రజినీకాంత్ అస్వస్థత ..హైదరాబాద్ అపోలో లో అడ్మిట్

సూపర్ స్టార్ రజినీకాంత్ అస్వస్థతకు గురయ్యారు. హైబీపీతో హైదరాబాద్ జూబ్లిహిల్స్‌లోని అపోలో ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. కాసేపటి క్రితం అపోలో యాజమాన్యం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ఆయనకు ఎలాంటి కరోనా లక్షణాలులేవని.. హైబీపీతో బాధపడుతున్నట్లు వెల్లడించింది.

రజినీకాంత్ గత 10 రోజులుగా హైదరాబాద్‌ లోనే ఉన్నారు. అన్నాత్తై షూటింగ్ కోసం ఆయన నగరానికి వచ్చారు. ఐతే కొన్ని రోజుల క్రితం ఈ చిత్ర యూనిట్‌లో పలువురికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఆ తర్వాత రజినీకాంత్ క్వారంటైన్‌‌‌ కు వెళ్లారు. డిసెంబరు 22న రజినీకాంత్‌కు కరోనా పరీక్షలు చేస్తే నెగెటివ్ వచ్చింది. ఎలాంటి కరోనా లక్షణాలు కూడా లేవు.

అయితే , శుక్రవారం ఉదయం ఒక్కసారిగా బీపీ పెరగడంతో ఆయన అపోలో ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. రజినీకాంత్ ఆరోగ్య పరిస్థితిని ప్రత్యేక బృందం మానిటర్ చేస్తుందని.. బీపీలో హెచ్చుతగ్గులను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని అపోలో డాక్టర్లు తెలిపారు. బీపీ అదుపులోకి రాగానే డిశ్చార్జి చేస్తామని ప్రకటించింది.