బిజెపి ఊరించి వద్దన్నది, కోదండరాం పార్టీ చేర్చుకున్నది

తెలంగాణలో  పార్టీ బలోపేతం కోసం వలసల మీద దృష్టి పెట్టిన బిజెపికి మిశ్రమ ఫలితాలు వస్తున్నాయి. నిన్నగాక మొన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ ఉపముఖ్యమంత్రి సతీమణి పద్మినీరెడ్డి బిజెపిలో చేరినట్లే చేరి 9 గంటల్లోనే వెనక్కు వెళ్లిపోయారు. ఆమె క్షణికావేశంలో నిర్ణయం తీసుకుని బిజెపిలో చేరారు. మళ్ళీ క్షణికావేశంలో నిర్ణయం తీసుకుని వెనక్కు వెళ్లిపోయారు. ఈ సంఘటన ఇలా ఉంటే మరో సంఘటన కొద్దిగా ఉల్టా ఉంది. ఆ వివరాలేంటో చదవండి.

నేషనల్ ఇన్వెస్టిగేషన్ అధారిటీ (ఎన్ఐఎ) కోర్టు  జడ్జి రవీందర్ రెడ్డి ఇటీవల తన పదవికి రాజీనామా చేశారు. ఆయన త్వరలోనే బిజెపిలో జాయిన్ అవుతున్నట్లు వార్తలొచ్చాయి. ఆయన చేరికకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. తన రాజీనామా ఆమోదం పొందగానే కాషాయ కండువా కప్పుకుంటానని ఇండికేషన్ ఇచ్చారు రవీందర్ రెడ్డి. కానీ ఆచరణలో సీన్ తేడా కొట్టింది. ఆయన బిజెపి గేటు దగ్గరి వరకు వెళ్లి వెనక్కు వచ్చారు. మందీ మార్బలంతో జాయినింగ్ అయ్యేందుకు వెళ్లిన ఆయనకు బిజెపి పెద్దలు షాక్ ఇచ్చారు. అసలు ఏం జరిగిందో ఒకసారి చూద్దాం.

జన సమితిలో చేరిన రిటైర్డ్ జడ్జి రవీందర్ రెడ్డి

జడ్జి రవీందర్ రెడ్డి పేరు తెలంగాణలోనే కాక తెలుగు రాష్ట్రాల్లో సుపరిచితమే. మక్కా మసీదు పేలుళ్ల కేసులో తీర్పు చెప్పిన జడ్జిగా రవీందర్ రెడ్డి తెలంగాణలో హాట్ టాపిక్ గా నిలిచారు. ఆయన తీర్పుతోనే కాదు.. తీర్పు వెలువరించిన కొద్ది క్షణాల తేడాతో జడ్జి రవీందర్ రెడ్డి తన పదవికి రాజీనామా చేసి సంచలనం సృష్టించారు. అంతేకాదు రాజీనామా ఆమోదం పొందే వరకు తనకు సెలవు మంజూరు చేయాల్సిందిగా హైకోర్టు చీఫ్ జస్టిస్ కు ఆయన అప్పీల్ చేసుకున్నారు. ఆయన తీర్పు వెలువరించడం, వెనువెంటనే జడ్జి పదవికి రాజీనామా చేయడం అప్పట్లో సంచలనం రేపింది.

ఈ నేపథ్యంలో మక్కా మసీదు పేలుళ్ల కేసులో నిందితులందరిని నిర్దోషులుగా తీర్పు చెప్పారు జడ్జి రవీందర్ రెడ్డి.  తీర్పు వెలువరించిన వెంటనే వ్యక్తిగత కారణాల రిత్యా తాను తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు లేఖను చీఫ్ జస్టిస్ కు పంపారు. అయితే తీర్పు నేపథ్యంలో ఏమైనా వత్తిళ్లు వచ్చాయా అన్న చర్చ కూడా జరిగింది. అదంతా పక్కన పెడితే రవీందర్ రెడ్డి బిజెపిలో చేరేందుకు ఆ పార్టీ నేతలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కానీ తర్వాత ఆయనను చేర్చుకోవడానికి నిరాకరించారు.

రవీందర్ రెడ్డి గత నెలరోజుల కిందట మందీ మార్బలంతో బిజెపి ఆఫీసుకు వెళ్లారు. అప్పటి వరకు పార్టీలో చేరాలంటూ ఆహ్వానించిన నాయకులంతా తీరా జాయినింగ్ నాడు మొహం చాటేశారు. పార్టీ అధ్యక్షలు లక్ష్మణ్ కానీ, కిషన్ రెడ్డి కానీ, ఇతర సీనియర్ లీడర్లు ఎవరూ ఆరోజు రవీందర్ రెడ్డి ఫోన్ ఎత్తలేదు. అప్పటి వరకు జాయిన్ కావొచ్చని ఆహ్వానించి తీరా ఇలా చేశారేంటబ్బా అని రవీందర్ రెడ్డి డైలమాలో పడ్డారు.

తెలంగాణ జన సమితిలో సభ్యత్వం ఇస్తున్న కోదండరాం

తర్వాత తెలిసిందేమంటే మక్కా మసీదు పేలుళ్ల కేసులో అందరినీ నిర్దోషులుగా ప్రకటిస్తూ రవీందర్ రెడ్డి తీర్పు చెప్పారు. ఇలా తీర్పు చెప్పిన జడ్జిని తమ పార్టీలో చేర్చుకుంటే తమకు నష్టం కలిగిస్తదన్న ఆందోళన బిజెపి నేతలకు పట్టుకుంది. అందుకే రవీందర్ రెడ్డి చేరికను అవాయిడ్ చేశారని తెలిసింది. బిజపి వ్యవహరించిన తీరుతో రవీందర రెడ్డి మనస్థాపం చెందినట్లు చెబుతున్నారు.

రవీందర్ రెడ్డి పక్కా తెలంగాణవాది :

జడ్జి రవీందర్ రెడ్డి స్వస్థలం కరీంనగర్ జిల్లా. ఆయన న్యాయాధికారుల సంఘంలో కీలక పాత్ర పోశించారు. రెండేళ్ల కిందట ఎపికి చెందిన జడ్జీలను తెలంగాణ జడ్జీలుగా నియమించొద్దంటూ తెలంగాణకు చెందిన 11 మంది న్యాయమూర్తులు ఆందోళన చేశారు. వారిలో రవీందర్ రెడ్డి కూడా ఉన్నారు.  న్యాయం చెప్పాల్సిన న్యాయమూర్తులే తమకు అన్యాయం జరిగిందని గొంతెత్తి ఆందోళన చేయడం అప్పట్లో న్యాయ వ్వయస్థలో సంచలనం రేపింది. అయితే ఆ సమయంలో ఆందోళన చేసిన జడ్జీలను సస్పెండ్ చేశారు. రవీందర్ రెడ్డి కూడా సస్పెండ్ అయ్యారు. తర్వాత సస్పెన్షన్ ను ఎత్తేశారు. తెలంగాణ ఉద్యమ కాలంలోనూ రవీందర్ రెడ్డి తన వంతు పాత్రను పోశించినట్లు అడ్వొకెట్స్ చెప్పుకుంటారు.

తెలంగాణ జన సమితిలో జాయిన్ అయిన సందర్భంగా రిటైర్డ్ జడ్జి రవీందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో 1600 మంది అమరులయ్యారన్నారు. ఏ ఒక్కరి వల్ల తెలంగాణ రాలేదని స్పష్టం చేశారు. మిలియన్ మార్చ్, సాగరహారం ఉద్యమం తోనే కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిందన్నారు. తెలంగాణ అంతా అవినీతిమయం అయిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అవినీతి నిర్ములన చేయాలంటే కోదండరామ్ పాలన రావాని ఆకాంక్షించారు. తెలంగాణ వచ్చుడంటే కేసిఆర్ కుటుంబ సొత్తు కాదు అని విమర్శించారు. అందరూ కలిసి కట్టుగా పనిచేస్తేనే తెలంగాణ వచ్చిందన్నారు.

జడ్జి రవీందర్ రెడ్డి జాయినింగ్ సందర్భంగా మీడియాతో మాట్లాడిన వీడియో కింద ఉంది చూడండి.

తెలంగాణ జన సమితి పార్టీలో చేరిన సందర్బంగా మాట్లాడుతున్న రవీందర్ రెడ్డి గారు - TJS Party