కేటీఆర్ సీఎం అయితే రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని టీఆర్ఎస్ నేతలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే గతంలో కూడా చాలా సార్లు ‘సీఎం కేటీఆర్’ అనే అంశం తెరపైకి వచ్చింది. అయితే వాటన్నింటిని పక్కకు పెడుతూ సీఎంగా కేసీఆరే కొనసాగారు. ఇప్పుడు తాజాగా మరో మారు టీఆర్ఎస్ నాయకులు ఈ అంశాన్ని ప్రస్తావనకు తెచ్చారు. దీంతో మరోసారి ప్రజల్లో ఆలోచన మొదలైంది. ఈ సారైనా కేటీఆర్ సీఎం అవుతారా లేదా ఎప్పటి లాగానే పరిస్థితి పునరావృతం అవుతుందా అని ఎవరి అంచనాలు వారు వేసుకుంటున్నారు.
అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కేటీఆర్ను సీఎం చేసే ఆలోచన కేసీఆర్ చేయకపోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకప్పుడు కేసీఆర్కు ఎదురు ఉండేది కాదు. ఆయన పేరు చెబితే అటు ప్రతి పక్షాలు, ఇటు స్వపక్షంలోనూ అంతా భయపడేవారు. కానీ దుబ్బాక ఎన్నికల తర్వాత సీన్ మారింది. దుబ్బాకలో ఓటమితో కేసీఆర్కు పెద్ద దెబ్బ తగిలింది. గోరుపోటు మీద రోకలి దెబ్బ అన్నట్టు జీహెచ్ఎంసీ ఫలితాల్లోనూ టీఆర్ఎస్కు ఎదురుగాలి వీచింది. అపజయాల నేపథ్యంలో కేసీఆర్పై అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్లు కూడా విమర్శల ధాటిని పెంచింది. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అయితే ఏ సందు దొరికినా కేసీఆర్పై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఇటీవల కాంగ్రెస్ కూడా మాటల దాడిని పెంచింది.
ఇప్పుడున్న ఓటముల నేపథ్యంలో కేసీఆర్ తప్పుకుని కేటీఆర్ను సీఎం చేసే అవకాశాలు తక్కువ. ఒక వేళ అలా చేస్తే ఓటమిల నేపథ్యంలో అపజయాలకు తట్టుకోలేక కొడుకును ముందుకు తెచ్చి కేసీఆర్ తప్పుకున్నారని ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేసే అవకాశం ఉంది. ఇక తెలంగణలో బీజేపీ పార్టీ బలపడుతున్న ప్రస్తుత సమయంలో ఏ కొంచెం తప్పటడుగు వేసినా పార్టీకి ప్రమాదంగా మారే అవకాశం ఉంది. ఒక వేళ కేటీఆర్ను సీఎం చేస్తే ఆ విషయం జీర్ణించుకోలేని వ్యక్తులు పార్టీ నుంచి బయటకు వచ్చే అవకాశం లేకపోలేదు. ఈ నేపథ్యంలో బీజేపీకి మరింత ప్లస్ పాయింట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో కేసీఆర్ అలాంటి నిర్ణయం తీసుకోక పోవచ్చనేది విశ్లేషకుల వాదన.