మహా కూటమిలో ‘‘జానా స్కెచ్’’, ఇరకాటంలో కోదండరాం

తెలంగాణలో మహా కూటమి లోపలి రాజకీయాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. సీట్ల ఖరారులో చిక్కుముళ్లు వచ్చుకోవడంలేదు. ఒకవైపు నామినేషన్ల ప్రక్రియ షురూ అయినా ఏ సీటు ఎవరికో తేలక కూటమి పార్టీల్లో గుబులు మొదలైంది. ఈ పరిస్థితుల్లో కూటమి కుదురుకోవడంలేదు… ప్రచారానికి సమయం కూడా లేదని టిజెఎస్ అధినేత కోదండరాం ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో కూటమిలో తెలంగాణ జన సమితికి కాంగ్రెస్ సీనియర్ నేత కె.జానారెడ్డి పొగ పెడుతున్నట్లు గుసగుసలు వినబడుతున్నాయి.  ఆ వివరాలేంటో జన సమితి వర్గాల ద్వారా అందిన సమాచారం చదవండి.

తెలంగాణ జన సమితికి కూటమిలో 8 సీట్లు ఇస్తామని అంగీకారం కుదిరింది. అయితే జన సమితి అడిగే సీట్లలో ప్రాధాన్యత ఉన్న సీటు మిర్యాలగూడ. కానీ ఆ సీటును ఇచ్చేందుకు కాంగ్రెస్ ససేమిరా అంటున్నది. ఆ సీటులో మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కె.జానారెడ్డి తనయుడు రఘువీర్ రెడ్డి కోసం చివరి వరకు ప్రయత్నాలు చేశారు జానారెడ్డి.

మిర్యాలగూడ నియోజకవర్గంలో జానాకు మాంచి పట్టుంది. ఆయన పోటీ చేస్తున్న నాగార్జున సాగర్ పక్కనే ఉంటుంది. గతంలో చలకుర్తి నియోజకవర్గంగా ఉన్నప్పటి నుంచి జానాకు మిర్యాలగూడ బెల్ట్ లో బలం ఉంది. అందుకే మిర్యాలగూడ సీటును తన కొడుకు రఘువీర్ రెడ్డికి, నాగార్జున సాగర్ తనకు కావాలని అడుగుతూ వచ్చారు. కానీ అధిష్టానం ససేమిరా అన్నది. ఒక కుటుంబానికి ఒక సీటు ఇస్తామని తేల్చింది. సీటు నీకా? నీ కొడుకుకా? తేల్చుకో అంటూ రాహుల్ స్పష్టం చేశారు.

ఢిల్లీకి వెళ్లి మరీ జానారెడ్డి ప్రయత్నాలు చేసినా ఫలించకపోవడంతో జానారెడ్డి ప్లాన్ బి బయటకు తీశారు. అదేమంటే? మిర్యాలగూడ సీటు కూటమిలో భాగంగా తెలంగాణ జన సమితికి ఖరారైంది. కానీ ఆ సీటులో తెలంగాణ జన సమితి చెబుతున్న అభ్యర్థి కాకుండా తాను సూచించిన అభ్యర్థిని నిలబెట్టాలంటూ జానారెడ్డి కోదండరాం పై వత్తిడి తెస్తున్నట్లు జన సమితి వర్గాల్లో టాక్ నడుస్తోంది. అలా అయితేనే మిర్యాలగూడ సీటును గెలిపించేదుకు తాను పూచీ తీసుకుంటానని ఆయన అంటున్నట్లు వార్తలొస్తున్నాయి. లేకపోతే తనకు సంబంధం లేదని చెబుతన్నట్లు కూడా అంటున్నారు.

అయితే మిర్యాలగూడ సీటులో జన సమితి నేత విద్యాధరర్ రెడ్డి కి టికెట్ కావాలని కోదండరాం పట్టుపడుతున్నారు. ఆ సీటు కోసం కోదడరాం సీరియస్ గా ప్రయత్నాల్లో ఉన్నారు. విద్యాధర్ రెడ్డి జెఎసి లో కీలక భూమిక పోశించినట్లు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఆయనకు సీటు ఇవ్వకుండా జన సమితిలోనే తన వియ్యంకుడి సోదరుడైన మేరెడ్డి  విజయేందర్ రెడ్డికి ఇవ్వాలని జానారెడ్డి ఇన్ సైడ్ పాలిటిక్స్ చేస్తున్నట్లు చెబుతున్నారు. అయితే తన కొడుకుకు లేదంటే తన వియ్యంకుడి సోదరుడికి కూటమి టికెట్ ఇప్పించుకోవాలన్న ప్రయత్నాల్లో జానారెడ్డి తలమునకలయ్యారు. 

చివరి వరకు తన కుమారుడికి టికెట్ కోసం ప్రయత్నాలు చేసి విఫలమైన జానారెడ్డి తాజాగా తన కొడుకుకు లేకపోయినా కనీసం తన వియ్యంకుడి బ్రదర్ కు అయినా జన సమితిలో టికెట్ ఇవ్వాలంటూ ప్రయత్నాలు చేయడం జన సమితికి ఇబ్బందికరంగా మారింది. కానీ జన సమితి మాత్రం విద్యాధర్ రెడ్డినే బరిలోకి దింపేందుకు పావులు కదుపుతోంది. మరి కూటమి రెబెల్ గా మిర్యాలగూడలో జానారెడ్డి బంధువు బరిలోకి దిగుతాడా అన్న చర్చ ఇప్పుడు షురూ అయింది.