ఆంధ్రప్రదేశ్ : రాష్ట్రంలో కేవలం రాజకీయ లబ్ది కోసమే సిఎం జగన్ సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు తప్ప ప్రజలమీద ప్రేమతో కానే కాదని విపక్ష పార్టీలు విమర్శలు చేస్తున్నాయి. రాష్ట్ర పరిస్థితి చివరికి ఏమవుతుందో అనే ఆలోచన లేకుండా జగన్ ఇష్టమొచ్చినట్లు నిర్ణయాలు తీసుకోవటం సబబు కాదని ప్రత్యర్ధులు వాదనని వినిపిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం తమ కార్యకర్తలను మంచి చెడూ లేకుండా అనేక విషయాలలో ప్రోత్సహిస్తూ పోతున్నారని విమర్శలు ఎక్కువగా వస్తున్నాయి. ఇదంతా రాజకీయ లక్ష్యాలను చేరుకోవటానికి వేస్తున్న నక్క జిత్తులని విపక్ష వర్గం నేతలు దయ్యబడుతున్నారు.
జగన్ సిఎం అయిన నెలల వ్యవధిలో ఏపీలో ఉద్యోగాల్లో ప్రైవేట్ కంపెనీలు స్థానికులకే 75 శాతం ఉద్యోగాలు ఇవ్వాలి అని ఒక చట్టం తీసుకొచ్చి పారిశ్రామిక వర్గాల్లో అందరికీ షాక్ ఇచ్చారు. ఈ చట్టం చూసి కొన్ని రాష్ట్రాలు ఆశ్చర్యపోతే మరికొన్ని రాష్ట్రాలు జగన్ బాటలో వెళుతున్నారు. తాజాగా సిఎం కేసీఆర్ కూడా అదే విధంగా అడుగులు వేస్తున్నట్టుగా సమాచారం. తెలంగాణాలో ఉద్యోగాలలో 60 శాతం స్థానికులకే ఇవ్వాలని సిఎం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. ఎందుకు ఏంటీ అనేది చూస్తే… తెలంగాణాలో బిజెపి యువతను టార్గెట్ చేస్తుంది. యువతకు ఉద్యోగాలు లేవు అనే అంశాన్ని ఆధారంగా చేసుకుని బిజెపి ప్రజల్లోకి వెళ్లనున్నట్లు వారు చేస్తున్న ప్రకటనలని బట్టి చూస్తే అర్ధం అవుతుంది.
తెలంగాణ రాష్ట్రంలో త్వరలో ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలోనే ఈ వ్యూహం ద్వారా యువతను ఎక్కువగా ఆకట్టుకునే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్లున్నారు. దీనిపై త్వరలో కేసీఆర్ ఒక కమిటీ కూడా వేసి ఈ కమిటీ ద్వారా ఆయన కొన్ని ప్రతిపాదనలు సిద్దం చేసి ఆ తర్వాత అమలు చేసే అవకాశం ఉందని అంటున్నారు. మంత్రులు, అధికారులతో ఆయన ఈ కమిటీ వేసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటి వరకు ఉన్న కంపెనీలు కాకుండా ఇక నుంచి వచ్చే కంపెనీల విషయంలో ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అని తెలుస్తుంది. ఈ వ్యూహాలు ప్రత్యర్థుల్ని దెబ్బతీసేందుకే అయినా రాష్ట్రాభివృద్ధి జరుగుతుంది అని పలువురు మేధావులు విశ్లేషిస్తున్నారు.