ఐదుగురు మంత్రుల కొడంగల్ టూర్, రేవంత్ ఇంటివద్ద టెన్షన్ (వీడియో)

కొడంగల్ రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి. కొడంగల్ నియోజకవర్గంపై పట్టు బిగించేందుకు టిఆర్ఎస్ పార్టీ వేగంగా పావులు కదుపుతున్నది. తాజాగా శనివారం కొడంగల్ లో ఐదుగురు మంత్రుల పర్యటన ఉంది. కోస్గిలో బస్ స్టేషన్ ప్రారంభోత్సవంలో మంత్రులు హరీష్ రావు, జూపల్లి కృష్ణారావు, పట్నం మహేందర్ రెడ్డి, నాయిని నర్సింహ్మారెడ్డి, అవంచ లక్ష్మారెడ్డి పాల్గొనేందుకు ఏర్పాట్లు జరిగాయి.

రంగారెడ్డి జిల్లా మోయినాబాద్, షాబాద్ లలో పార్టీ జెండాలు ఎగురవేసి కొడంగల్ పర్యటన కు బయలు దేరారు మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, హరీష్ రావు, మహేందర్ రెడ్డి. వారితోపాటు టిఆర్ఎస్ యూత్ నేత పట్నం అవినాష్ రెడ్డి ఆధ్వర్యంలో వంద వాహనాల్లో భారీ కాన్వాయ్ కొడంగల్ బయలుదేరింది.

అయితే అదే సమయంలో కొడంగల్ లో భారీ ర్యాలీ నిర్వహించేందుకు స్థానిక ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కూడా ప్లాన్ చేసుకున్నారు. అయితే బైక్ ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు చెప్పినట్లు తెలిసింది. రేవంత్ కొడంగల్ లోని రేవంత్ ఇంటి వద్ద పోలీసులు మొహరించారు. డిఎస్పీ ఆధ్వర్యంలో పోలీసులు రేవంత్ ఇంటి వద్దకు చేరుకున్నారు. ఐదుగురు మంత్రులు కొడంగల్ పర్యటనలో ఉన్న నేపథ్యంలో కొడంగల్ లో వాతావరణం వేడెక్కింది. రెండు పార్టీలు బల ప్రదర్శనకు దిగనుండడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రేవంత్ ఇంటి వద్దకు ఇటు కార్యకర్తలు, అటు పోలీసులు భారీగా చేరుకుంటున్నారు.

కొడంగల్ లోని రేవంత్ రెడ్డి ఇంటి ముందు పరిస్థితి కింద వీడియోలో ఉంది చూడండి.