ఇలాగైతే ‘వైసీపీ’కి విజయవాడలో కష్టమే?

YCP is looking to win the Vijayawada local elections

విజ‌య‌వాడ: నగరంలో మ‌రి కొద్ది నెలల్లో మునిసిప‌ల్ కార్పొరేష‌న్‌కు ఎన్నిక‌లు జరిగే అవకాశం ఉంది. ఆంధ్ర ప్రదేశ్ లో ప్రతిష్టాత్మక‌మైన ఈ కార్పొరేష‌న్‌ను గ‌తంలో టీడీపీ గెలిచింది. ఆ పార్టీ నేత కోనేరు శ్రీధ‌ర్ మేయ‌ర్‌గా ప‌నిచేశారు. ఎట్టి పరిస్థితితుల్లోనూ ఈసారి స్థానిక ఎన్నిక‌ల్లో విజ‌య‌వాడ మునిసిప‌ల్ కార్పొరేష‌న్‌ను వైసీపీచేజిక్కించుకోవాలని చూస్తుంది. నిజానికి బెజ‌వాడ‌లో ఇప్పటి వ‌ర‌కు వైసీపీ పాగా వేసింది లేదు. గ‌త స్థానికంలోనూ ఆశించిన సీట్లు రాలేదు. సెంట్రల్ నియోజ‌క‌వ‌ర్గంలో మూడు చోట్ల, ప‌శ్చిమ‌లో ఏడు చోట్ల విజ‌యం ద‌క్కించుకుంది. తూర్పు నియోజ‌క‌వ‌ర్గంలో తొమ్మిది చోట్ల మొత్తంగా వైసీపీ 19 డివిజ‌న్లకే ప‌రిమిత‌మైంది.

YCP is looking to win the Vijayawada local elections
YCP is looking to win the Vijayawada local elections

విజ‌య‌వాడ‌లో ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ మంత్రి వెలంప‌ల్లి శ్రీనివాస‌రావు ఎమ్మెల్యేగా ఉన్నారు. సెంట్రల్ కూడా వైసీపీ ఖాతాలోనే ఉంది. ఇక్కడ నుంచి మ‌ల్లాది విష్ణు సీనియ‌ర్ నాయ‌కుడిగా చ‌క్రం తిప్పుతున్నారు. తూర్పులో ఓడిపోయినా.. యువ నేత దేవినేని అవినాష్ మంచి దూకుడుగా ముందుకు సాగుతున్నారు. ఈ ప‌రిణామాల‌తో వైసీపీ ఇక్కడ గెలుపు గుర్రం ఎక్కాల‌ని ద్రుఢంగా నిర్ణయించుకుంది. పైగా పార్టీ అధికారంలో ఉండ‌డం.. కీల‌క‌మైన విజ‌య‌వాడ కార్పొరేష‌న్‌ను గెలుచుకుని టీడీపీని నియంత్రించాల‌ని ఇప్పటికే నిర్ణయించుకున్న నేప‌థ్యంలో ఈ ముగ్గురు నేత‌ల‌కు ప‌రీక్ష కానుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

అయితే ఇక్కడ వైసీపీ గెలుపు అంత స‌ులువు కాదు. రాజ‌ధాని వికేంద్రీక‌ర‌ణ నేప‌థ్యంలో కృష్ణా, గుంటూరు జిల్లాల ప్రజ‌ల్లో వైసీపీపై ఎంతో కొంత వ్యతిరేక‌త ఉన్నది నిజం. విజ‌య‌వాడ‌లోనూ ఈ ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి. ఈ ప‌రిస్థితుల్లో వైసీపీ ఇక్కడ ఏటికి ఎదురీది గెల‌వాలి. విజ‌య‌వాడ కార్పొరేష‌న్ విష‌యానికి వ‌స్తే.. గత ఎన్నికల సమయానికి బెజవాడలో 59 డివిజన్లు ఉన్నాయి. ఇప్పుడు వీటి సంఖ్య 64కు పెరిగింది. దీంతో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు తన నియోజకవర్గం నుంచి ఎక్కువ మందిని గెలిపించుకోవాల్సిన అవ‌స‌రం ఉంది. అదేవిధంగా సెంట్రల్‌ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కూడా అదే రేంజ్‌లో ప్రయ‌త్నాలు చేస్తున్నారు. పైగా ప‌శ్చిమం, సెంట్రల్ లో అధికార పార్టీ నుంచి మంత్రి, బ్రాహ్మణ కార్పొరేష‌న్ చైర్మన్ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. వీరికి ఈ ఎన్నిక‌లు చాలా కీల‌కం.

ఇక‌, తూర్పు నియోజకవర్గంలో పార్టీ మారి ఇన్‌చార్జ్ అయిన‌ దేవినేని అవినాష్‌ సైతం తన బలం నిరూపించుకోవాలని చూస్తున్నారు. అయితే.. ఇక్కడ కీల‌క‌మైన రెండు విష‌యాలు వైసీపీకి అవ‌రోధంగా మారుతున్నాయి. విజ‌య‌వాడ‌లో టీడీపీ స్ట్రాంగ్‌గా ఉంది. ఇప్పటికే ఆ పార్టీ మేయ‌ర్ అభ్యర్థిగా ఎంపీ కేశినేని నాని కుమార్తె శ్వేత‌ను ప్రచారం చేస్తున్నారు. ఇక‌, మ‌రో కీల‌క‌మైన విష‌యం .. రాజ‌ధాని అమ‌రావ‌తి. విజ‌య‌వాడ‌కు స‌మీపంలో ఉండ‌డం. విజ‌య‌వాడ కూడా రాజ‌ధానిలో భాగంగా ఉండ‌డం. ఇప్పుడు రాజ‌ధాని త‌ర‌లిపోతే.. విజ‌య‌వాడ‌లో ఉన్న రియ‌ల్ వ్యాపారులు తీవ్రంగా న‌ష్టపోతారు.రాజ‌ధాని మార్పు అంశంపై త‌మ జీవితంపై ఎంతో ప్రభావం చూపుతుంద‌ని న‌గ‌ర ప్రజ‌లు ఆలోచ‌న చేస్తున్నారు. దీంతో ఈ రెండు స‌మ‌స్యల‌ను స్థానిక వైసీపీ నాయ‌కులు, కార్యక‌ర్త‌లు ఎలా అధిగ‌మిస్తారు ? ఎలా ముందుకు సాగుతారు ? అన్నది చూడాలి. ఏదేమైనా బెజ‌వాడ కార్పొరేష‌న్ ఎన్నిక‌ పై ముగ్గురు నేత‌ల‌కు అగ్ని ప‌రీక్షగా మారింద‌నే చెప్పాలి.