కోటి రూపాయల కోసం జనం చావాలనుకుంటున్నారా వైకాపా ఎమ్మెల్యేగారు

YSR Congress Party
 
ఒక్కోసారి సొంత నేతల చేష్టలు, నోరుజారి మాట్లాడే మాటలు పార్టీలకు, ఆయా పార్టీల అధినేతలకు తలనొప్పులు తెచ్చిపెడుతుంటాయి.  తాజాగా టీవీ డిబెట్లో వైకాపా ఎమ్మెల్యే మాట్లాడిన మాటలే అందుకు నిదర్శనం.  ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ దుర్ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు సీఎం వైఎస్ జగన్ సత్వరమే కోటి రూపాయల పరిహారం ప్రకటించి వారికి చెక్కులు కూడా అందేలా చేశారు.  జగన్ ఇంత వేగంగా స్పందించి, పరిహారం ఇవ్వడం పట్ల బాధితుల్లో, ప్రజల్లో హర్షం వ్యక్తమవుతోంది.  ఇతర పార్టీల నేతలు సైతం ఇంత భారీ మొత్తంలో పరిహారం ఇవ్వడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశారు. 
 
ఇలా ఈ చర్య పార్టీ మైలేజీని పెంచుతూ, బాధిత గ్రామాల్లో ఆందోళనలు జరగకుండా సహకరిస్తున్న వేళ దీన్ని మరింతగా పబ్లిసిటీ చేయాలనే ఉత్సాహంతో జగన్ యొక్క టీవీ ఛానెల్ సాక్షిలో కొందరు వైకాపా నేతలను పిలిచి లైవ్ డిబేట్ నిర్వహించారు.  డిబేట్లో సీఎం చర్యలను ఆకాశానికెత్తే కార్యక్రమం జోరుగా సాగుతున్న వేళ వైకాపా చోడవరం ఎమ్మెల్యే ధర్మశ్రీ నోరుజారారు.  అనకూడదుకానీ అంటూనే బాధితుల్లో అస్వస్థతకు గురై కొలుకుంటున్న ఒకరిద్దరు బాధితులు తాము కూడా చనిపోయి ఉంటే కోటి రూపాయలు దక్కేవని అనుకున్నట్టు అన్నారు.  
 
దీంతో డిబేట్లో కూర్చున్న అందరూ షాకయ్యారు.  డిబేట్ పెట్టి మరీ సెల్ఫ్ గోల్ వేసుకున్నామని నాలుక కరుచుకున్నారు.  ఇక ఇది చూసిన జనం సదరు వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ కుటుంబ సభ్యులను కోల్పోయి కొందరు, చికిత్స పొందుతూ కొందరు, దీర్ఘకాలిక రోగాలకు భయపడుతూ కొందరు బిక్కుబిక్కుమంటుంటే వైకాపా ఎమ్మెల్యే ఆలోచనా తీరు మాత్రం ఇంత దారుణంగా ఉందా, వీళ్ళిచ్చే కోటి రూపాయల కోసం జనం చావాలనుకుంటున్నారా, ఇది ఏ టైప్ ప్రచారం నాయనా! అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు.  
 
YCP MLA Karan Dharmasri
Rampachodavaram MLA Karan Dharmasri