పింక్ బాల్ టెస్ట్ : ఆసీస్ ఘనవిజయం .. చిత్తుచిత్తుగా ఓడిన కోహ్లీ సేన !

ఇండియా తో జరిగిన పింక్‌బాల్‌ టెస్టులో ఆసీస్‌ 8 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది. కోహ్లీ సేన విధించిన 90 పరుగులు టార్గెట్‌ ను ఆతిథ్య జట్టు రెండు వికెట్లు కోల్పోయి చేధించింది. జో బర్స్న్‌ అర్థసెంచరీతో మెరవగా, వేడ్‌ 33, లబుషేన్‌ 6 పరుగులు చేశారు. దాంతో.. నాలుగు టెస్టుల సిరీస్‌‌లో 1-0తో ఆస్ట్రేలియా ఆధిక్యం సాధించగా.. మెల్‌బోర్న్ వేదికగా డిసెంబరు 26 నుంచి రెండో టెస్టు మ్యాచ్ ప్రారంభంకానుంది.

కాగా తొలి ఇన్నింగ్స్‌ లో భారత్‌ 244 పరుగులకు ఆలౌట్‌ కాగా, ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌ లో 191 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. ఈ విజయంతో పింక్‌ బాల్‌టెస్టుల్లో ఆసీస్‌ వరుసగా ఎనిమిదో విజయం సొంతం చేసుకొని తన రికార్డును మరింత పటిష్టపరుచుకుంది. కాగా అంతకముందు ఓవర్‌నైట్‌ స్కోరు 9/1తో బరిలోకి దిగిన టీమిండియా ఇన్నింగ్స్‌ మూడో రోజు పేకమేడలా కుప్పకూలింది.

భారత జట్టు 21.2 ఓవర్లు మాత్రమే ఆడి 36 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ ముగించింది. కేవలం 27 పరుగుల వ్యవధిలో మిగిలిన 9 వికెట్లు చేజార్చుకున్న టీమిండియా టెస్టుల్లో ఒక ఇన్నింగ్స్‌లో అత్యల్ప స్కోరును నమోదు చేసింది.