రంగారెడ్డి జిల్లా షాద్ నగర్లో విషాదం చోటు చేసుకుంది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన కంటి వెలుగు పథకంలో అపశృతి వాటిల్లింది. కంటి వెలుగు ఆపరేషన్ ఒక మహిళ ప్రాణాలను బలిగొంది. కంటి వెలుగు కోసం వెళితే ఇంటి వెలుగు ఆరిపోయిందంటూ రోదిస్తున్నారు మృతురాలి కుటుంబ సభ్యులు.
షాద్ నగర్ నియోజకవర్గం, దత్తాయపల్లికి చెందిన చెన్నమ్మ కంటి ఆపరేషన్ వికటించడంతో మరణించింది. శుక్రవారం కంటి ఆపరేషన్ కోసం కొత్తూరు సమీపంలోని LV ప్రసాద్ హాస్పిటల్ కి వెళ్ళింది చెన్నమ్మ. వైద్యులు ఆమెకు కంటి ఆపరేషన్ కోసం మత్తు మందు ఇచ్చారు. మత్తు మందు డోసు ఎక్కువ కావడంతో కోమాలోకి వెళ్లిన చెన్నమ్మ మృతి చెందింది.
కంటి చూపు మందగించిందని, కంటి వెలుగు పధకం ద్వారా కంటికి ఆపరేషన్ చేయించుకోమని డాక్టర్లు సూచించిన మేరకు LV ప్రసాద్ హాస్పిటల్ కి వెళ్లిన చెన్నమ్మ తిరిగి రాని లోకాలకు వెళ్ళింది. ఆమె చావుకి వైద్య సిబ్బంది నిర్లక్ష్యమే కారణం అంటూ మృతురాలి కుటుంబీకులు హాస్పిటల్ వద్ద ఆందోళన చేస్తున్నారు.