కెసియార్ లో విషయం వీక్ అయింది, తిట్లు పీక్ లో ఉన్నాయ్…

ముఖ్యమంత్రి కెసియార్ కు ఏమయింది?

ఆయన ఉపన్యాసాలు గాడి తప్పాయి. కొండచిలువిఎంత పెద్ద జంతవునయినా చట్టేసి ఊపిరాకుండా చేసి వధించినట్లుండే కెసియార్ ఉపన్యాసాలు ఎందుకు గాడి తప్పాయి.

ఆయన  ఆవేశం డిసెన్సీ అవధులు దాటింది. స్పీచ్ లో కంటెంట్ వీక్ అయింది. తిట్లు పీక్ లోఉన్నాయి. జోకులు, ఎకసక్కాలు, అవహేళనలు మితి మీరుతున్నాయి. జోక్ వేసినపుడో , తిట్టినపుడో, ఎకసక్కం వినిపించినపుడో ఎదురుగా ఉన్న జనం చప్పట్లు గొడుతున్నారు. దాన్నుంచి ముఖ్యమంత్రి కెసియార్ ఇన్ స్పిరేషన్ పొందుతున్నారు.

కెసియార్లో మేధావి ఏమయ్యాడు? 60 వేల పుస్తకాలను అవలీలగా చదివిన  చదవరి ఏమయ్యాడు. భవిష్యత్తు గురించి లెక్క చేయకుండా తెలుగుదేశపార్టీని, ఆపార్టీ ఇచ్చిన పదవిని అలా మూసిలోపడేసి, తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టి, నడిపించి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రందాకా తీసుకొచ్చిన ఉద్యమకారుడు ఏమయ్యాడు?

కెసియా ర్ బజారు భాషలో ఎందుకు మాట్లాడుుతున్నారు? అజ్ఞానం పొంగిపొర్లుతూ ఉంది. ‘నన్ను ఓడించేందుకు కుట్ర జరుగుతూ ఉంది,’ అనడం ఏమిటి? ప్రత్యర్థులను ఓడించడమే రాజకీయం కదా. మీరు కాంగ్రెస్ ను ఓడించేందుకు టిడిపితో పొత్తులు పెట్టుకున్నారు. కాంగ్రెస్ను, టిడిపిని అసెంబ్లీ నుంచి తరిమేసేందుకు ఆ పార్టీల ఎమ్మెల్యే లను టిఆర్ ఎస్ లో  చేర్చుకున్నారు. మీరు ఏడు నెలల ముందు ఎన్నికలకు పోతున్నది కాంగ్రెస్ తో పాటు ఇతర పార్టీలన్నింటిని ఓడించేందుకు కాదా. ఇపుడు మిమ్మల్ని ఓడించేందుకు ఇతర పార్టీలు కలుస్తాయి. సిద్ధాంతాలు లేని రోజుల్లో ఏ పార్టీ ఎవరితోనైనా కలుస్తుంది. ఎవరినైనా ఓడించేందుకు పూనుకుంటుంది.

ముఖ్యమంత్రి కెసియార్ ప్రసంగం చూస్తే ఏమనిపిస్తుంది?

తెలంగాణాలో ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశమా? ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడా అనే అనుమానం వస్తుంది. నిజానికి కెసియార్ ఎపుడో తెలుగుదేశం పార్టీకి డెత్ సర్టిఫికేట్ ఇచ్చేశారు. ఇపుడాయన తాను చంపేసిన పార్టీని చూసి జడిసిపోతున్నారు. నల్గొండ సభలో ఇంతగా కనివిని ఎరగని రీతిలో చంద్ర బాబు నాయుడిని విమర్శించేందుకు కారణం ఏమయిఉంటుంది?

ఏడునెలలు ముందస్తు ఎన్నికలకు పోవలసి రావడం, తెలుగుదేశం, కాంగ్రెస్ దగ్గిరవడం. ఎన్నికల కమిషన్ 280 కోట్లు ఖర్చు పెట్టి నేయించిన బతుకమ్మ చీరెలను పంపిణీ చేయవద్దనడం… ఇలాంటి చర్యలు ఆయనను బాగా ఇబ్బంది పెడుతున్నట్లు న్నాయి. అందుకు ప్రతి బహిరంగ సభలో -ఇదిగో ఇపుడే సర్వే రిపోర్టు వచ్చింది, రెండు సీట్లు తప్ప అన్నింటా టిఆర్ ఎస్ గెలుస్తున్నది,’ అని చెప్పాల్సి వస్తున్నది.

అన్నింటికంటే, ముఖ్యంగా ఆయన చంద్రబాబు నాయుడి మీద చూపిస్తున్న ఆగ్రహానికి కారణం ఒకటుంది.  ఒక ముఖ్యమయిన ఆయుధాన్ని ఆయన ప్రయోగించలేని స్థితిలో పడిపోయారు. 2014 ఎన్నికల ముందు, జిహెచ్ ఎంసి ఎన్నికల ముందు ఆ ఆయుధాన్ని విచ్ఛలవిడిగా  ఆ ఆయుధం వాడారు.  అల్లకల్లోలం సృష్టించారు.  అయితే, ఇపుడది పనికిరావడం లేదు. ఆ ఆయుధమే ‘ఆంధ్రోళ్లు’ అని కరుకు మాట.  ఆంధ్రోళ్లని భూతంగా చూపించి  తెలంగాణ సెంటిమెంటు రాజేయడం ఆయన ప్రత్యేకత . ఇపుడాయన తొలిసారిగా ఆ పద ప్రయోగం చేయడం లేదు.  2018 ఎన్నికల ముందు ఆంధ్రోళ్లకు వ్యతిరేకంగా సెంటిమెంటు రెచ్చగొట్టే పరిస్థితి లేదు.  కెసిఆర్ చుట్టు ఆంధ్రా కాంట్రాక్టర్లే ఉన్నారు. దానికి తోడు ఆయన 110 సీట్లు గెలుస్తానంటున్నారు.  (119లో ఆయన ఏడు సీట్లు ఎంఐఎం కు వదులుతున్నారు. ఒక రెండు ప్రతిపక్షాలకు వదలుతున్నారు. అందువల్ల మిగిలినవి 110). అంటే ఆంధ్రా సెటిలర్ల ఓట్లు కావాలి. అందువల్ల 2014 ఎన్నికలపుడు చేసినట్లు, జిహెచ్ ఎం పి ఎన్నికల ముందు చేసినట్లు ఆంధ్రా తెలంగాణ పోలరైజేషన్ తెచ్చేందుకు పచ్చి ఆంధ్రా వ్యతిరేక భాష మాట్లాడటానికి వీలుకాదు. ప్రతిదాన్ని ఆంధ్రోళ్ల మీదకు నెట్టి, ఆ నరకం నుంచి తెలంగాణను కాపాడానని చెప్పుకుంటూ నాలుగేండ్ల పాటు ఆంధ్రా కాంట్రాక్లర్ల సహాయంతోనే ఆయన ‘బంగారు తెలంగాణ’ నిర్మిస్తున్నారు. క్యాబినెట్ లో  ఉమ్మడి ఆంధ్ర మద్దతుదారులుచాలా మంది ఉన్నారు. ఇలా నాలుగేళ్లు పరిపాలించాక ఆంధ్రా వ్యతిరేక ఉపన్యాసాలు సాధ్యం కాదు, ఆంధ్రా వ్యతిరేక సెంటిమెంట్ రాజేయడం మంచిదికూడా కాదు. అందువల్ల ఆయన అంబులో పదిలో ఉన్న ఒక మాంచి  ‘ఆంధ్రోళ్లు’ అస్త్రం పనికిరాకుండా పోయింది. ఆంధ్రోళ్లు అనే శత్రువు చూపినపుడు వచ్చే ఆవేశం వేరు. శత్రువు లేనపుడు ఆవేశం తెచ్చిపెట్టుకోవడం కష్టం. ఈ కష్టం ఇపుడు కెసియార్ లో కనబడుతూఉంది.

2009 ఎన్నికలపుడు చంద్రబాబు టిఆర్ ఎస్ ను గెలిపించేందుకు ప్రచారం చేశారు. అపుడాయన కెసియార్ కూతురు కవితను గెలించాలని కూడా ప్రచారం చేశారు.

ఆంధ్రోళ్లంటూ తిట్టలేకపోవడంతో వివరణాత్మకంగా , ఆమోదయోగ్యంగా, అవతలి వాళ్లను మెప్పించేలా మాట్లాడం ఆయన కు కష్టం అవుతున్నది.

అందుకే లోపుల పేరుకు పోయిన ఈ కసినంతా ఆంధ్రోడయిన చంద్రబాబు మీదకు మళ్లించి నానా యాగీ చేస్తున్నారు. చంద్రబాబును తెలంగాణ ప్రజలు మర్చిపోయారు. ఆయన్నతిడితే వచ్చేదేముండదు. ఈలలు చప్పట్లు తప్ప.   ఈ ఈలలు చప్పట్ల కోసం   ఆయన చంద్రబాబును ఏకిపడేస్తున్నారు. తాటవొల్చేస్తున్నారు. ఆయన మీద దుమ్మెత్తిపోస్తున్నారు, దొంగ అంటున్నాడు, బొడ్డులో బాకు ఉంది అంటున్నారు. అంతేకాదు, ఆయన్ని రానీయవద్దని తెలంగాణ మేధావులను వేడుకుంటున్నారు.

సెటిలర్ల వోట్ల కోసం ఆంధ్ర వ్యతిరేక భాష వాడలేక కెసియార్ పడుతున్న యాతన చంద్రబాబు దూషణలోకనిపిస్తుంది. అంతే తీవ్రంగా ఆయన తెలంగాణ కాంగ్రెస్ నేతలను కూడా తిడుతున్నారు. ఒక ముఖ్యమంత్రి ఇలాంటి భాష వాడి ఎన్నికల ప్రచారం చేపట్టడం ఇదే మొదలు.  చాలా విషయాలలో కెసియారే నెంబర్ వన్. ప్రచారం సమయంలో సవాళ్లు విసురుకోవడం, విమర్శించుకోవడం, జైలు కు పంపిస్తానడం, వ్యక్తిగత సంపాదనలను వెల్లడించడం, కుటుంబ పాలన ను విమర్శించడం వంటి విషయాలు చర్చకు వస్తుంటాయి. ఇంత భారీగా లోడ్ల కొద్ది తిట్ల ను తెలుగు రాజకీయాలకు అందించింది మాత్రం కేసియారే.ఎన్నో మంచి విషయాల్లాగే, ఈ విషయంలో కూడా కెసియార్ పేరు నిలబడిపోతుంది. కాంగ్రెస్- తెలుగుదేశం పొత్తు అనేది చాలా చిన్నవిషయం. అదే మవుతుందో ఎవరికీ తెలియదు. అయినా, ఈ పొత్తు వల్ల తలకిందులవుతున్నది మాత్రం టిఆర్ ఎస్ అధినేతయే. విషయం వీక్ యినపుడు తిట్లు పీక్ లో ఉంటాయి మరి.