దేశభక్తి ఆవహించేలా చేశారు : ‘గోల్డ్’ మూవీ రివ్యూ

(సికిందర్ )

‘గోల్డ్’

దర్శకత్వం : రీమా కాగ్తీ

తారాగణం : అక్షయ్ కుమార్, మౌనీరాయ్, కునాల్ కపూర్, సన్నీ కౌశల్, అమిత్ సాథ్, వినీత్ కుమార్ సింగ్, నికితా దత్తా తదితరులు

కథ : రీమా కాగ్తీ, రాజేష్ దేవరాజ్, స్క్రీన్ ప్లే : రాజేష్ దేవరాజ్, మాటలు : జావేద్ అఖ్తర్

సంగీతం : ఆర్కో ప్రావో ముఖర్జీ, తనిష్క్ బాగ్చీ, నేపథ్య సంగీతం : సచిన్ – జిగర్, ఛాయాగ్రహణం : అల్వరో గుట్రేజ్

బ్యానర్ : ఎక్సెల్ ఎంటర్ టైన్మెంట్

నిర్మాతలు : రీతేష్ శిధ్వానీ, ఫర్హాన్ అఖ్తర్

విడుదల : ఆగస్టు15, 2018

 

 మా రేటింగ్ 3.5 / 5

 

          అక్షయ్ కుమార్ స్పోర్ట్స్ డ్రామాల్లో ‘బ్రదర్స్’ తర్వాత  ‘గోల్డ్’ బాక్సాఫీసు గోల్ కొట్టేందుకు సిద్ధమై వచ్చింది. ‘బ్రదర్స్’ లో మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ ని పరిచయంచేస్తే, ‘గోల్డ్’ లో 1948 నాటి ఇండియన్ హాకీ టీం లండన్లో సాధించిన ఒలింపిక్స్ గోల్డ్ మెడల్ సువర్ణాధ్యాయ ఘట్టాన్ని పరిచయం చేశాడు. బాలీవుడ్ లో దీపామెహతా (1947 –ఎర్త్, వాటర్), మేఘనా గుల్జార్ (రాజీ) ల తర్వాత పీరియడ్ మూవీస్ తీసిన దర్శకురాళ్ళ జాబితాలో ఇప్పుడు రీమా కాగ్తీ చేరిపోయింది. బిగ్ కాన్వాస్ మీద బృహత్ ప్రాజెక్టులుగా మేల్ డైరెక్టర్స్ మాత్రమే తీస్తూ వచ్చిన పీరియడ్ మూవీస్ సెగ్మెంట్ లో, వాళ్ళకే మాత్రం తీసిపోకుండా పాదం మోపింది. ఒక యదార్థ ఘట్టంతో భారీ కమర్షియల్ ప్రయోగం చేసింది.

 

కథ

          1936 లో జర్మనీలోని బెర్లిన్ ఒలింపిక్స్ లో బ్రిటిషిండియా హాకీ టీముకి జ్యూనియర్ మేనేజర్ గా వున్న తపన్ దాస్ (అక్షయ్ కుమార్), అడాల్ఫ్ హిట్లర్ సమక్షంలో జర్మనీని చిత్తుగా ఓడించి గోల్డ్ మెడల్ సాధిస్తాడు. అయితే ఇండియా ఇంకా బ్రిటిష్ పాలనలోనే వుంది గనుక బ్రిటిష్ పతాక మెగరేసి, బ్రిటిష్ జాతీయ గీతం పాడేసరికి వొళ్ళు మండిపోతుంది తపన్ కి. అప్పుడే గట్టి ప్రతిన బూనుతాడు. ఇక ఎట్టి పరిస్థితిలో స్వతంత్ర భారత్ ని ఒలింపిక్స్ లోకి నడిపించి గోల్డ్ మెడల్ కొట్టాలన్న ధ్యేయంతో వుంటాడు. అయితే ఆ స్వాతంత్ర్యమూ, ఒలింపిక్సూ రావడం లేటవుతూంటాయి. హిట్లర్ వెలగబెట్టిన రెండో ప్రపంచ యుద్ధంతో 1940, 45 లలో జరగాల్సిన ఒలింపిక్స్ వాయిదా పడతాయి.1945 లో యుద్ధం ముగిశాక, 1946 లో ఒలింపిక్స్ గురించి ప్రకటన వస్తుంది.1948 లో లండన్లో నిర్వహిస్తామని. ఈ మధ్య కాలమంతా మనసు విరిగిన తపన్ తాగుడికి బానిసవుతాడు. చివరికి 1947 లో అతను ఎదురుచూసిన స్వాత్రంత్ర్యం లభిస్తుంది. అయితే దీనికి ముందే హాకీ ఫెడరేషన్ ని కదిలించి ఆటగాళ్ళని వెతికి వెతికి కష్టపడి టీముని తయారు చేసుకుంటాడు. ఇంతలో స్వాతంత్ర్యం లభించి, దేశ విభజన పరిణామాల్లో టీము మూడు ముక్కలవుతుంది. తపన్ తీవ్ర సంక్షోభంలో పడిపోతాడు. ఇప్పుడేం చేయాలి? కొత్త టీముకి ఫెడరేషన్ సహకరించడం లేదు. సొంత డబ్బులు పెట్టుకుని కొత్త టీముకి తానే తయారు చేసుకోవాలా? ఏం చేసి గోల్డ్ కొట్టాలి?

 

ఎలావుంది కథ

          1948 లో స్వతంత్ర భారత్ అందుకున్న మొదటి ఒలింపిక్స్ గోల్డ్ మెడల్ – అదీ లండన్లో బ్రిటిష్ గడ్డ మీద బ్రిటిష్ టీముని ఓడించి సాధించిన స్వర్ణపతకం వరకూ యదార్థ ఘట్టమే. దీన్ని స్పూర్తిగా తీసుకుని కథ అల్లేశారు. ఈ కథలో అన్నీ కల్పిత పాత్రలే, కల్పిత సంఘటనలే, కల్పిత థ్రిల్స్ – డ్రామాలే. ఇలా చేయవచ్చా అంటే ఏమో – అక్షయ్ కుమారే నటించిన ‘ఏర్ లిఫ్ట్’ (2015) లో కువైట్ యుద్ధంలో చిక్కుకున్న భారతీయుల తరలింపు ఘటనని కూడా ఫిక్షన్ చేసి ప్రభుత్వ వర్గాల నుంచే విమర్శలెదుర్కొన్నారు.

          ‘గోల్డ్’ లో కేవలం రెండే పాత్రలకి యదార్థంలో మూలాలు కన్పిస్తాయి. కథలో సృష్టించిన కెప్టెన్ ఇంతియాజ్ అలీ షా, ప్లేయర్ హిమ్మత్ సింగ్ పాత్రలు. మొదటి దానికి హాకీ స్టార్ కేశవ్ దత్ ఆధారం.1947 లో దేశవిభజన నేపధ్యంలో జరిగిన మత హింసలో లాహోర్ కి చెందిన కేశవ్ దత్ ఇరుక్కుంటే, టీం సభ్యుడు షారుఖ్ తన ఇంట్లోదాచి పెట్టాడు. ఇంటి మీద దాడి జరిగే సరికి రైలెక్కించి ఢిల్లీ పంపించేశాడు. ఆ తర్వాత వీళ్ళిద్దరూ 1948 లో రెండు దేశాల తరపున టీం మెంబర్లుగా లండన్ ఒలింపిక్స్ లో కలుసుకున్నారు.

          కథలో ఇప్పుడు జాయింట్ మేనేజర్ గా వున్న తపన్ దాస్ (అక్షయ్ కుమార్), టీం కెప్టెన్ గా ఇంతియాజ్ అలీ షా పాత్రని ఎంపిక చేస్తాడు. టీములో ఇంకొందరు ముస్లిములుంటారు. మత హింస జరిగినప్పుడు అమృత్ సర్ లో వున్న ఇంతియాజ్ ని చంపడానికి వెంట బడతారు. తపన్, మరో ఇద్దరు టీం మెంబర్లు కాపాడతారు. అప్పుడు ఇంతియాజ్ – నా లాహోర్ ఇప్పుడు ఈ దేశంలో లేదు, నేనిక్కడి వాసిని కాను – అంటాడు. అతణ్ణి బాధాకరంగా లాహోర్ రైలెక్కిస్తారు. అతను పాక్ కి నాయకత్వం వహిస్తూ లండన్ ఒలింపిక్స్ కొస్తాడు. ఇక్కడ – విద్యాబాలన్ నటించిన ‘బేగం జాన్’ (2017) ఛాయలు కన్పిస్తాయి. ఈ కల్పిత కథలో దేశ విభజన రేఖ గీసే ఇద్దరు స్నేహితులైన హిందూ ముస్లిం రెవిన్యూ అధికారులు, విభజన రేఖ కిరువైపులా చేరిపోయిన తమ స్వస్థలాల ఖర్మాన స్నేహితులుగా తామూ విడిపోవాల్సి వస్తుంది.

          రెండో పాత్ర పంజాబుకి చెందిన హిమ్మత్ సింగ్. దీనికి ఆధారం ఇప్పటికీ జీవించి వున్న బల్బీర్ సింగ్. ఈయన ఒకటి కాదు,          మూడు సార్లు ఒలింపిక్స్ హాకీ గోల్డ్ మెడల్ ఛాంపియన్ గా వినుతి కెక్కారు. అయితే వాస్తవంగా లండన్ ఒలింపిక్స్ లో బల్బీర్ సింగ్ రెండు కీలక గోల్స్ కొట్టి 4-0 స్కోరుతో బ్రిటన్ ని ఓడించారు. కథలో హిమ్మత్ సింగ్ రెండు కీలక గోల్స్ కొట్టి, 3 – 1 స్కోరుగా చూపించారు. టీం మెంబర్ తో హిమ్మత్ తాగి ఘర్షణ పడ్డం, బహిష్కరణకి గురికావడం, అప్పుడు ఇండియా ఒకే గోల్ కొట్టి ఓడిపోయే ప్రమాదంలో పడినప్పుడు, అతనే గత్యంతరమై పిలిస్తే వచ్చి రెండు గోల్స్ కొట్టి టీముకి గోల్డ్ మెడల్ సాధించి పెట్టడం ఈ డ్రామా అంతా కల్పితం. ఈ డ్రామా కోసం, అతడి (బల్బీర్?) హీరోయిజం కోసం, టీము ఒకే గోల్ కొట్టి చేతులెత్తేసినట్టు చూపించారు.

          నిజానికి దేశం ముక్కలైనప్పుడు ఇండో – పాక్ జాయింట్ టీముగా లండన్ ఒలింపిక్స్ కి పంపాలన్న ఆలోచన వచ్చింది. దేశవిభజనతో చాలా మంది ముస్లిం ప్లేయర్స్ ని ఇండియన్ టీము కోల్పోయింది. అయితే తర్వాత ఈ ఆలోచన విరమించుకున్నారు.

కథలో మాత్రం తపన్ దాస్ టీములో కెప్టెన్ ఇంతియాజ్ సహా మరికొన్ని ముస్లిం పాత్రలుంటాయి. దేశవిభజన తర్వాత కొత్త టీములో వీళ్ళెవరూ వుండరు. అయితే వాస్తవంలో  గోల్డ్ మెడల్ కొట్టిన టీములో ఎనిమింది మంది క్రిస్టియన్లు, ఇద్దరు ముస్లిములు వున్నారు. కథలో వీళ్ళు కన్పించరు. క్రిస్టియన్లు ఆస్ట్రేలియా వెళ్లిపోయినట్టు, ముస్లిములు పాకిస్తాన్ వెళ్ళిపోయినట్టు  విచిత్రంగా చెప్తారు!

          పైన చెప్పుకున్న అప్పుడప్పుడే స్వాతంత్య్రం  లభించిన నేపధ్యంలో ఇండో – పాక్ సమిష్టి టీముని లండన్ ఒలింపిక్స్ కి పంపాలని యదార్ధంగా చేసిన ఆలోచనలాంటిది, ఏకంగా కార్యరూపంలో పూర్తి స్థాయిలో, బంపర్ గా సల్మాన్ ఖాన్ నటించిన ‘టైగర్ జిందాహై’ (2017) లో దర్శనమిస్తుంది. కాకపోతే క్రీడల ఖాతాలో కాకుండా  యుద్ధ ఖాతాలో వేశారు. ఇందులో, సిరియాలో ఐసిస్ పనిబట్టడానికి ఇండియన్ ‘రా’ ఏజెంట్ టీము వెళ్తే, ఇదే పని మీద పాక్ ఐఎస్ఐ టీం కూడా వస్తుంది. కాసేపు ఆధిపత్యపు పోరులాడుకుని, రాజీపడి, కలిసి ఐసిస్ ని ఖతం చేస్తారు. అప్పుడు ఒకే వాహనానికి తమ రెండు దేశాల జెండాలు రెపరెప లాడించుకుంటూ బయల్దేరతారు. నవ్వొచ్చే వ్యవహారం.

          ఇక తపన్ దాస్ పాత్ర. వాస్తవంలో ఏసీ ఛటర్జీ అనే అతను టీం మేనేజర్ గా వున్నాడు. ఆయనకి తపన్ దాస్ పాత్ర కథంతా లేదు. 1936 లో జర్మనీ గోల్డ్ గెలవడం దగ్గర్నుంచీ, 1948 లో లండన్ గోల్డ్ వరకూ తపన్ దాస్ స్ట్రగుల్ అంతా సినిమా కష్టాలే.

          కథకి అపూర్వ దేశభక్తిని జోడించారు. తెలుగు సినిమాల్లో పిచ్చి పిచ్చి కథలకి దేశభక్తిని జోడించినట్టుగాక, నమ్మదగ్గ దేశభక్తిని ఎంతో ఫీలయ్యేలా కల్పించారు. ఆనాటి దేశభక్తికి ఆలంబన స్వరాజ్య కాంక్ష. దేశభక్తి గురించి మాట్లాడే, నినదించే అర్హత, ఆనాడు బ్రిటిష్ పాలనలో మగ్గిన, లాఠీ దెబ్బలుతిన్న ప్రజా సమూహాలకే వుంటుందేమో. ఆ వేడిలో ఈ కథ నడవబట్టి దేశభక్తి అంత మౌలికంగా హైలైట్ అయింది.

          ఇందులో జావేద్ అఖ్తర్ రాసిన అనేక బలమైన డైలాగుల్లో ఒక  డైలాగు- ‘మీరు మీమీ రాష్ట్ర్రాల్ని చూసుకోండి, నగరాల్ని చూసుకోండి,  వీధుల్ని చూసుకోండి, మీమీ అహంకారాలనీ, ఇగోల్నీ చూసుకోండి… నేను ఇండియాని చూస్తా!’ అని. స్వాతంత్ర్యం తర్వాత కొత్త టీం మెంబర్లు వాళ్ళ వాళ్ళ ప్రాంతాలుగా, భాషలుగా విడిపోయి గ్రూపులు కట్టి కొట్టుకుంటే, అక్షయ్ కుమార్ కొట్టే పవర్ఫుల్ దేశభక్తి డైలాగు.

           కేవలం ‘1948 ఒలింపిక్స్ గోల్డ్’ అనే యదార్థ పాయింటుని తీసుకుని, దాని చుట్టూ సినిమా కథ అల్లేసి, శక్తివంతంగా ప్రేక్షకుల ముందుంచారు.

ఎవరెలా చేశారు

   అక్షయ్ కుమార్ ది బెంగాలీ బాబు పాత్ర. దోవతీ కట్టుకునే వుంటాడు. విచారం కలిగితే తాగేస్తాడు. హుషారొస్తే తాగి చిందులేస్తాడు. రెండు సార్లు ఆఫీసర్ల మధ్య తాగి అల్లరల్లరి పాటలు పాడతాడు. ఇది కలెక్షన్లు రాబట్టాల్సిన సినిమా అని దర్శకురాలికి తెల్సు. నిజజీవితంలో ఒక ధ్యేయం కోసం పోరాడిన వ్యక్తుల్ని పాత్రలుగా చేసి సినిమాలు తీస్తే అవి  త్రెడ్ తెగకుండా పవర్ఫుల్ గా ధ్యేయం కోసం ముందుకు దూసుకెళ్తూ వుంటాయి. అదే ఇతర సినిమాల్లో హీరోగారి గోల్ ఏమవుతుందో ఏమో, పాసివ్ పరమానందయ్యలాగా మారిపోయి హీరోనే అన్పించుకోడు.

          అక్షయ్ కుమార్ ప్రారంభంలో జర్మనీలో గోల్డ్ గెలిచి పొందిన పరాభవంతో, ఇక ఫ్రీ ఇండియాగా గోల్డ్ కొట్టాలన్న బలమైన గోల్ ఏర్పర్చుకుంది లగాయతూ అదే సంకల్ప బలంతో ఎడతెగని యాక్షన్ లో వుంటాడు. రెండు గంటల 50 నిమిషాల నిడివిగల సినిమాలో, చివరి అరగంట తప్ప, మిగతా స్క్రీన్ టైమంతా తన టీం ఏర్పాటు కోసం తన స్ట్రగుల్ గురించే నడిచే సుదీర్ఘ కథలో, ఎక్కడా బలహీనపడనీయకుండా భగభగ మండిస్తూంటాడు పాత్రని. చివరి అరగంటకి గానీ అసలు షో – లండన్ లో ఒలింపిక్ హోరాహోరీ ప్రారంభం కాదు. అప్పుడుండే నటన పరాకాష్ట.

          ఇంటర్వెల్ కొచ్చేసరికి ఫస్టాఫ్ లో అప్పటివరకూ టీంని పోగేసి ట్రైనింగ్ కూడా ఇప్పించాక, దేశ విభజనతో ఆ చేసుకుంటూ వచ్చిన ఏర్పాట్లన్నీ వృధా అయిపోతాయి. అప్పుడు అక్షయ్ పరిస్థితి ఘోరంగా వుంటుంది. ఈ సీనుని కూడా అపూర్వంగా నిలబెట్టాడు. 

          తనకి రోమాంటిక్ యాంగిల్ లేకపోలేదు. అయినా ఇది పాత్ర మౌలిక ప్రయాణానికి అడ్డుపడదు. చిర్రుబుర్రులాడే బెంగాలీ భార్య మనోబినా (మౌనీరాయ్) తో చాలా తంటాలు పడుతూ కామెడీలు చేస్తాడు. పిడికిట్లో ఇమిడేంత సన్నగా వుండే హీరోయిన్ మౌనీరాయ్ ఎక్కడా నవ్వదు.

          హాకీ ప్లేయర్స్ ముఖ్య పాత్రల్లో సామ్రాట్ గా కునాల్ కపూర్, రఘువీర్ ప్రతాప్ సింగ్ గా అమిత్ సాద్, ఇంతియాజ్ అలీ షాగా వినీత్ కుమార్ సింగ్, హిమ్మత్ సింగ్ గా సన్నీ కుశాల్ కనిపిస్తారు. సీనియర్ నటుడు దలీప్ తహిల్ హాకీ ఫెడెరేషన్ బాస్ గా కనిపిస్తాడు.

          ఈ పీరియడ్ మూవీకి ఆనాటి నేపధ్య వాతావరణ కల్పన, స్టేడియాలు సహా రకరకాల ఇతర కట్టడాలు వగైరాల్ని పకడ్బందీగా ఆ కాలాన్ని తలపించేట్టు పునఃసృష్టి చేశారు. లండన్ స్టేడియంలో హోరాహోరీ ఆట- మధ్యలో వర్షం మొదలై ఆ సస్పన్స్ డ్రామా – థ్రిల్లింగ్ గా చిత్రీకరించారు. టీంకి ‘తురప్ ఇక్కా’ (తురుపు ముక్క) అయిన హిమ్మత్ సింగ్ రెండో గోల్ కొట్టే షాట్స్ ని స్లోమోషన్ లో తీయడం డ్రామాని పతాక స్థాయికి చేర్చింది.

          ‘దంగల్’ అయినా మరొకటైనా బాలీవుడ్ సీరియస్ సినిమాల్లో హాస్యం వొలికే డైలాగులు తప్పకుండ వుండేట్టు చూసుకుంటున్నారు. పదేళ్ళ తర్వాత ఇప్పుడు డైలాగులు రాసిన జావేద్ అఖ్తర్, హాస్యంతో బాటు మిగతా భావోద్వేగాల డైలాగుల సంగతి చూసుకున్నారు (హమారా సర్ పర్ బ్రిటిష్ ఫ్లాగ్ ఫడ్ ఫడాకే హమ్ సబ్ కో మానో యహీ బోల్ రహా థా – యూ ఆర్ నాట్ ఫ్రీ!)

          క్రీడని, దేశభక్తిని దర్శకురాలి దృక్కోణంలో చూడ్డమే ఒక కొత్త అనుభవం – అందునా పీరియడ్ మూవీగా. ఇండియాని చూడాలంటే మల్టీ ప్లెక్సులకి వెళ్తే కాదు, హైదరాబాద్ అబిడ్స్ లో రామకృష్ణ సింగిల్ స్క్రీన్ థియేటర్లకి వెళ్ళాలి. అన్ని జాతులు ఇక్కడ చేరతాయి, బాల్కనీ నుంచీ బెంచి దాకా. అందరి ప్రతిస్పందనలు ఒకేసారి తెలుస్తాయి. క్రిక్కిరిసి కూర్చుని ఊపిరి బిగబట్టుకుని ఆటంతా చూశాక, ముగింపులో లేచి నిలబడి జై భారత్ నినాదాలు చేసి వెళ్లారు. ఇదీ నిజమైన ఇండియా అంటే!