జనసేన అధినేత పవన్ కల్యాణ్ బ్రహ్మాస్త్రమట. అలాగని పవన్ సోదరుడు నాగుబాబు చెప్పారు లేండి. ఆ అస్త్రాన్ని సక్రమంగా ఉపయోగించుకుంటే ప్రజలు అన్నీ సమస్యల నుండి బయటపతారని చెప్పటమే విచిత్రంగా ఉంది. ఎక్కడైనా కుక్క తోకను ఊపుతుందా లేకపోతే తోకే కుక్కను ఊపుతుందా ? నాగుబాబు చెప్పేదెలగుందంటే తోకే కుక్కను ఊపుతున్నట్లుంది.
ప్రజలు పవన్ ను సక్రమంగా ఉపయోగించుకోవాలట. జనాలు పవన్ ను ఎలా ఉపయోగించుకుంటారో మాత్రం నాగుబాబు చెప్పలేదు. మొన్నటి ఎన్నికల్లో జనసేనకు వచ్చింది సుమారుగా 20 లక్షల ఓట్లు. మొత్తం పోలైన 3.16 కోట్ల ఓట్లలో జనసేనకు వచ్చింది 20 లక్షల ఓట్లంటే సుమారు 6 శాతం ఓట్లు మాత్రమే.
పైగా పవన్ పోటి చేసిన గాజువాక, భీమవరం రెండు నియోజకవర్గాల్లోను ఓడిపోయారు. హోలు మొత్తం మీద జనసేన పోటీ చేసిన 145 నియోజకవర్గాల్లో దాదాపు 120 నియోజకవర్గాల్లో డిపాజిట్లే కోల్పోయింది. పార్టీకి డిపాజిట్లు ఇవ్వకపోవటమే కాకుండా అధినేతనే రెండు చోట్ల జనాలు తిరస్కరించారంటే జనసేనను ఏ స్ధాయిలో పక్కన పెట్టేశారో అర్ధమైపోతోంది.
అటువంటి పవన్ బ్రహ్మాస్త్రమట, అటువంటి అస్త్రాన్ని సక్రమంగా ఉపయోగించుకుని ప్రజలు తమ సమస్యల నుండి బయటపడాలట. ఒకరోజు జనాల్లో తిరిగితే 15 రోజులు మళ్ళీ పవన్ అడ్రస్సే ఉండరు. అలాంటి పవన్ ను నమ్ముకుంటే కుక్క తోకను పట్టుకుని గోదారిని ఈదినట్లే.
