చెన్నై టెస్ట్ : టీమిండియా ఘోర ఓటమి !

ఇంగ్లండ్‌తో జ‌రిగిన తొలి టెస్ట్‌లో టీమిండియా దారుణ ప‌రాజ‌యం పాలైంది. అనూహ్య‌మైన బౌన్స్‌, ట‌ర్న్‌తో పిచ్చెక్కించిన చివ‌రి రోజు పిచ్‌పై రెండు సెష‌న్ల పాటు కూడా నిల‌వ‌లేక చేతులెత్తేసింది. ఈ మ్యాచ్‌లో 227 ప‌రుగుల భారీ తేడాతో గెలిచిన ఇంగ్లండ్ 4 టెస్ట్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.

చెన్నై టెస్ట్‌లో టీమిండియా ఘోర ప‌రాజ‌యం

కెప్టెన్ కోహ్లి (72) కాసేపు పోరాడినా.. టీమ్ ఓట‌మిని మాత్రం అడ్డుకోలేక‌పోయాడు. మిడిలార్డ‌ర్‌లో ర‌హానే (0), పుజారా (15), పంత్ (11), సుంద‌ర్ (0) దారుణంగా విఫ‌ల‌మ‌వ‌డం టీమిండియా కొంప ముంచింది. రెండోఇన్నింగ్స్‌లో టీమ్ కేవ‌లం 192 ప‌రుగుల‌కే ఆలౌటైంది.వికెట్ న‌ష్టానికి 39 ప‌రుగుల‌తో చివ‌రి రోజు రెండో ఇన్నింగ్స్ కొన‌సాగించిన టీమిండియా ఓట‌మి తొలి సెష‌న్‌లోనే దాదాపు ఖ‌రారైంది.

ఇంగ్లండ్ పేస్ బౌల‌ర్ అండ‌ర్స‌న్ ధాటికి టీమ్ మిడిలార్డ‌ర్ పేక‌మేడ‌లా కుప్పకూలింది. స్కోరు 58 ప‌రుగుల ద‌గ్గ‌ర ఉన్న‌ప్పుడు పుజారా (15) ఔట‌య్యాడు. ఆ త‌ర్వాత క్రీజులోకి వ‌చ్చిన కోహ్లి.. శుభ్‌మ‌న్ గిల్‌తో క‌లిసి కొంత భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పాడు. ఈ క్ర‌మంలో గిల్ హాఫ్ సెంచ‌రీ చేశాడు. అయితే ఆ వెంట‌నే టీమ్ స్కోరు 92 ప‌రుగుల ద‌గ్గ‌ర గిల్ ఔట‌వ‌డంతో ప‌త‌నం మొద‌లైంది.