‘ఎబిసిడి’ రివ్యూ – చిన్న మహర్షి అవుదామనుకుంటే…

ఐదు సినిమాల అల్లుశిరీష్ యువహీరోగా నిలదొక్కుకోవడానికి స్ట్రగుల్ చేస్తున్నాడు. ఆరో సినిమాగా నాలుగక్షరాల ‘ఎబిసిడి’ కొచ్చాడు. రీమేక్ తో, కొత్త దర్శకుడితో ఒక ప్రయోగం చేస్తున్నట్టు చెప్పాడు. అట్టహాసంగా 600 పై చిలుకు ధియేటర్లలో విడుదల  చేస్తున్నట్టు చెప్పారు. ఇంత హడావిడీ చేస్తున్న ఈ శిరీష్ లేటెస్ట్ ఆఫర్ అసలెలా వుందో చూద్దాం…

కథ 
          

అమెరికాలో అవీ (అల్లు శిరీష్), ఎన్నారై (నాగబాబు) కొడుకు. అత్త కొడుకు బాల షణ్ముగం ఉరఫ్ బాషా (మాస్టర్ భరత్) తో కలిసి,  విచ్చలవిడిగా నెలకు 20వేల డాలర్లు తండ్రి సొత్తు ఎంజాయ్ చేస్తూంటాడు. ఒక పబ్ లో కొందరితో  గొడవపడి అది సీరియస్ అవడంతో ఇక లాభంలేదని తండ్రి ఇండియాలో ఎంజాయ్ చేయమని ఇద్దర్నీ పంపించేస్తాడు. హైదరాబాద్ చేరుకున్న తర్వాత వాళ్ళ కార్డ్స్ బ్లాక్ చేసి డబ్బందకుండా చేస్తాడు. కాలేజీలో ఎంబీఏ చదువుకుంటే నెలకు ఐదు వేలు పంపిస్తానంటాడు. చేసేది లేక కాలేజీలో చేరి, బస్తీలో నిరుపేద జీవితం గడుపుతూంటారు. కాలేజీలో నేహా (రుక్సార్ ధిల్లాన్) తో ప్రేమలో పడతాడు అవీ. కాలేజీని నాగేంద్ర (శుభలేఖ సుధాకర్) అనే రాజకీయ నాయకుడి కొడుకు భార్గవ (రాజా) నిర్వహిస్తూంటాడు.

తండ్రి స్థానంలో ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమై, అందుకు డబ్బుల కోసం విద్యార్ధుల పాత బకాయిల మీద వొత్తిడి తెస్తాడు. దీంతో ఓ విద్యార్ధిని ఆత్మహత్యా యత్నం చేస్తుంది. అవీ తిరగబడతాడు. విద్యార్ధుల మన్నన పొందుతాడు. మీడియా దృష్టిలో పడతాడు. ఓ ఛానెల్ అవీ, బాషా ఇద్దరి మీదా కవరేజీ ఇచ్చి సెలెబ్రిటీలుగా మార్చేస్తుంది. ఆస్తులు ఆడంబరాలు వదులుకున్న అభినవ బుద్ధుడిగా అవీని కీర్తిస్తుంది. అమెరికానుంచి వచ్చిన ఈ ఇద్దరు ఎన్నారై యువకులు, రోజుకు 82 రూపాయలతో జీవించి చూపిస్తున్నారని బ్రేకింగ్ న్యూసులిస్తుంది. కానీ ఇద్దరికీ అమెరికా చెక్కేసే ఆలోచనలే వుంటాయి. దీనికి డబ్బుల కోసం చూస్తూంటే సాక్షి ఛానెల్ ఐదు లక్షల బహుమతితో యూత్ ఐకాన్ కాంపిటేషన్ పెడుతుంది. అవీ దీంట్లో జాయినై  పాపులారిటీ రేటింగ్స్ లో భార్గవని ఓడించేస్తాడు. అప్పుడు భార్గవ బ్లాక్ మెయిల్ చేస్తాడు. మరో వైపు అతడి కెమికల్ ఫ్యాక్టరీ మూసెయ్యాలన్న ఆందోళన నడుస్తూంటుంది. ఈ రెండు సమస్యల్ని అవీ ఎలా ఎదుర్కొన్నాడు? ఇదీ కథ. 


ఎలా వుంది కథ
 


          2013 లో ఇదే టైటిల్ తో (ఎబిసిడి – అమెరికన్ బార్న్ కన్ఫ్యూజ్డ్ దేశీ) వచ్చిన డీక్యూ సల్మాన్ మూవీకి ఇది రీమేక్. ఏ లక్ష్యం లేకుండా విచ్చలవిడిగా ఎంజాయ్ చేసే ఎన్నారై కొడుకులు డబ్బు లేకపోతే జీవితం గురించి ఏం నేర్చుకుంటారనేది పాయింటు. మలయాళంలో పెద్ద హిట్ కాలేదుగానీ సల్మాన్ కీ, కొత్త దర్శకుడు మార్టిన్ ప్రకట్ కీ, అలాగే కెమెరామాన్ జమన్ జాన్ కీ మంచి పేరొచ్చింది. చాలా ఫన్నీ డైలాగులు వర్కౌట్ అయ్యాయి. కాకపోతే నిడివి 2.47 నిముషాలు కావడమే కథలేని కామెడీ విజయానికి అడ్డుపడింది. ఇలాటి సినిమాల్ని రెండు గంటల్లో ముగించి అవతల పడేస్తే కాస్సేపు నవ్వుకుని వెళ్ళిపోతారు. నిడివి పెరగడంతో కామెడీ తగ్గి, సామాజిక మెసేజి లివ్వడం కూడా తోడై, కోడై కూయలేకపోయింది మలయాళీ క్రియేటివిటీ.


          తెలుగు రీమేక్ కొత్త దర్శకుడు చేశాడు. మలయాళం ఒరిజినల్ లోంచి దాని సోల్ ని మాత్రమే తీసుకుని, రోమాన్స్ కలిపి  కథ అల్లుకున్నమన్నాడు అల్లు శిరీష్. నిడివి 2. 25 నిమిషాలకి తగ్గించారు గానీ ఇంకా తగ్గించాలి. అయితే ఈ రిమేక్ తో వచ్చిన సమస్య ఏమిటంటే, అది కాలం చెల్లిపోయిన కథ. 2013 నాటి మలయాళాన్ని ఇప్పుడు రీమేక్ చేస్తే అవుట్ డేటెడ్ గా వుంది కథ. 2013 లో మలయాళ కథకి మూలం అప్పట్లో ప్లానింగ్ కమిషన్ పేల్చిన జోకు. దారిద్ర్య రేఖకి దిగువున్న కుటుంబాలు జీవించడానికి రోజుకు 32 రూపాయలు సరిపోతాయని ప్రకటించి నవ్వులపాలైన సందర్భాన్ని సెటైర్ చేస్తూ మలయాళంలో తీశారు. ఇప్పుడా ప్లానింగ్ కమిషన్ పేరు మారింది, ప్రభుత్వంకూడా మారింది. 32 రూపాయల సూచీ కూడా ఇప్పుడు లేదు. కానీ విచిత్రంగా రీమేక్ లో ఈ అంశాన్నే హైలైట్  చేస్తూ, ప్రజల్లోకి వెళ్లి టీవీ ఛానెల్ చేసే హడావిడిని సాగదీసి సాగదీసి చూపించడం ఆశ్చర్య పర్చే విషయం. ఇదే అంశం  మంత్రిని ఇరుకున పెట్టినట్టూ, అతడి కొడుకుని కూడా ఇరుకున బెట్టి, హీరో 82 రూపాయలతో జీవిస్తున్నట్టూ కథ నడపడంతో, ఈ రీమేక్ కాలంతో సంబంధం లేని ఏదో కథలా తయారయ్యింది. 


ఎవరెలా చేశారు 


          అల్లు శిరీష్ ఇంకా చాలా చేయాలి. దుల్కర్ సల్మాన్ తో పోల్చడం అనవసరమైనా, తన వరకూ తను చేయాల్సింది ఇంకా చాలా వుంది. కామెడీ తనకి చాలా కొరకరాని కొయ్య. కామెడీ చేయలేనప్పుడు నిలబడి ఫన్నీ డైలాగులైనా కొట్టి కవర్ చేసుకోవాలి. కానీ మలయాళంలో వున్నంత కడుపుబ్బ నవ్వించే డైలాగులు లేకపోవడం పెద్ద లోపం. అల్లు శిరీష్ పాత్ర ముగింపుకి చేరుకున్నప్పుడు చేసే ప్రసంగం ఎమోషనల్ గా బాగా కుదిరింది. ఇదొక్కటే తను సాధించింది.


          ఇక జోడీగా నటించిన మాస్టర్ భరత్ కామెడీ కష్టమని తేలిపోయింది. అన్ని సీన్లలో నవ్వించలేక తేలిపోయాడు. ఈ పాత్రలో షకలక శంకరో, సప్తగిరినో వుంటే కామెడీని నిలబెడుతూ, అల్లు శిరీష్ ని కూడా కవర్ చేసే వాళ్ళు. కానీ వాళ్ళిద్దరూ హీరోలై పోదామని కన్పించకుండా పోయారు. 


          పక్కా కామెడీ చేసి నవ్వించింది మాత్రం కాఫీ విత్ కిషోర్ ప్రోగ్రాం చేసే వెన్నెల కిషోరే. వున్న రెండు సీన్లు దున్నుకుని వెళ్ళిపోయాడు. మరో కొత్త హీరోయిన్ రుక్సార్ ధిల్లాన్ గురించి చెప్పుకోవడానికేముంటుంది. నాగబాబు, శుభలేఖ సుధాకర్, కోట శ్రీనివాస రావు సీరియస్ పాత్రలు రాజాతో కలిపి.

 
          కొత్త దర్శకుడు సంజీవ్ రెడ్డి మేకింగ్ పెద్దగా క్వాలిటీ లేదు. మలయాళంలో వున్న క్రియేటివ్ టేకింగ్, హాలీవుడ్ స్థాయి కెమెరా వర్క్ తో బాటు, గోపీ సుందర్ క్రేజీ బాణీలు ఇక్కడ కుదరలేదు. కెమెరా వర్క్ చాలా పూర్ గావుంది. సంగీతం దారుణంగా వుంది.


చివరికేమిటి 


          ఇది చిన్న మహర్షి కథ. విచ్చలవిడి జీవితాన్నుంచి అసలు ప్రజలతో మమేకమైన జీవితమెలా వుంటుందో నేర్చుకునే పాత్ర కథ. ఈ ప్రయాణంలో ఎదురయ్యే సామాన్యుల సమస్యల్ని ఎదుర్కొంటూ వాళ్ళకి దగ్గరయ్యే, వాళ్ళలో ఒకడిగా కలిసిపోయే, ఇక తిరిగి అమెరికా దేశం వెళ్ళడంలో అర్ధంలేదని జ్ఞానోదయమయ్యే నవ యువకుడి కథ. ఇంతవరకూ బాగానే వుంది గానీ, 2013 నాటి సినిమా చూస్తిన్నట్టు సీన్లు వుంటాయి. చాలా అప్డేట్ చేసి ఇవ్వాళ్టి ప్రపంచం లోకి, ఇవ్వాళ్టి ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాల్సిన కథ. అల్లు శిరీష్ కి నటనతో కాక, డైలాగులతో కామెడీని వర్కౌట్ చేయాల్సిన, రీబూట్ చేయాల్సిన రీమేక్. మార్కెట్ యాస్పెక్ట్, క్రియేటివ్ యాస్పెక్ట్ రెండూ ఇన్నోవేట్ చేసుకోవాల్సిన ప్రొడక్షన్.

 

‘ఎబిసిడి’దర్శకత్వం : సంజీవ రెడ్డి
తారాగణం : అల్లు శిరీష్, రుక్సార్ ధిల్లాన్, మాస్టర్ భరత్, నాగబాబు, వెన్నెల కిషోర్ తదితరులు
కథ :  మార్టిన్ ప్రకట్, సంగీతం : ఛాయాగ్రహణం :
బ్యానర్స్ : మధుర ఎంటర్ టైన్మెంట్, బిగ్ బెన్ సినిమాస్ 
విడుదల : మే 17, 2019
2.25

సికిందర్