తెలంగాణ: రాష్ట్ర మహిళా కమిషన్ 2018 జులై నుంచి ఖాళీగా ఉన్న విషయం తెలిసిందే. ఇటీవల రాష్ట్ర మహిళా కమిషన్ను ఏర్పాటు చేయాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర తొలి మహిళా కమిషన్ ఛైర్ పర్సన్గా సునీతా లక్ష్మారెడ్డి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్లోని బుద్ధ భవన్లో కమిషన్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ కూడా పాల్గొన్నారు. ఈయనతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు కూడా పాల్గొన్నారు. మహిళా కమిషన్ సభ్యులుగా షాహీన్ ఆఫ్రోజ్, గద్దల పద్మ, కుమ్ర ఈశ్వరీబాయి, సుదాం లక్ష్మి, ఉమాదేవి యాదవ్, రేవతీరావు బాధ్యతలు స్వీకరించారు. సీఎం తమపై ఉంచిన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తామని సునీతా లక్ష్మారెడ్డి అన్నారు.
రాష్ట్ర విభజన సమయంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం త్రిపురాన వెంకటరత్నంను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్గా నియమించడంతో 2018 జులై వరకు ఆమె ఆ బాధ్యతల్లో ఉన్నారు. అనంతరం మహిళా కమిషన్ లేకపోవడంతో ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అయితే ఈ రోజు నుంచి మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి, ఆరుగురు సభ్యులు ఐదేళ్లపాటు పదవిలో కొనసాగనున్నారు.మెదక్ నుంచి మూడుసార్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలుపొందిన మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి 2019లో టీఆర్ఎస్ లో చేరారు. ఈ క్రమంలోనే ఆమెను మహిళా కమిషన్ చైర్పర్సన్ గా నియామిస్తూ అధికార పార్టీ గతనెలలో నిర్ణయం తీసుకుంది.