AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు

AP Inter Results 2026: ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యార్థుల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడనుంది. రాష్ట్రంలో ఇంటర్ ఫలితాల వెల్లడికి విద్యాశాఖ ముహూర్తం ఖరారు చేసింది. ఈ నెల 18 లేదా 19వ తేదీల్లో ఫలితాలను విడుదల చేసేందుకు ఇంటర్ బోర్డు శరవేగంగా కసరత్తు చేస్తోంది. 18వ తేదీనే ఫలితాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.

తెలంగాణలో ఇప్పటికే ఫలితాలు విడుదల కావడంతో ఏపీ విద్యార్థుల్లో ఉత్కంఠ నెలకొంది. దీనిపై స్పందించిన అధికారులు.. ఇప్పటికే సమాధాన పత్రాల మూల్యాంకనం (Valuation) పూర్తయిందని వెల్లడించారు. మార్కుల నమోదు, సాంకేతిక సరిచూపు వంటి అనంతర ప్రక్రియ కూడా తుది దశకు చేరుకుంది. ఈ నెల 16వ తేదీ నాటికి మొత్తం ప్రక్రియను పూర్తి చేసి, ఫలితాల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారు.

‘అదనపు సబ్జెక్టు’ మార్కులు విడిగా.. ఈ విద్యా సంవత్సరం నుంచి ఇంటర్మీడియట్‌లో ప్రవేశపెట్టిన సంస్కరణల్లో భాగంగా ‘అదనపు సబ్జెక్టు’ (Additional Subject) ఆప్షన్‌ను బోర్డు అందుబాటులోకి తెచ్చింది.

రాష్ట్రవ్యాప్తంగా 1,359 మంది మొదటి సంవత్సరం విద్యార్థులు ఈ ఆప్షన్‌ను ఎంచుకున్నారు. ఎంపీసీ విద్యార్థులు బయాలజీని, బైపీసీ విద్యార్థులు గణితాన్ని అదనంగా చదువుకునే వెసులుబాటు కల్పించారు. అయితే, ఈ అదనపు సబ్జెక్టు మార్కులను రెగ్యులర్ మార్కుల మెమోలో కలపకుండా, విడిగా చూపించనున్నారు.

పరీక్షల వివరాలు: ఫిబ్రవరి 23వ తేదీ నుంచి మార్చి 23వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఏడాది తీసుకొచ్చిన నూతన సంస్కరణల కారణంగా పరీక్షల నిర్వహణకు నెల రోజులకు పైగా సమయం పట్టింది. దీంతో మూల్యాంకన ప్రక్రియలో స్వల్ప జాప్యం జరిగినప్పటికీ, ఇప్పుడు ఫలితాల వెల్లడికి సర్వం సిద్ధమైంది.

అధికారికంగా ఫలితాల తేదీని ఒకటి రెండు రోజుల్లో ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉంది.

Mavigun Tension Starts In Kutami Govt | Chandrababu | Telugu Rajyam