రాఖీ కట్టేందుకు వెళ్లనివ్వని భర్త, మహిళ ఆత్మహత్య

సికింద్రాబాద్ కుమ్మరిగూడలో విషాదం చోటు చేసుకుంది. రాఖీ కట్టడానికి సోదరుడి వద్దకు పంపలేదని మనస్థాపానికి గురైన మహిళ ఆత్మహత్య చేసుకుంది. మూడో అంతస్థు పైనుండి కిందికి దూకి ప్రాణాలు విడిచింది రాజస్థాన్ మహిళ.

రాఖీ కట్టడానికి తన అన్న వద్దకు పంపించలేదని మహిళ ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు విడిచింది. రాజస్థాన్ కు చెందిన ఉత్తమ్, దేవి దంపతులు తమ ముగ్గురు పిల్లలతో కలిసి సికింద్రాబాద్ కుమ్మరిగూడలో నివాసముంటున్నారు. పుణేలో ఉంటున్న తన అన్నకు రాఖీ కట్టడానికి పంపించాల్సిందిగా దేవి తన భర్త ఉత్తమ్ ని కోరింది. అందుకు ఉత్తమ్ నిరాకరించాడు.

దీంతో ఇద్దరి మధ్య గొడవ రాజుకుంది. మనస్థాపానికి లోనైన దేవి భర్త బయటకు వెళ్ళగానే వారు ఉంటున్న భవనం మూడో అంతస్థు నుండి కిందికి దూకింది. అది చూసిన స్థానికులు ఆమెను హాస్పిటల్ కి తరలించారు. కానీ అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయిందని డాక్టర్లు ధృవీకరించారు.

మరణించిన దేవి అన్న మహంకాళి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్యగా కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు. గాంధీ హాస్పిటల్ లో పోస్టుమార్టం పూర్తయ్యాక మృతదేహాన్ని రాజస్థాన్ కి తీసుకువెళ్లారు బంధువులు. తల్లిని కోల్పయిన దేవి ముగ్గురు పిల్లలు తీవ్రంగా రోదిస్తున్నారు.