తెలంగాణ కాంగ్రెస్ కు మరో షాక్

లోక్‌సభ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీకి దెబ్బ మీద దెబ్బ పడుతోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా ’హ్యాండ్‌’  ఇస్తున్నారు. ఇప్పటికే పలువురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో చేరిన విషయం తెలిసిందే. మరోవైపు మాజీమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్‌ నేత సబితా ఇంద్రారెడ్డి కూడా టీఆర్‌ఎస్‌లో చేరబోతున్నారు. తాజాగా ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గ  ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌ రెడ్డి …కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేశారు.

త్వరలో కారు ఎక్కనున్న ఆయన  గురువారం టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ను కలిశారు. అనంతరం కందాల మాట్లాడుతు…త్వరలో తాను టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు వెల్లడించారు. కాగా ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కందాల ఉపేందర్‌ రెడ్డి…టీఆర్‌ఎస్‌ అభ్యర్థి, మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావుపై గెలుపొందారు. అయితే ఖమ్మం జిల్లాలో టీఆర్‌ఎస్‌ కొన్నిచోట్ల …బలహీనంగా ఉండగా, రానున్న లోక్‌ సభ ఎన్నికల నేపథ్యంలో కందాల చేరిక టీఆర్‌ఎస్‌కు లబ్ది కానుంది.

ఇక ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు … ఆ పార్టీని వీడి టీఆర్‌ఎస్‌లో చేరారు. అలాగే  పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు, ఇల‍్లందు ఎమ్మెల్యే హరిప్రియా నాయక్‌… టీఆర్‌ఎస్‌లో చేరనున్నట్లు ప్రకటన చేసిన విషయం విదితమే.