ఫ్లాష్ న్యూస్… కొడంగల్ బంద్ కు రేవంత్ రెడ్డి పిలుపు

ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది కొడంగల్ లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతున్నాయి. కొడంగల్ కాంగ్రెస్ అభ్యర్ధి రేవంత్ రెడ్డి డిసెంబర్ 4 న కొడంగల్ బంద్ కు పిలుపునిచ్చారు. తన అనుచరులపై, తన ఇళ్ళ పై అక్రమ దాడులు చేసి వేధిస్తున్నారని దానికి నిరసనగా 4 వ తేదిన కొడంగల్ బంద్ కు పిలుపునిస్తున్నట్ట రేవంత్ రెడ్డి ప్రకటించారు. అదే రోజు కొడంగల్ లో కేసీఆర్ పర్యటన ఉంది.

కేసీఆర్ పర్యటనను అడ్డుకుంటామని రేవంత్ తెలిపారు. ఏమైనా జరిగితే గవర్నర్, డిజిపిలదే బాధ్యత అని రేవంత్ ప్రకటించారు. దీంతో కొడంగల్ లో డిసెంబర్ 4 వతేదిన ఏం జరుగుతుందో అన్న టెన్షన్ మొదలైంది. రేవంత్ ప్రకటనతో అలర్ట్ అయిన పోలీసులు ఆదివారం ఉదయం నుంచే కీలక ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించారు.  రేవంత్ ఏమన్నారంటే…

“తెలంగాణలో పోలీసుల రాజ్యం నడుస్తుంది. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి కను సైగల్లో పోలీసులు నడుస్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటించన నాటి నుంచి నాపైన, నా కార్యకర్తల పైన వేధింపులకు పాల్పడుతున్నారు. నన్ను మావోయిస్టుల ముసుగులో చంపేందుకు కుట్ర పన్నారు. నా కార్యకర్తల ఇండ్లల్లో అర్ధరాత్రి దాడులు చేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. నన్ను దైర్యంగా ఎదుర్కొనే దమ్ము లేక చిల్లర రాజకీయాలు చేస్తున్నారు. కచరా రాజకీయాలకు ఘోరి  కడుతాం. నన్ను, నా అనుచరులను వేధిస్తున్నందుకు నిరసనగా డిసెంబర్ 4 వ తేదిన కొడంగల్ బంద్ కు పిలుపునిస్తున్నాను. మహా కూటమి శ్రేణులు ఈ బంద్ ను విజయవంతం చేయాలి. డిసెంబర్ 4 వ తేదినాడు కేసీఆర్ పర్యటన ఉంది. ఎవరి పర్యటన ఉన్నా సరే మా బంద్ ను విరమించం. అవసరమైతే కేసీఆర్ కు మా సత్తా ఏమిటో చూపిస్తాం. బంద్ సంధర్భంగా ఏమైనా అవాంఛనీయ సంఘటనలు జరిగితే కేసీఆర్, గవర్నర్, తెలంగాణ డిజిపిలదే బాధ్యత. మేం శాంతియుతంగానే బంద్ నిర్వహిస్తాం. రెచ్చగొడితే మాత్రం ఊరుకోం” అంటూ రేవంత్ ప్రకటించారు.

కొడంగల్ లో శనివారం అర్ధరాత్రి ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. రేవంత్ రెడ్డి ముఖ్య అనుచరుడు, కొడంగల్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు యూసుఫ్, ఆయన అన్న ముస్తాక్ ల ఇళ్ల పై ఫ్లయింగ్ స్కాడ్ అధికారులు దాడులు నిర్వహించారు. అర్ధరాత్రి ఇంట్లోకి వచ్చి కనీస మర్యాద లేకుండా ప్రవర్తించారని రేవంత్ అనుచరులు ఆరోపిస్తున్నారు. ఇంట్లో ఏం లేవని చెప్పినా కూడా దౌర్జన్యంగా దాడులు చేశారన్నారు.

పోలీసులు సోదాలు చేస్తున్నారన్ని విషయం తెలుసుకొని కాంగ్రెస్ పార్టీ అనుచరులు అక్కడికి భారీ సంఖ్యలో చేరుకున్నారు. పోలీసులతో వారు వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సోదాల విషయం తెలుసుకున్న రేవంత్ రెడ్డి అక్కడకు చేరుకొని రోడ్డు పై బైఠాయించారు. యూసుఫ్ ఇంట్లో ఏం దొరికాయో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

కార్యకర్తలు కూడా భారీ సంఖ్యలో అక్కడకు చేరుకొని ఆందోళన నిర్వహించడంతో అక్కడ టెన్షన్ వాతావరణ నెలకొంది. పోలీసుల పై మహిళా కార్యకర్తలు కూడా విరుచుకుపడ్డారు. అర్ధరాత్రి ఇంట్లో ఆడవారు ఉన్నారన్న కనీసం ఇంగితం లేకుండా ప్రవర్తిస్తారా అంటూ వారు నిలదీశారు. ఏం దొరికాయో చెప్పాలని  పోలీసులను రేవంత్ డిమాండ్ చేశారు. వారు ఏం దొరకలేదు అని చెప్పగా లిఖిత పూర్వకంగా రాసివ్వాలని రేవంత్ పట్టు బట్టారు.

తన పై భౌతిక దాడులకు కుట్ర పన్నుతున్నారని తాను ఎటువంటి పరిస్థితినైనా ఎదురిస్తానని రేవంత్ అన్నారు. తనను, తన అనుచరులన వేధిస్తున్నారని తమను ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినా భయపడేది లేదని రేవంత్ అన్నారు. పోలీసులు టిఆర్ఎస్ కు అనుకూలంగా వ్యవహరించి తమ పై కుట్ర పన్నుతున్నారని రేవంత్ విమర్శించారు. రేవంత్ ఆందోళన వీడియో కింద ఉంది చూడండి. 

ఇదే సమయంలో బొంరాస్ పేట లో రేవంత్ మరో అనుచరుడు రాం చందర్ రెడ్డి ఇంట్లో సోదాలు చేశారు. సోదాలు విషయం తెలుసుకొని అక్కడికి రేవంత్ సోదరుడు కొండల్ రెడ్డి చేరుకున్నారు. దీంతో అక్కడ పోలీసులకు కొండల్ రెడ్డికి మధ్య వాగ్వాదం నెలకొంది. వీటన్నింటి నేపథ్యంలో రేవంత్ కొడంగల్ బంద్ కు పిలుపునిచ్చారు. దీంతో డిసెంబర్ 4 వతేది ఏం జరుగబోతుందో అని అందరిలో టెన్షన్ మొదలైంది.