సినిమా షూటింగ్ లో పేలిన సిలిండర్.. తల్లి బిడ్డల మృతి

కన్నడ నటుడు చిరంజీవి సర్జా నటిస్తున్న ‘రణం’ సినిమా చిత్రీకరణలో పెను ప్రమాదం చోటుచేసుకుంది. బెంగళూరులోని బాగలూరు వద్ద సినిమా చిత్రీకరణ జరుగుతుండగా గ్యాస్ సిలిండర్ ఒక్కసారిగా పేలడంతో తల్లీబిడ్డలు మృతి చెందారు. సినిమా షూటింగ్‌లో భాగంగా కారును బ్లాస్ట్ చేసే దృశ్యాలను చిత్రీకరిస్తున్నారు.

ఈ క్రమంలో ప్రమాదవశాత్తు సిలిండర్ పేలింది. దీంతో షూటింగ్ చూసేందుకు వచ్చిన సయేరా భాను, ఆమె ఐదేళ్ల చిన్నారి అయిషా ఖాన్ (5) ప్రాణాలు కోల్పోయారు. మరో చిన్నారి తీవ్రంగా గాయపడింది.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను యలహంక ఆసుపత్రికి తరలించారు. గాయపడిన మరో చిన్నారిని మరో ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

 ఘటనపై మరో నటుడు చేతన్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశాడు. మృతుల కుటుంబాలకు తనవంతు సాయం చేస్తానని హామీ ఇచ్చాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారిని పరామర్శిస్తానని చెప్పాడు. కాగా, పేలుడు అనంతరం చిత్ర యూనిట్ అక్కడి నుంచి పరారు కాగా, నటుడు చిరంజీవి సర్జా మరో షూటింగ్‌ కోసం మైసూర్ వెళ్లిపోయాడు.