“బండి సంజయ్” తో బస్తీమే సవాల్ అంటున్న మంత్రి “హరీష్ రావు”…

harish rao

తెలంగాణ: దుబ్బాక లో ఉప ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ప్రధాన ప్రత్యర్థులైన అధికార టీఆర్ఎస్, బీజేపీ నేతలు ఒకరిపై ఒకరు సవాళ్లకు తెరలేపారు. తాజాగా సిద్ధిపేటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలంగాణ మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. ప్రతిపక్ష నేతలు గోబెల్స్ ప్రచారానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. సోషల్ మీడియాలో బీజేపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఆ పార్టీ నేతలు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని అందుకే వారిని పోలీసులు అరెస్టు చేసినట్లు గుర్తు చేశారు. అలాగే తెలంగాణలో బీడీ కార్మికులకు ఇచ్చే రూ.2వేల పింఛనులో రూ.1,600 ప్రధాని మోడి ఇస్తున్నారని బిజెపి నేతలు అబద్ధాలు చెబుతున్నారని హరీశ్ రావు అన్నారు. బీడీ కార్మికులకు ఇచ్చే పింఛనులో 16 పైసలు కూడా మోడి ఇవ్వట్లేదని ఆయన చెప్పారు. మోడి డబ్బులు ఇస్తున్నట్లు నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని సవాలు విసిరారు.

harish rao
harish rao

బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బీడీ కార్మికులకు పింఛన్లు ఇవ్వట్లేదని హరీశ్ రావు వివరించారు. దుబ్బాక నుంచి “బండి సంజయ్‌కు” సవాలు విసురుతున్నానని, దుబ్బాక ప్రజల మధ్య బహిరంగ చర్చకు రావాలని ఆయన అన్నారు. తెలంగాణలో కెసీఆర్ కిట్ గురించి కూడా అసత్య ప్రచారం చేస్తున్నారని హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే కెసీఆర్ కిట్ అందిస్తున్నామని వివరించారు. అబద్ధాల పునాదుల మీద కొందరు రాజకీయాలు చేస్తున్నారని, ఇటువంటి వారు రేపు గెలిస్తే ప్రజలకు ఏం చేస్తారు? అని హరీశ్ రావు ప్రశ్నించారు. అబద్ధాల మీదే ఆధారపడి ఓట్లు సంపాదించుకుంటామంటే ఈ దుబ్బాక గడ్డ మీద నడవదని హరీశ్ రావు వ్యాఖ్యానించారు. బిజెపి నేతలు కరపత్రాల ద్వారానూ అసత్య ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. అసత్యాలు ప్రచారం చేశారు కాబట్టే హుజూర్ నగర్‌లో బిజెపికి నాలుగో స్థానం వచ్చిందని, దుబ్బాక ప్రజలు కూడా బండి సంజయ్‌కు హరీశ్‌ రావు సవాలుకి గుణపాఠం చెబుతారని ఆయన అన్నారు. ఎప్పుడైనా అంతిమంగా ధర్మానిదే విజయమని హరీశ్ రావు చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టుకి జాతీయ హోదా ఇవ్వాలని అడిగామని, రాష్ట్ర బిజెపి నేతలు సమర్థులైతే అది తీసుకురావాలని ఆయన సవాలు విసిరారు. దీనికి సంజయ్ ఎలా సమాధానమిస్తాడో అని ప్రజలు కుతుహులంగా ఎదురు చూస్తున్నారు.