మణిపూర్ లో 2023వ సంవత్సరంలో జరిగిన అల్లర్ల వ్యవహారం దేశాన్ని కుదిపేస్తూ, ప్రపంచ వ్యాప్తంగానూ చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో కేంద్రంలోని అధికార పార్టీపైనా విమర్శలు బలంగా వినిపించాయి. ఈ అల్లర్లలో వేల మంది మరణించారు. అందులో మొయితీలు, కుకీలు ఉన్నారు! మణిపూర్ జనాభాలో సుమారు 53 శాతం మెయితీలు ఉండగా.. నాగాలు, కుకీలతో సహా గిరిజనులు 40 శాతం మంది ఉన్నారు.
ఇప్పుడు ఈ విషయం తెరపైకి రావడానికి గల కారణం… ఇజ్రాయెల్ తో చారిత్రక సంబంధం ఉన్న బేణీ మెనాషే తెగకు చెందిన కుకీలు సుమారు 5,000 మంది ఎప్పటి నుంచో ఈ మణిపూర్ లోనే నివసిస్తున్నారు. వీరికి భారత పౌరసత్వం ఉంది. ఇదే సమయంలో.. వీరికి తమ పూర్వీకులు నివసిస్తున్న ఇజ్రాయెల్ దేశానికి వెళ్లాలనే ఆరాటమూ ఉందని చెబుతారు. దీంతో.. వీరిని తమ దేశానికి తీసుకెళ్లేందుకు “ఆపరేషన్ వింగ్స్ ఆఫ్ డాన్” ను చేపట్టింది ఇజ్రాయెల్.
దీంతో తొలి విడతలో భాగంగా ఇజ్రాయెల్ 250 మందిని మణిపూర్ నుంచి ఢిల్లీ మీదుగా ప్రత్యేక విమానంలో ఎయిర్ లిప్ట్ చేశారు. గతేడాది ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రభుత్వం భారత్ నుంచి ఈ వర్గానికి చెందిన సుమారు 4,600 మంది సభ్యుల వలసలకు నిధులు సమకూర్చాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే తాజాగా పని మొదలుపెట్టింది.
ఇక్కడ బేణీ మెనాషే.. ఆపరేషన్ వింగ్స్ ఆఫ్ డాన్ లో “డాన్” అంటే.. వీరంతా ఇప్పుడు ఇజ్రాయెల్ కి వెళ్లడంలో మతం పాత్ర.. మొదలైన విషయాలు తెలియాలంటే బైబిల్ గ్రంథం లోని పాత నిబంధనకు వెళ్లాలి. ఆ విషయాలు ఓసారి క్లుప్తంగా పరిశీలించాల్సి ఉంటుంది!
బైబిల్ ప్రకారం ఇశ్రాయేల్ ప్రజలు 12 గోత్రాలుగా విభజించబడ్డారు. ఈ గోత్రాలు యాకోబు పన్నెండు మంది కుమారుల నుండి ఉద్భవించాయి. వాటిలో పది తెగలకు యాకోబు కుమారుల పేర్లు పెట్టగా, మిగిలిన రెండు తెగలకు అతని మనవళ్ళైన ఎఫ్రాయిమ్, మెనాషే పేర్లు పెట్టారు. వీరు యోసేపు కుమారులు కాగా… తాజాగా మణిపూర్ లో ఉన్న బేణి మెనాషే సమాజం తాము మెనాషే వంశస్థులమని చెబుతారు!
వాస్తవానికి… క్రీ.పూ. 722లో అస్సిరియన్ సామ్రాజ్యం ఉత్తర ఇజ్రాయెల్ రాజ్యాన్ని జయించిన సమయంలో.. సుమారు 10 తెగలను వారు బహిష్కరించారు. ఆ సమయంలో ఇశ్రాయేలు రాజ్యం నుండి పదివేల మంది ఇశ్రాయేలీయులు బలవంతంగా వేరే ప్రాంతాలకు తరలించబడ్డారు. ఈ క్రమంలో వారిలో చాలామంది పర్షియా, ఆఫ్ఘనిస్తాన్, టిబెట్, చైనాల గుండా శతాబ్దాల పాటు సాగిన వలసల తర్వాత భారతదేశ ఈశాన్య ప్రాంతాలైన మణిపూర్, మిజోరంలో స్థిరపడ్డారు.
ఈ క్రమంలో… మణిపూర్ బేణి మెనాషే సమాజాన్ని కుకీలుగా వర్గీకరించారు. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే… ఇజ్రాయెల్ నుంచి సుమారు 300 ఏళ్ల క్రితం కూడా కొంతమంది యూదులు వివిధ ప్రాంతాలకు వలస రాగా.. అందులో కొంతమంది తొలుత తెలంగాణ ప్రాంతానికి, ఆ తర్వాత ఆంధ్ర ప్రాంతానికి వచ్చారని చెబుతున్నారు గుంటూరు జిల్లాకు చెందిన కొంతమంది వ్యక్తులు.
ఈ క్రమంలో… గుంటూరు జిల్లా కొత్తరెడ్డిపాలెంలో వందేళ్ల క్రితం నుంచే తమ కుటుంబీకులు నివపిస్తున్నట్టు చెబుతున్నారు సుమారు 40 కుటుంబాలకు చెందిన వారు. కొత్తరెడ్డిపాలెంలో యూదులు కుటుంబాలు మొత్తం 40 ఉన్నాయని.. వీరి మొత్తం జనాబా సుమారు 250 ఉంటుందని చెబుతున్నారు. వీరిలో చాలా మందికి హీబ్రూ రాయడం, చదవడం, మాట్లాడడం కూడా తెలుసు!
ఆ సంగతి అలా ఉంటే… ఇప్పుడు సడన్ గా మణిపూర్ లోని వీరిందరినీ ఇజ్రాయెల్ తమ దేశానికి తీసుకెళ్లాలని ఎందుకు భావించింది..? ఈ కార్యక్రమానికి ఆపరేషన్ వింగ్స్ ఆఫ్ ‘డాన్’ అనే పేరు ఎందుకు పెట్టింది..? అనే విషయాలు ఆసక్తిగా మారాయి. దీనికి అటు సామాజిక, ఇటు బైబిల్ పరమైన కారణాలు కనిపిస్తున్నాయి.
వాస్తవానికి గాజాలో హమాస్ తో, ఇటీవల ఇరాన్ తో, ప్రస్తుతం లెబనా లోని హెజ్ బొల్లా గ్రూపుతో సుదీర్ఘ యుద్ధంలో నిమగ్నమై ఉంది ఇజ్రాయెల్! ఈ నేపథ్యంలో కార్మికుల కొరతను తీవ్రంగా ఎదుర్కొంటోందని అంటున్నారు. మరోవైపు.. ఈ వరుస యుద్ధాల కారణంగా నేపాల్, థాయిలాండ్ వంటి దేశాల నుండి వలస కార్మికుల సంఖ్య తగ్గడం కూడా తగ్గిందని చెబుతున్నారు.
ఈ నేపథ్యంలోనే తన వంశస్తుల గోత్రాలకు చెందిన బేణీ మెనాషే వర్గాన్ని తరలించడం ద్వారా వారి కార్మిక శక్తిని తిరిగి సమకూర్చుకోవడానికి సాయపడుతుందని అంటున్నారు. ఈ సమయంలో వీరిని తొలుత నజరేత్ కు అభిముఖంగా ఉన్న ఉత్తర నగరమైన నోఫ్ హగలిల్ లోని ఓ కేంద్రంలో స్థిరపరుస్తారని చెబుతున్నారు.
ఎందుకంటే… ఈ నగరం ఒక ప్రధాన పారిశ్రామిక, వ్యాపార కేంద్రంగా పనిచేస్తుంది. ఇందులో జిప్పోరిట్ ఇండస్ట్రియల్ జోన్, అభివృద్ధి చెందుతున్న హైటెక్ రంగం ఉన్నాయి. గత కొంతకాలంగా ఈ ప్రాంతంలో వలసలు పెరుగుతున్నాయని గణాంకాలు చెబుతున్నాయి. వీరిలో అరబ్బుల సంఖ్య పెరుగుతుందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో… తాజా ఆపరేషన్ తో యూదా జనాభాను ఆ ప్రాంతంలో పెంచే ప్రయత్నంగా కూడా చూస్తున్నారు.
ఇక ఆపరేషన్ వింగ్స్ ఆఫ్ డాన్ లో “డాన్” అనే పదాన్ని బైబిల్ నుంచే తీసుకున్నారు! బైబిల్ లోని పాతనిబంధన గ్రంథంలో కీర్తనల గ్రంథంలోని 139వ అధ్యాయంలో… “యెహోవా… నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించినను అక్కడను నీ చేయి నన్ను నడిపించును, నీ కుడిచేయి నన్ను పట్టుకొనును” అని దావీదు రాసిన విషయాన్ని అప్లై చేస్తున్నారు.
అంటే.. తన ప్రజలు ఎక్కడున్నా దేవుడు వారి చేయి విడువడని, వారిని విడిచిపెట్టడని, వారిని తన రాజ్యంలోకి చేర్చుకుంటాడని అర్ధంగా చెబుతున్నారు. ఇదే సమయంలో… కొత్త ఆశ, లేదా కొత్త జీవితం యొక్క ప్రారంభాన్ని ఇది సూచిస్తుందని అంటున్నారు.
