, పరిటాల సునీత, కాలువ శ్రీనివాసులు పాల్గొన్నారు. ప్రారంభం అనంతరం జవదేకర్ విద్యార్థులతో ముఖా ముఖి చర్చలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ నిమ్మల కిష్టప్ప ప్రత్యేక హోదా గురించి ఆయనను ప్రశ్నించినట్టు తెలుస్తోంది. యూనివర్సిటీ విడీర్థులు కూడా కేంద్రమంత్రిని హోదా గురించి పలు ప్రశ్నలు వేసి నిలదీసినట్టు సమాచారం. అయితే జవదేకర్ మాత్రం చాలా తెలివిగా విద్యాసంస్థల అభివృద్ధి గురించి మాట్లాడుతూ హోదా విషయాన్ని పక్కదోవ పట్టించినట్టు తెలుస్తోంది.

కేంద్రమంత్రి జవదేకర్ మాట్లాడుతూ ఆంధ్రా అభివృద్ధి విషయంలో టీమిండియాలా పని చేస్తామని, రాజకీయం చేయమని తెలియజేసారు. బీజేపీ సర్కారుకి ఏపీపై ప్రత్యేక దృష్టి ఉందని అందుకే ఇక్కడ విద్యారంగంలో అన్నిరాష్ట్రాలకంటే పురోగతి సాధించిందని జవదేకర్ తెలిపారు. త్వరలోనే గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తామని దాన్ని కూడా ఆయనే వచ్చి ప్రారంభిస్తానని చెప్పారు.